చాన్నాళ్లకు: రేవంత్ వచ్చాక.. కాంగ్రెస్ మైండ్ గేమ్, కొండా దంపతులపై ప్రచారం వెనుక!
కొండా దంపతుల పార్టీ మార్పు అంశాన్ని కూడా ఇందులో భాగంగానే అర్థం చేసుకోవాల్సి వస్తోంది.
Recommended Video
హైదరాబాద్: ప్రత్యర్థిని ఢీకొనే సమవుజ్జీ లేనప్పుడు పార్టీలన్ని ఏకమైనా ప్రయోజనం ఆశించినంతగా ఉండదు. తెలంగాణలో కేసీఆర్, ప్రతిపక్షాల విషయంలో ఇదే జరుగుతూ వస్తోంది. కేసీఆర్ స్థాయికి తగ్గ రాజకీయ ప్రత్యర్థి ఇప్పటికీ కనుచూపు మేరలో కనిపించడం లేదు.
రగులుతున్న 'వైరం': వరంగల్ రాజకీయంలో చిచ్చు, కొండా వర్సెస్ ఎర్రబెల్లి..
కానీ రేవంత్ రెడ్డి రూపంలో కాంగ్రెస్కు బాహుబలి దొరికాడన్న ప్రచారమూ ఉంది. అయితే రేవంత్ నోరుతోనే కాంగ్రెస్ అదృష్టం ఒక్కసారిగా మారిపోతుందని చెప్పడానికీ లేదు. రాజకీయ చతురతలో కేసీఆర్ కాకలు తీరిపోయి ఉంటే.. రేవంత్ ఇంకా అందులో పాఠాలే మొదలుపెట్టనట్టు కనిపిస్తుంది.
అయితే రేవంత్ రెడ్డి ప్రభావమో.. లేక కాంగ్రెస్ ఉత్సాహమో గానీ మొత్తానికి చాలారోజుల తర్వాత ఆ పార్టీ రాజకీయ ఎత్తుగడల వైపు పయనిస్తోంది. కొండా దంపతుల పార్టీ మార్పు అంశాన్ని కూడా ఇందులో భాగంగానే అర్థం చేసుకోవాల్సి వస్తోంది.
మైండ్ గేమ్:
కొండా దంపతుల పార్టీ మార్పు ప్రచారం పక్కా కాంగ్రెస్ పార్టీ మైండ్ గేమ్ అన్న విషయం స్పష్టమవుతోంది. రాజకీయ జన్మనిచ్చింది వైఎస్ అయితే పునర్జన్మనిచ్చింది కేసీఆర్ అని కొండా దంపతులు చెబుతుండటం దీనికి బలం చేకూరుస్తోంది. అయితే రాజకీయాల్లో రాత్రికి రాత్రే కండువాలు మార్చిన చరిత్రలు చాలానే ఉన్నాయి కాబట్టి నేతలు ఇవాళ మాట్లాడిన మాటపై రేపు నిలబడుతారన్న గ్యారంటీ కూడా లేదు. ఆ కోణంలోనే కాంగ్రెస్ పార్టీ కొండా దంపతులకు గాలం వేస్తున్నట్టు కూడా అర్థం చేసుకోవచ్చు.
కొండా దంపతులు వస్తే:
రేవంత్ చేరిక వల్ల క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి ఎంతమేర బలం చేకూరుతుందన్నది పక్కనబెడితే.. ఆ పార్టీ మాత్రం పరిస్థితిలో మార్పు వస్తుందని బలంగా విశ్వసిస్తోంది. రేవంత్ వేవ్ కొనసాగుతున్నప్పుడే మరికొంతమంది నేతలను కూడా పార్టీలోకి లాగగలిగితే.. హస్తం హవా తిరిగి ప్రారంభమైనట్టే భావిస్తోంది.
నేతలతో బేరసారాలు.. కుదరకపోతే మైండ్ గేమ్ ప్రదర్శించడం ద్వారా దెబ్బకొట్టడం అన్న వ్యూహాన్ని కాంగ్రెస్ ఇప్పుడు అమలు చేస్తున్నట్టు కనిపిస్తోంది. కొండా దంపతులు పార్టీ మారుతున్నారన్న ప్రచారం ద్వారా అధికార పార్టీలో ప్రకంపనలు పుట్టించేందుకు ప్రయత్నించిందనే చెప్పాలి.
ఎర్రబెల్లితో వివాదంతో:
కొండా దంపతులకు, ఎర్రబెల్లికి మధ్య మూడు దశాబ్దాలుగా రాజకీయ శత్రుత్వం కొనసాగుతోంది. ఇప్పుడు వీరిద్దరు ఒకే గూటిలో ఉండటం.. వచ్చే ఎన్నికల్లో కొండా సురేఖ నియోజకవర్గమైన వరంగల్ తూర్పు టికెట్ తానే దక్కించుకుంటానని ఎర్రబెల్లి సోదరుడు ప్రచారం చేసుకుంటుండం.. వీరిద్దరి మధ్య తాజా వివాదానికి కారణమైంది. అవకాశం కోసం ఎదురుచూస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడీ వివాదాన్ని తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నంలోనే పార్టీ మార్పు అంశాన్ని తెరమీదకు తెచ్చింది.
ఏం జరగబోతుందో?
కొండా దంపతుల పార్టీ మార్పుపై గురువారం నుంచి మొదలైన గుసగుసలు శుక్రవారం నాటికి ఊపందుకున్నాయి. ప్రధాన స్రవంతి మీడియాలోను బాగానే ప్రచారం జరిగింది. దీంతో వెంటనే అప్రమత్తమైన కొండా దంపతులు.. అలాంటిదేమి లేదని వివరణ ఇచ్చుకున్నారు.
తాము టీఆర్ఎస్ ను వీడి మరో పార్టీలో చేరేది లేదని స్పష్టం చేశారు. . తమకు రాజకీయ జన్మ నిచ్చింది వైఎస్ అయితే పునర్జన్మ ఇచ్చింది కెసియార్ అని అలాంటి పార్టీని వదిలేది లేదని కుండబద్దలు కొట్టారు. అంతా కాంగ్రెస్ మైండ్ గేమ్ అని ఆరోపించారు. చూడాలి మరి.. మైండ్ గేమ్ అన్నవాళ్లే.. తిరిగి మనసు మార్చుకుంటారా? లేక గాలం వేసినవాళ్లే భంగపడుతారా? అన్నది.