అదే జరిగితే ఎస్పీకి షాక్: బీజేపీలోకి ములాయం కోడలు!, యోగితో అందుకే టచ్లో!
రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేనని, ఇప్పుడే తానేమి చెప్పలేనని అపర్ణయాదవ్ బదులిచ్చారు. దీంతో బీజేపీలో ఆమె చేరిక పట్ల అప్పుడే ఊహాగానాలు బయలుదేరాయి.
లక్నో: ములాయం వారసురాలిగా ఏకంగా సీఎం స్థానం పైనే గురిపెట్టిన అపర్ణయాదవ్.. ఆఖరికి ఎమ్మెల్యేగా కూడా గెలవలేక చతికిలపడ్డారు. అయితే తాజా పరిణామాలు చూస్తుంటే మాత్రం ఆమె బీజేపీకి దగ్గరవుతున్నారా? అన్న సంశయం తలెత్తుతోంది. ఇదే ప్రశ్న అపర్ణయాదవ్ ను అడిగితే.. సమయం వచ్చినప్పుడు చెబుతానంటూ ఆమె పేర్కొనడం కూడా ఈ అనుమానాలకు ఊతమిస్తోంది.
కాగా, శుక్రవారం నాడు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అపర్ణయాదవ్ నేతృత్వంలోని ఎన్జీవో నిర్వహిస్తున్న గోశాలను సందర్శించారు. ఈ సందర్బంగా వారి మధ్య పలు విషయాలకు చర్చకు వచ్చినట్లు చెబుతున్నారు. యోగి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సైతం అపర్ణ యాదవ్ భర్త ప్రతీక్ తో కలిసి ఆయన్ను కలిశారు. ఆ సందర్బంగా దాదాపు 20ని. పాటు భేటీ అయ్యారు.
గతంలోను మోడీ పట్ల, బీజేపీ పట్ల అపర్ణయాదవ్ అభిమానం చాటుకోవడం కూడా అపర్ణయాదవ్ బీజేపీ చేరిక అంశం తెర పైకి రావడానికి కారణం. ఈ నేపథ్యంలోనే మీడియా ప్రతినిధులు ఇదే విషయంపై అపర్ణయాదవ్ ను ప్రశ్నించారు. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేనని, ఇప్పుడే తానేమి చెప్పలేనని అపర్ణయాదవ్ బదులిచ్చారు. దీంతో బీజేపీలో ఆమె చేరిక పట్ల అప్పుడే ఊహాగానాలు బయలుదేరాయి. ఇదిలా ఉంటే, ఇటీవలి ఎన్నికల్లో లక్నో కంటోన్మెంట్ నుంచి పోటీ చేసిన అపర్ణయాదవ్ బీజేపీ అభ్యర్థి రీటా బహుగుణ చేతిలో ఓడిపోయారు.