ఇవాంకా ట్రంప్ టూర్: సివిల్ దుస్తుల్లోనే పోలీసులు, తలనొప్పిగా భద్రత
అమెరికా అధ్య క్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ హైద్రాబాద్ పర్యటన సందర్భంగా భద్రత తెలంగాణ పోలీసులకు కత్తిమీద సాముగా మారింది.
Recommended Video
హైదరాబాద్: అమెరికా అధ్య క్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ హైద్రాబాద్ పర్యటన సందర్భంగా భద్రత తెలంగాణ పోలీసులకు కత్తిమీద సాముగా మారింది. అమెరికాకు చెందిన భద్రతా సిబ్బంది వ్యవహరిస్తున్న తీరు తెలంగాణ పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. భద్రత సిబ్బందంతా సివిల్ దుస్తులు ధరించాలని అమెరికా భద్రతా సిబ్బంది సూచిస్తున్నారు. అంతేకాదు ఇప్పటికే ఎలాంటి ఆయుధాలు ధరించకూడదని ఆదేశాలు జారీ చేశారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ ఈ నెలాఖరులో హైద్రాబాద్లో జరిగే గ్లోబల్ ఎంటర్ప్రైన్యూర్స్ సదస్సులో పాల్గొంటారు.ఈ సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సహ తెలంగాణ రాష్ట్ర సీఎం కెసిఆర్ ప్రపంచ వ్యాప్తంగా ఎంపిక చేసిన పారిశ్రామిక వేత్తలు పాల్గొంటారు.
ఇవాంకా ట్రంప్ పర్యటనను పురస్కరించుకొని అమెరికా భద్రత సిబ్బంది ఇప్పటికే ఆమె పర్యటించే ప్రాంతాల్లో క్షుణ్ణంగా పరిశీలించారు. అంతేకాదు తెలంగాణ పోలీసులకు పలు సూచనలు చేశారు.
సివిల్ దుస్తుల్లోనే పోలీసులు
ఇవాంకా ట్రంప్ పర్యటనను పురస్కరించుకొని అమెరికా భద్రత అధికారులు తెలంగాణ పోలీసులకు పలు రకాల నిబంధనలు విధస్తున్నారు.ఇవాంకా భ్రదత కోసం అమెరికా నుండి ప్రత్యేక భద్రతా బృందం హైద్రాబాద్కు చేరుకొంది. అంతేకాదు ఇవాంకా టూర్లో భద్రతలో పాల్గొనే పోలీసులు ఎవరూ కూడ ఆయుధాలు ధరించకూడదని అమెరికా భద్రతా సిబ్బంది తెలంగాణ పోలీసులకు సూచించారు. తాజాగా ఇవాంక పాల్గొనే కార్యక్రమంలో విధులు నిర్వర్తించే పోలీసులు ఎవరూ యూనిఫాం ధరించకూడదని అమెరికా భద్రతా సిబ్బంది తెలంగాణ పోలీసులకు సూచించినట్టు సమాచారం.
కొత్త నిబంధనలతో ఇరకాటంలో పోలీసులు
ఇవాంకా వ్యక్తిగత భద్రతను అమెరికా అధ్యక్షుడి భద్రత వ్యవహారాలు చూసే సీక్రెట్ సర్వీస్ అధికారులు చూసుకుంటున్నారు. విదేశీ ప్రతినిధి హోదాలో మన దేశం నుంచి ప్రత్యేక భద్రత దళం, రాష్ట్ర ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ విభాగాలు ఆమె భద్రత ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నాయి. ఇవాంకా భద్రతకు సంబంధించి అమెరికా అధికారులు రోజుకో కొత్తకొత్త నిబంధనలు తెరపైకి తేవడమే యంత్రాంగాన్ని ఇరకాటంలో పెడుతోంది. అమెరికా అధికారుల నిబంధనల కారణంగా ఏం చేయాలనే విషయమై తెలంగాణ పోలీసులు తలలు పట్టుకొంటున్నారు.
భద్రత కోసం ప్రత్యేక కమిటీ
ఇవాంక ట్రంప్ భద్రతను పర్యవేక్షించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నాయి. ఎఫ్.బి.ఐ., కేంద్ర, రాష్ట్ర నిఘావర్గాలు, ఎస్పీజీ, నీతి అయోగ్లతోపాటు హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ ఉన్నతాధికారులు ఈ కమిటీ సభ్యులుగా ఉంటారు. భద్రతకు సంబంధించిన ప్రణాళికను కమిటీ రూపొందిస్తోంది. కేంద్ర, రాష్ట్ర నిఘా వర్గాలు, ఎస్పీజీ, గ్రేహౌండ్స్ అధికారులను సమన్వయం చేసుకుంటూ భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించే బాధ్యతను ఇంటలిజెన్స్ అధికారి ఎం.కె.సింగ్కు అప్పగించారు.
వేర్వేరు మార్గాల్లో ఫలక్నుమా ప్యాలెస్కు
హెచ్ఐసీసీలో ఈ నెల 28న జీఈఎస్ సదస్సు ప్రారంభం కానుంది. ఈ సదస్సు ప్రారంభాన్ని పురస్కరించుకొని ప్రధాని మోదీ, ఇవాంకా ట్రంప్లతోపాటు..2 వేల మంది విదేశీ ప్రతినిధులు ఫలక్నుమా ప్యాలెస్లో విందు ఏర్పాటు చేశారు.. ప్రధాని, ఇవాంకా ట్రంప్ల వాహనశ్రేణులు, విదేశీ ప్రతినిధుల బస్సులను వేర్వేరు మార్గాల్లో ఫలక్నుమా ప్యాలెస్కు తరలించనున్నారు. ఇవాంకా ట్రంప్ భద్రత కోసం 2 వేల మంది పోలీసులను వినియోగిస్తున్నారు.