ఇవాంక పర్యటన: అవమానాన్ని ఎందుకు దిగమింగారు?
Recommended Video
హైదరాబాద్: హైదరాబాద్ నగర ప్రథమ పౌరుడు బొంతు రామ్మోహన్కు అవమానం జరిగింది. ప్రథమ పౌరుడిగా ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సుకు అతిథులను ఆహ్వానించాల్సింది ఆయనే. కానీ ఆయనకు కనీసం ఆహ్వానం కూడా అందలేదు.
అలాగే, ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటనకు వచ్చిన సందర్భంలో కూడా బేగంపేట విమానాశ్రయంలో ఆయనను చిన్నచూపే చూశారు. తెలంగాణ ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖ (జిఎడి) ఆయనను గుర్తించిన పాపాన పోలేదని అంటున్నారు.
రాజీనామా చేసినట్లు వదంతులు...
తనకు జరిగిన అవమానానికి బొంతు రామ్మోహన్ రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. అయితే, ఆ వార్తలను ఆయన ఖండించారు. తాను రాజీనామా చేయనున్నట్లు వచ్చిన వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని ఆయన స్పష్టం చేసారు.
ఆహ్వానం కూడా లేదు....
హెచ్ఐసిసిలో జరిగిన ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సుకు బొంతు రామ్మోహన్కు జిఎడి కనీసం ఆహ్వానం కూడా పంపించలేదు. ప్రారంభ సదస్సుకు నగరర ప్రథమ పౌరుడిగా ఆయన అతిథులకు ఆహ్వానం పలకాల్సి ఉంటుంది. కానీ, కనీసం ఆయనను గుర్తించడానికి కూడా ప్రభుత్వం నిరాకరించింది.
ప్రోటోకాల్ ప్రకారం...
ఇవాంక ట్రంప్ హాజరైన ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సును కేంద్ర ప్రభుత్వం నిర్వహించింది. తెలంగాణ ప్రభుత్వం సహ ఆతిథిగా పాలు అందులో పాలు పంచుకుంది. ప్రోటోకాల్ ప్రకారం రాష్ట్ర అతిథులను హైదరాబాద్ ప్రథమ పౌరుడిగా మేయర్ బొంతు రామ్మోహన్ ఆహ్వానించాల్సి ఉంటుంది. అయితే, ప్రోటోకాల్ను ఉల్లంఘించారు.
మోడీ పర్యటనలోనూ...
ఈ నెల 28వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ బేగంపేట విమానాశ్రయానికి వచ్చిన సమయంలోనూ మేయర్ బొంతు రామ్మోహన్కు అవమానమే జరిగింది. అయితే, మోడి వస్తున్న విషయాన్ని ప్రభుత్వం మేయర్ కార్యాలయానికి తెలియజేసింది. ప్రధానిని ఆహ్వానించడానికి వరుస తీరేవారిలో 48 ఉన్నారు. వారిలో ముఖ్యమంత్రి, గవర్నర్లతో పాటు పరిపాలన, పోలీసు విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు ఉన్నారు. మేయర్ పేరు ఆ వరుసలో లేదు.
డిప్యూటీ మేయర్కు కూడా...
హైదరాబాద్ డిప్యూటీ మేయర్కు జిఈఎస్కు ఆహ్వానం పంపించలేదు. మేయర్ కార్యాలయంలోనివారికి ఎవరికీ పాస్లు ఇవ్వలేదు. ఎందుకు మేయర్ను పక్కన పెట్టారనే విషయం తెలియదు.
తెరాసకు చెందివారు కాబట్టి
హైదరాబాదు మేయర్ బొంతు రామ్మోహన్ తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)కు చెందినవారు కాబట్టి కెసిఆర్ ప్రభుత్వం బతికిపోయింది. లేదంటే తీవ్రమైన వివాదం చెలరేగి ఉండేది. పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కెటి రామారావు అంతా తానై వ్యవహరించగా బొంతు రామ్మోహన్ తనకు జరిగిన అవమానంపై ఏమీ అనలేని స్థితిలో పడ్డారు.