కోడళ్ల వల్లే ఎస్పీలో ముసలం?: అపర్ణతో అఖిలేష్కు చెక్!
కోడళ్ళ మద్య ప్రఛ్చన్నయుద్దం కూడ సమాజ్ వాదీ పార్టీపై పడింది. చిన్న కోడలు అపర్ణ రాజకీయ రంగ ప్రవేశం ద్వారా అఖిలేష్ కు చెక్ పెట్టాలని శివపాల్ వర్గం భావిస్తోంది.
న్యూడిల్లీ:'సమాజ్ వాదీ పార్టీలో సంక్షోభం వెనుక కోడళ్ళ పాత్ర కూడ ఉందనే ప్రచారం కూడ సాగుతోంది.తండ్రి కొడుకుల మధ్య ఆధిపత్య ోరాటానికి కోడళ్ళు కూడ ప్రధాన కారణమనే ఆరోపణలు కూడ వెల్లువెత్తుతున్నాయి. ములాయం చిన్న కోడలు అపర్ణకు శివపాల్ యాదవ్ అండగా నిలుస్తున్నారు.అయితే అఖిలేష్ కు అండగా ఆయన సతీమణి డింపులు నిలిచారు. డింపుల్ ఈ ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టడంతో అఖిలేష్ వ్యూహత్మకంగా పావులు కదుపుతున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
ములాయం సింగ్ యాదవ్ ను తప్పించి పార్టీ జాతీయ అధ్యక్ష పగ్గాలను అఖిలేష్ యాదవ్ తీసుకొన్నాడు.అంతేకాదు పార్టీలో మెజార్టీ నాయకులు అఖిలేష్ వైపే నిలిచారు. ఇదిలా ఉంటే పార్టీ ఎన్నికల గుర్తును తమకే ఇవ్వాలని అఖిలేష్, ములాయం వర్గాలు ఎన్నికల కమీషన్ ను ఆశ్రయించాయి.
ఇద్దరి మద్య పార్టీ సీనియర్ నాయకుడు ,మంత్రి ఆజంఖాన్ రాజీ మార్గాన్ని కుదిర్చాడని చెబుతున్నారు.అయితే ఈ విషయమై ఇంకా పార్టీ నుండి స్పష్టమైన సంకేతాలు రాలేదు.అయితే ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో రెండు గ్రూపుల మద్య రాజీ నెలకొంటుందా అనేది చర్చ సాగుతోంది.
సైకిల్ పార్టీ సంక్షొభానికి తెరవెనుక అనేక కారణాలున్నాయనే ప్రచారం సాగుతోంది. అయితే ములాయం సింగ్ ఇద్దరు కోడళ్ల మద్య ఆదిపత్య పోరు ప్రధానంగా పార్టీలో సమస్యలకు కారణమైందని చెబుతున్నారు. ఈ పరిస్థితులే పార్టీ రెండు గ్రూపులుగా చీలిపోయేందుకు కారణమైందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ములాయం సింగ్ కోడళ్ళ మధ్య ఆధిపత్య పోరే సంక్షోభానికి కారణమా
ములాయం సింగ్ యాదవ్ ఇద్దరు కోడళ్ళ మద్య ఆదిపత్య పోరు సాగుతోంది. అయితే ములాయం సింగ్ చిన్న కోడలు అపర్ణ రాజకీయరంగ ప్రవేశం వ్యవహారం ప్రధానంగా పార్టీలో సమస్యకు కారణమైందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.ములాయం సింగ్ రెండో భార్య సాధన ఒత్తిడి కారణం కూడ పార్టీలో సమస్యలకు కారణమైందనే అభిప్రాయాన్ని పార్టీ నాయకులు వ్యక్తం చేస్తున్నారు. సమాజ్ వాదీ పార్టీలో సంక్షోభానికి ములాయం కోడళ్ళదే కీలకపాత్ర అనే ప్రచారం కూడ ఉంది. సాధన తన కొడుకు ప్రతీక్ ను ములాయం సింగ్ కు రాజకీయ వారసుడిగా చేయాలని కోరుతున్నారు. రాజకీయాలు కాదని రియల్ ఏస్టేట్ రంగాన్ని ఎంచుకొన్న ప్రతీక్ స్థానంలో ఆయన సతీమణి అపర్ణను రాజకీయరంగంలోకి అత్త సాధన దింపింది. అపర్ణ రాజకీయ రంగ ప్రవేశం సమాజ్ వాదీ పార్టీలో కుంపటికి కారణమైందని అఖిలేష్ సన్నిహితులు చెబుతున్నారు.
