చంద్రబాబుకు గడ్కరీ షాక్: రాయపాటి అసంతృప్తి
హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టరును మార్చాలనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ఆలోచనకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గండి కొట్టిన విషయం తెలిసిందే. ప్రత్యేకంగా చంద్రబాబు ఒడిశాకు వెళ్లి ఆయనతో చర్చలు జరిపినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
Recommended Video
కాంట్రాక్టరును మార్చాలనే ప్రయత్నాలు సాగిస్తున్న నేపథ్యంలో చోటు చేసుకుంంటున్న పరిణామాల పట్ల చంద్రబాబు ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివ రావు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. చంద్రబాబు ప్రభుత్వానికీ ఆయనకూ మధ్య దూరం పెరుగుతున్నట్లు చెబుతున్నారు.
రాయపాటి సాంబశివ రావుకు చెందిన ట్రాన్స్స్టోరీ సంస్థ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టును దక్కించుకుంది.
రాయపాటి వాదన ఇలా....
పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం పెరిగిందని, తనకు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తనకు కాంట్రాక్టు వచ్చిందని, అందువల్ల నిర్మాణ వ్యయం పెరిగిన విషయాన్ని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని రాయపాటి సాంబశివ రావు అంటున్నారు. ఈ స్థితిలో చంద్రబాబు ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టరును మార్చాలనే ప్రయత్నాలు చేసింది. పోలవరం వ్యవహారంలో సంభవిస్తున్న పరిణామాలు రాయపాటిని అసంతృప్తికి గురి చేసినట్లు చెబుతున్నారు.
వెనక రాయపాటి ఉన్నారా....
కాంట్రాక్టరును మార్చాలనే చంద్రబాబు విజ్ఞప్తిని తోసిపుచ్చుతూ ప్రస్తుత టాన్స్స్టోరీ కాంట్రాక్టునే కొనసాగించాలని నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. దీని వెనక రాయపాటి సాంబశివ రావు పాత్ర ఉందనే అనుమానాలను తెలుగుదేశం పార్టీ వర్గాలు అనుమానిస్తున్నాయి. ఇది కూడా విభేదాలకు కారణంగా తెలుస్తోంది.
నితిన్ గడ్కరీ ఇలా.....
నితిన్ గడ్కరీ ఈ నెల 3వ తేదీన పోలవరం ప్రాజెక్టును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో కలిసి సందర్శించారు. వారితో పాటు అధికారులు కూడా ఉన్నారు. ఆ తర్వాత ఆయన పోలవరంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత మసూద్ హుస్సేన్ నేతృత్వంలోని పది మంది సభ్యులతో కూడిన నిపుణుల కమిటీ పోలవరం ప్రాజెక్టును సందర్శించింది.
సుదీర్ఘ చర్చలు....
కమిటీ సభ్యులు ప్రాజెక్టుకు సంబంధించిన ఇంజనీరింగ్ అధికారుల నుంచి, కాంట్రాక్ట్ కంపెనీ ప్రతినిధుల నుంచి సమాచారాన్ని సేకరించింది. ఢిల్లీకి తిరిగి వెళ్లడానికి ముందు జలవనరుల కార్యదర్శి శశిభూష,ణ్ కుమార్తోనూ, ఇంజనీర్ ఇన్ చీఫ్ ఎం. వెంకటేశ్వరరావుతోనూ చర్చలు జరిపింది. ఆ తర్వాత నితిన్ గడ్కరీకి బుధవారంనాడు నివేదికను సమర్పించింది.
మండిపడిన గడ్కరీ....
నివేదికను పరిశీలించిన తర్వాత నితిన్ గడ్కరీ రాష్ట్ర ప్రభుత్వ అధికారులపై తీవ్రంగా మండిపడినట్లు తెలుస్తోంది. అదే సమయంలో ప్రాజెక్టు పనుల ధరలను పెంచడానికి కూడా ఆయన నిరాకరించారు. అంతేకాకుండా మరో కంపెనీకి కాంట్రాక్టు పనులను అప్పగించాలనే ప్రతిపాదనను ఆయన తోసిపుచ్చారు. ప్రస్తుత కాంట్రాక్టరును కొనసాగిస్తూ, ఆ కంపెనీకి తగిన సాయం అందించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు.
గడ్కరీ మరో దెబ్బ...
అదే సమయంలో నితిన్ గడ్కరీ చంద్రబాబు ప్రభుత్వంపై మరో దెబ్బ కూడా వేశారుట. ప్రాజెక్టు నిర్మాణ వ్యయంతో భూసేకరణ, పునరావాస చర్యల వ్యయాన్ని కలిపి చూపించవద్దని కూడా ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఈ వ్యయాల గురించి తదుపరి చర్చలు జరుపుదామని చెప్పారు. ఈ వ్యవహారాలన్నీ రాయపాటికి మింగుడు పడడం లేదని అంటున్నారు.