షాకింగ్: రేప్ నిందితుడి కాళ్లు మొక్కిన మాజీ చీఫ్ జస్టిస్
జోథ్పూర్: అత్యాచార కేసులో విచారణ ఎదుర్కొంటున్న నిందితుడుకి హైకోర్టు రిటైర్డ్ ప్రధాన న్యాయమూర్తి ఒకరు అందరూ చూస్తుండగా కాళ్లు మొక్కారు. ఆ నిందితుడు ఆశారాం బాపూ. కాళ్లు మొక్కిన వ్యక్తి సిక్కిం హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి సుందర్ నాథ్ భార్గవ.
ఆయన మాజీ గవర్నర్ కూడా. శనివారం జోథ్పూర్ హైకోర్టు వెలుపల ఈ సంఘటన చోటు చేసుకుంది. దుష్ట శక్తులను తరిమికొడతాననే సాకుతో ఓ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఆరోపణలను ఆశారాం ఎదుర్కొంటున్నాడు.
రోజువారీ విచారణకు ఆయనను జోథ్పూర్ జైలు నుంచి కోర్టుకు తీసుకు వస్తున్నారు. శనివారం రాజస్థాన్ పోలీసు అధికారులు జైలు నుంచి ఆయనను వ్యానులో కోర్టుకు తీసుకు వచ్చారు. ఆయనను చూసేందుకు కోర్టు వెలుపల వేచి ఉన్న రిటైర్డ్ జడ్జి.. ఆశారాం వ్యాను దిగగానే పాదాలను తాకారు. ఇది వివాదాస్పదం అయింది.
తాను ఓ ప్రయివేటు కార్యక్రమానికి జోథ్పూర్ వచ్చానని, ఆశారాంను కోర్టుకు తీసుకు వస్తున్నారని తెలిసి ఆయన దర్శనానికి వచ్చానని సదరు రిటైర్డ్ జడ్జి చెప్పారు.
ఆశారాం మాట్లాడుతూ.. భార్గవ తన భక్తుడు అని, ఆయన తనను కలుసుకోవాలని అనుకున్నాడని, అందుకే వచ్చారని, ఆయనకు జ్యూడీషియరీలో మంచి పరిచయాలు ఉన్నాయని చెప్పారు.