ప్రమాదాన్ని ముందే పసిగట్టిన అఖిలేష్ సతీమణి డింపుల్
2012 లోనే అఖిలేష్ యాదవ్ ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాద్యతలను చేపట్టే సమయంలోనే అఖిలేష్ స్థానంలో సాదన తన కొడుకు ప్రతీక్ ను రంగంలోకి తీసుకురావాలని భావించారు. అయితే అది సాధ్యపడలేదు. దీంతో కోడలు అపర్ణను రాజకీయాల్లోకి దింపింది సాధన. ఈ విషయంలో తోటి కోడలును రంగంలోకి దింపడంతో తన భర్తకు ప్రమాదం ఉందని డింపుల్ పసిగట్టింది.అయితే ఈ పరిస్థితులను ముందే అంచనావేసిన డింపుల్ తన భర్త అఖిలేష్ యాదవ్ ను హెచ్చరించింది. ఈ హెచ్చరికలతో అఖిలేష్ ప్రతిరోజూ తండ్రిని కలుస్తూండేవాడు. అయినా ప్రమాదం తప్పకపోవచ్చనే భావనతో తన నివాసాన్ని తండ్రి నివాసం పక్కకే మార్చాడు. శివపాల్ యాదవ్, అపర్ణ శిబిరం వ్యూహలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూండేవాడు.
అపర్ణకు మద్దతుగా నిలిచిన శివపాల్ యాదవ్
ములాయం సింగ్ యాదవ్ చిన్న కోడలు అపర్ణకు శివపాల్ యాదవ్ మద్దతుగా నిలిచాడు. ములాయం తనయుడు అఖిలేష్ యాదవ్ కు చెక్ పెట్టడం అపర్ణతో సాధ్యమని భావించాడు శివపాల్ , దీంతో ఆమెకు మద్దతుగా నిలిచాడు. ఏడాది క్రితమే ఆమె లక్నోలోని కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానం నుండి పోటీచేస్తారని శివపాల్ యాదవ్ ప్రకటించాడు. ములాయం సింగ్ విడుదల చేసిన అభ్యర్థుల జాబితాలో అపర్ణ పేరును లక్నో కంటోన్మెంట్ స్థానంలో ఆమె పేరును చేర్చారు. అయితే అఖిలేష్ యాదవ్ జాబితాలో లక్నో కంటోన్మెంట్ స్థానంలో అభ్యర్థి పేరును మాత్రం ప్రకటించలేదు. అపర్ణకు ఇద్దరు మామాల మద్దతు దక్కింది.దీనికి తోడు అత్త సాధన కూడ ఆమెకు పూర్తి స్థాయిలో అండగా నిలిచారు.
సమాజ్ వాదీ పార్టీ విధానాలకు భిన్నంగా అపర్ణ వ్యవహరం
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో వాటిని అర్థం చేసుకొంటూ సమాజ్ వాదీ పార్టీ రాజకీయాలను నడుపుతోంది.అయితే అపర్ణ మాత్రం పార్టీ విధానాలకు భిన్నంగా వ్యవహరించడం వివాదాస్పదంగా మారింది.ములాయం అన్న మనుమడు తేజ్ పాల్ వివాహం లాలూ ప్రసాద్ కుమార్తె రాజ్ లక్ష్మీతో జరిగింది. ఈ వివాహం సందర్భంగా జరిగిన తిలక్ వేడుకకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ హజరయ్యారు. ఈ సందర్భంగా అపర్ణ మోడీతో సెల్పీ తీసుకొన్నారు. బాలీవుడు్ నటుడు అమీర్ ఖాన్ దేశంలో అసహనం పెరిగిపోతోందని చేసిన వ్యాఖ్యలపై ఆమె బిజెపి వైఖరిని సమర్థించారు. గత ఏడాది అక్టోబర్ మాసంలో కేంద్రహోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిసి ఆయన పాదాలకు నమస్కరించారు.
డింపుల్ కు అపర్ణకు మద్య చాలా తేడా
సంప్రదాయ రాజకీయాలకు పెట్టింది పేరు డింపుల్. అఖిలేష్ ముఖ్యమంత్రిగా బాద్యతలు చేపట్టడంతో ఆయన రాజీనామా చేసిన ఫిరోజాబాద్ పార్లమెంట్ స్థానం నుండి ఆమె బరిలోకి దిగి విజయం సాధించారు. అయితే అప్పటివరకు రాజకీయాలకు ఆమె చాలా దూరంగా ఉండేవారు. కాని, అనివార్య పరిస్థితుల్లోనే ఆమె రాజకీయాల్లో వచ్చారు. కాని, అపర్ణ అందుకు భిన్నంగా వ్యవహరించేవారు. రాజకీయాల్లోకి రాకముందే అపర్ణ తనను తానుగా నిరూపించుకొనేందుకు పయత్నించే స్వభావం ఉన్నవారు. డింపుల్ మాత్రం రాజకీయాల్లోకి వచ్చాకే దూకుడుగా వ్యవహరించడం ప్రారంభించారు.