ఆ ఆడియో టేపులే ముంచాయి: ఈశ్వరి నిలదీతతో విజయసాయికి షాక్.. ఆ ఇద్దరికి బొత్స క్లాస్..
విశాఖపట్నం: ఓవైపు పాదయాత్రతో పార్టీని బలోపేతం చేయాలని జగన్ భావిస్తుంటే.. పార్టీని బలహీనపరిచడానికి మరికొందరు నేతలు పరోక్షంగా కారణమవుతున్నారు. జగన్ ఫోకస్ అంతా పాదయాత్రపై ఉన్నవేళ.. తమ ఇష్టారీతిన వ్యహరిస్తున్న కొంతమంది నేతలు పార్టీకి పూడ్చలేని డ్యామేజ్ చేస్తున్నారు.
ఆయన వల్లే ఇదంతా?: జగన్ బుజ్జగించినా!.. నేడే టీడీపీలో చేరనున్న ఈశ్వరి
పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి వైసీపీని వీడటం వెనుక ఇవే కారణాలు బలంగా కనిపిస్తున్నాయి. టీడీపీకి బద్ద వ్యతిరేకి అయిన ఈశ్వరి ఆ పార్టీలో చేరుతారా? అన్న సందేహాలు వ్యక్తమైనప్పటికీ.. పార్టీలో తనకు వ్యతిరేకంగా జరుగుతున్న పరిణామాలను నిర్దారించుకున్న తర్వాతే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
ఆడియో టేపులు:
ఏజెన్సీ ప్రాంతంలో గిడ్డి ఈశ్వరి మంచి పట్టున్న నేత. ఆమె అనుచరుల్లో చాలామంది టీడీపీకి బద్ద వ్యతిరేకులే. అలా వైసీపీని బలోపేతం చేయడంలో ఆమె కీలక పాత్ర పోషిస్తున్నారు. స్థానిక పరిస్థితులను బాగా ఎరిగిన నేతగా కనీసం ఆమెను లెక్కలోకి తీసుకోకుండా తమకు తోచినట్టుగా వైసీపీ నిర్ణయాలు తీసుకుంది. ఈశ్వరి కారణంగానే ఇక్కడ పార్టీ బలంగా ఉందన్న విషయాన్ని వారు విస్మరించారు.
రాజ్యసభ ఎన్నికల అనంతరం ఆమెను పక్కనపెట్టేయడమేనని, ఆమె పాడేరు ఎమ్మెల్యే సీటును మరొకరికి ఇస్తామని విజయిసారెడ్డి చెప్పినట్టు ఇటీవలి ఇద్దరు నేతలు స్థానిక నేతలతో వ్యాఖ్యానించినట్టు సమాచారం. అది కాస్త ఫోన్ రికార్డింగ్స్ రూపంలో గిడ్డి ఈశ్వరికి చేరినట్టు తెలుస్తోంది. అరకు ఇన్ఛార్జీగా తాను ప్రతిపాదించిన ఫల్గుణను కాదని, కుంభా రవిబాబును నియమించాలన్న వ్యాఖ్యలు కూడా ఆ టేపుల్లో ఉన్నట్టు తెలుస్తోంది.
విజయసాయిని నిలదీసిన ఈశ్వరి:
శనివారం వైసీపీ నగర అధ్యక్షుడిగా మళ్ల విజయప్రసాద్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఈశ్వరి హాజరవుతారని వైసీపీ శ్రేణులు భావించాయి. అయితే ఆమె మాత్రం కార్యక్రమానికి దూరంగానే ఉన్నారు. కార్యక్రమం అనంతరం రాత్రి 10గం. తర్వాత ఈశ్వరి విజయసాయిరెడ్డిని కలిసి తన వద్ద ఉన్న ఫోన్ రికార్డింగ్స్ వినిపించినట్టు తెలుస్తోంది.
ఆ టేపుల్లో ఉన్న వ్యాఖ్యలు విని విజయసాయిరెడ్డి నోటివెంట మాట రాలేదట. తాను ఎవరి వద్ద అయితే ఆ విషయాలు ప్రస్తావించానో.. వారిద్దరు తనను ఇరికించారని విజయసాయిరెడ్డి భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. చివరకు ఆయన బుజ్జగింపులేవి ఈశ్వరి పార్టీ మార్పును ఆపలేకపోయాయి.
ఆ ప్రయత్నం కూడా విఫలం:
సోమవారం ఈశ్వరి టీడీపీలో చేరుతుండటంతో వైసీపీ తరుపున కరణం ధర్మశ్రీ, కొయ్య ప్రసాదరెడ్డిలు ఆదివారం ఆమెను కలిసి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే తనకు ఎదురైన అవమానాన్ని ఆమె జీర్ణించుకోలేకపోతున్నట్టు తెలుస్తోంది. పార్టీలో కొనసాగే పరిస్థితి లేదని తేల్చి చెప్పారట. ఆ తర్వాత విజయసాయిరెడ్డి ఫోన్ లో మాట్లాడినా ఆమె తన నిర్ణయాన్ని మార్చుకోనని తెగేసి చెప్పారట.
ఆ ఇద్దరికీ బొత్స క్లాస్:
గిడ్డి ఈశ్వరి పార్టీ మారడానికి కారణమైన ఇద్దరు నేతలను బొత్స సత్యనారాయణ తీవ్రంగా మందలించినట్టు తెలుస్తోంది. ఇష్టారాజ్యంగా వ్యవహరించి పార్టీ ప్రతిష్టను దెబ్బతీయవద్దని, ఇకనైనా జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించినట్టు సమాచారం. అరకొర సమాచారంతో లేనిపోనివి ప్రచారం చేయడం వల్లే ఇలాంటి దుస్థితి తలెత్తిందని ఆయన వాపోయినట్టు తెలుస్తోంది.