రోజాపై ఘాటు వ్యాఖ్యలు: కెసిఆర్ సలహా, తగ్గేది లేదన్న గాలి
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శానససభ్యురాలు రోజా మాటల ఈటెలు దూస్తుంటారనే విషయంం అందరికీ తెలిసిందే. అదే స్థాయిలో ఆమె వ్యాఖ్యలను తిప్పికొట్టడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రయత్నిస్తూ ఉంటారు. అందులో టిడిపి సీనియర్ నేత, మాజీ మంత్రి గాలి ముద్దు కృష్ణమ నాయుడు ముందు వరుసలో ఉంటారు.
గత ఎన్నికల్లో రోజాపై నగరి నియోజకవర్గంలో గాలి ముద్దు కృష్ణమ నాయుడు ఓటమి పాలయ్యారు. ఆ రకంగా రాజకీయ దిగ్గజాన్ని ఓడించిన ఘనతను ఆమె సాధించారు. అయితే, రోజాపై గాలి ముద్దుకృష్ణమ నాయుడు చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు నచ్చలేదని అంటున్నారు.
Recommended Video
దాంతో ఆయన గాలికి ఓ సలహా ఇవ్వాలని అనుకున్నారని సమాచారం. గతంలో గాలి ముద్దుకృష్ణమ నాయుడితో కలిసి టిడిపిలో కెసిఆర్ పనిచేశారు. ఆ చనువుతోనే ఆయన తన సలహా ఇవ్వాలని అనుకుని ఉండవచ్చు. కానీ, గాలి ముద్దుకృష్ణమ నాయుడు ససేమిరా అన్నారని సమాచారం.
ఇక్కడా వచ్చాయి....
ముద్దుకృష్ణమ నాయుడు ఇటీవలరోజా వ్యవహార శైలిపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలు హైదరాబాద్ పత్రికల్లో కూడా అచ్చయ్యాయి. సరిగ్గా అదే రోజు కేసీఆర్ తమ పార్టీ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. నేతల ప్రకటనలు, వాటిపై స్పందనలపై వారి మధ్య చర్చ జరిగింది. ఆ సమయంలో కేసీఆర్ తానే ముద్దు ప్రకటన గురించి ప్రస్తావించారని సమాచారం.
మా కన్నా సీనియర్...
ముద్దు కృష్ణమ నాయుడు రాజకీయాల్లో తన కన్నా సీనియర్ అని, తాము కొత్తగా అసెంబ్లీకి వచ్చినప్పుడు ఆయన వద్ద తాము కొన్ని విషయాలు నేర్చుకొన్నామని, ఆయన రోజా గురించి మాట్లాడటం బాగోలేదని కెసిఆర్ అన్నారట. ఇది ముద్దుకృష్ణమ స్థాయికి తగదని అంటూ ముద్దన్నకు ఈ విషయం చెప్పాలని తన పార్టీ నేతలకు ఆయన సూచించారని మీడియాలో వార్తలు వచ్చాయి.
కడియం చొరవ
కెసిఆర్తో భేటీ తర్వాత తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ముద్దు కృష్ణమ నాయుడికి ఫోన్ చేశారట. మీ గురించి మేం మాట్లాడుకొన్నాం. మీ స్థాయి తగ్గించుకోవద్దని మా సీఎం చెప్పమన్నారని ఆయన సూచించారని సమాచారం. కడియం శ్రీహరి కూడా గతంలో టీడిపిలో గాలి ముద్దుకృష్ణమ నాయుడితో కలిసి పనిచేశారు. దీంతోనే ఆయన ఆ సలహా ఇవ్వడానికి చొరవ చూపారని అంటున్నారు.
గాలి ఏమన్నారంటే...
తనపై చూపిన అభిమానానికి గాలి ముద్దుకృష్ణమ నాయుడు ధన్యవాదాలు తెలుపుతూనే - రాజకీయాల్లో ఉన్నప్పుడు మాట్లాడుతూనే ఉండాలని, లేకపోతే ప్రత్యర్థులు చెప్పేవే ప్రజల్లోకి వెళ్తాయని ముద్దుకృష్ణమ నాయుడు జవాబిచ్చారని సమాచారం. రోజా విషయంలో తాను తగ్గేది లేదని గాలి ముద్దుకృష్ణమ నాయుడు చెప్పకనే చెప్పారు.