ఫిర్యాదు: మంత్రి గంటాకు సొంత పార్టీ నేత ఝలక్
మంత్రి గంటా శ్రీనివాస రావుకు గట్టి షాక్. విశాఖ జిల్లా గ్రంథాలయ సంస్థ (డిస్ట్రిక్ట్ సెంట్రల్ లైబ్రరీ) మాజీ చైర్మన్, టిడిపి సీనియర్ నేత తోట నగేష్..
విశాఖ: మంత్రి గంటా శ్రీనివాస రావుకు గట్టి షాక్. విశాఖ జిల్లా గ్రంథాలయ సంస్థ (డిస్ట్రిక్ట్ సెంట్రల్ లైబ్రరీ) మాజీ చైర్మన్, టిడిపి సీనియర్ నేత తోట నగేష్.. ప్రత్యూష అసోసియేట్స్పై సిట్ (ప్రత్యేక దర్యాఫ్తు బృందం)కు ఫిర్యాదు చేశారు.
ప్రత్యూష కంపెనీ మంత్రి గంటా కుటుంబానికి చెందినది. ఇప్పుడు ఈ కంపెనీ భూ ఆక్రమణకు పాల్పడిందంటూ తోట నగేష్ గురువారం ఫిర్యాదు చేయడం గమనార్హం.
2014కు ముందు మంత్రి గంటా ప్రత్యూష అసోసియేట్స్కు డైరెక్టర్గా ఉండేవారు. ఆయన అదే ఏడాది ఫిబ్రవరిలో రాజీనామా చేశారు. అయితే, సొంత పార్టీ నేత గంటా కుటుంబ కంపెనీపై ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది.
ప్రహ్లాదపురంలోని జిల్లా లైబ్రరీకి చెందిన రూ.100 కోట్ల భూమిని ఆ కంపెనీ ఇప్పటి వరకు తన స్వాధీనంలో ఎలా ఉంచుకుందో చెప్పాలని పేర్కొన్నారు.
తోట నగేష్ చెప్పిన వివరాల ప్రకారం.. ఆ స్థలంలో లైబ్రరీ, మల్టీ కాంప్లెక్స్ కాంప్లెక్స్ నిర్మిస్తామని 2009లో ప్రత్యూష కంపెనీ 33 ఏళ్లకు ఎంవోయు కుదుర్చుకుందని చెప్పారు.
30,000 స్కేర్ ఫీట్లలో లైబ్రరీ నిర్మించాలని, మిగతా 1.2 లక్షల స్కేర్ ఫీట్లలో మల్టీ కాంప్లెక్స్ నిర్మించాలని, కానీ ఇప్పటి వరకు ఆ ప్రాసెస్ ప్రారంభం కాలేదన్నారు. ప్రభుత్వం ఈ లీజును 2014లో క్యాన్సెల్ చేసింది.