వెంకయ్యతో దోబూచులాట: పురంధేశ్వరికి చెక్, బాబు క్యాంపుపై అనుమానం!
పురంధేశ్వరిని పక్కనపెట్టారన్న ప్రచారం టీడీపీ క్యాంపు నుంచి మొదలైందా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
విజయవాడ: ఏపీలో కమల పీఠాన్ని ఎవరు అధిష్టించబోతున్నారనే దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఎంతసేపూ ఊహాగానాలే తప్పించి ఇంతవరకు దీనిపై క్లారిటీ వచ్చిందీ లేదు. సామాజిక సమీకరణాలు, ప్రాంతీయ సమీకరణాలకు తోడు పార్టీని ముందుండి నడిపించే సత్తా గల నాయకుడి కోసం కమలాధీశులు దీర్ఘాలోచనలో పడిపోయారు.
నిజానికి ఏపీ బీజేపీ అధ్యక్ష రేసులో మాజీ కేంద్రమంత్రి పురంధేశ్వరి పేరే నిన్న మొన్నటిదాకా బలంగా వినిపించింది. బీజేపీలోను గ్రూపు రాజకీయాలను క్రియేట్ చేసిన చంద్రబాబును ధీటుగా ఎదుర్కోవాలంటే ఆయనకు బద్ద శత్రువుగా ముద్రపడ్డ పురంధేశ్వరే కరెక్టే అన్న అభిప్రాయానికి కమల పార్టీ వచ్చినట్లుగా ఊహాగానాలు వినిపించాయి.
కానీ అధ్యక్ష పదవి ఎంపికపై తాత్సారం జరుగుతున్న కొద్ది తెర మీదకు కొత్త పేర్లు వస్తూనే ఉన్నాయి. రాష్ట్రపతి ఎంపిక విషయంలో ఎవరీ ఆలోచనలకు అందరని రీతిలో మోడీ-అమిత్ షా రాంనాథ్ కోవింద్ ను ఎంపిక చేసినట్లే.. రాష్ట్రంలోను అలాంటి సంచలన నిర్ణయానికే మొగ్గుచూపుతారా? అన్న సందేహాలు కూడా బలంగా వ్యక్తమవుతున్నాయి.
ఎందుకీ దోబూచులాట?:
వచ్చే ఎన్నికల నాటికి టీడీపీతో బీజేపీ దూరం జరగాలని యోచిస్తున్నట్లుగా ఇప్పటికే సగం క్లారిటీ వచ్చేసింది. ఇలాంటి తరుణంలో చంద్రబాబుకి వ్యతిరేకురాలిగా ముద్రపడ్డ పురంధేశ్వరిని కాదనుకోవడానికి బీజేపీకి ఉన్న కారణాలేంటో అర్థం కావడం లేదు. ఈ లెక్కన భవిష్యత్తులోను చంద్రబాబుతో దోస్తీకే బీజేపీ మొగ్గుచూపుతుందా? అన్న అనుమానం కూడా రాకపోదు.
నంద్యాల మాదే: లోకేష్, ‘బాబు ప్రోత్సాహంతోనే శిల్పాపై కాల్పులు'
వెంకయ్యతో పొసగలేదనే:
పురంధేశ్వరిని అధ్యక్ష పదవి రేసులో లేకుండా చేయడానికి వినిపిస్తున్న మరో కారణం.. వెంకయ్య నాయుడితో ఆమెకు పొసగకపోవడమేనట. కేంద్రమంత్రి నుంచి ఉపరాష్ట్రపతిగా ఉన్నతమైన పదవిని అలంకరించబోయే ముందు వెంకయ్య రెండు తెలుగు రాష్ట్రాల్లో అడుగుపెట్టినా.. ఆమె మాత్రం అటువైపు కన్నెత్తి చూడలేదట. ఆయన హైదరాబాద్ లో ఉన్నప్పుడు విజయవాడలో.. విజయవాడలో ఉన్న ప్పుడు హైదరాబాద్ లో ఉన్నారట. ఈ దోబూచులాటతోనే రేసు నుంచి ఆమెను పక్కకు పెట్టారన్న వాదన వినిపిస్తోంది.
టీడీపీ క్యాంపు ప్రచారమా?:
పురంధేశ్వరి పేరును బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తప్పించారని జరుగుతున్న ప్రచారంలో టీడీపీ క్యాంపు ప్రమేయం ఏమైనా ఉందా? అన్న అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. వెంకయ్య సహాయంతో బీజేపీలోను తనకు అనుకూల వర్గాన్ని చంద్రబాబు తయారుచేసుకున్నారన్న ప్రచారం ఉన్న సంగతి తెలిసిందే.
ఇప్పుడు హఠాత్తుగా పురంధేశ్వరిని బీజేపీకి అధ్యక్షురాలిగా చేస్తే.. భవిష్యత్తులో కేంద్రంతో తమ ఉనికి కచ్చితంగా ప్రమాదంలో పడుతుందనేది టీడీపీ ఆలోచనగా తెలుస్తోంది. రాష్ట్రంలో ఇచ్చిన హామిలు కొంతమేరైనా పూర్తి చేయాలంటూ ఎన్నికలకు ముందు ఈ రెండేళ్లయినా కేంద్రంతో సఖ్యత అవసరం. ఇలాంటి తరుణంలో పురంధేశ్వరి ఎంట్రీ బాబును తీవ్ర ఇబ్బందులకు గురిచేసే అవకాశం ఉండటంతోనే ఈ తరహా ప్రచారాన్ని తెర మీదకు తీసుకొచ్చినట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.
పురంధేశ్వరి కాకపోతే మరెవరూ:
ప్రస్తుత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబును కేంద్ర మంత్రి వర్గంలోకి తీసుకోవాలని బీజేపీ నిర్ణయించుకోవడంతో.. ఆ స్థానాన్ని మరొకరితో భర్తీ చేయడం ఖాయమని తేలిపోయింది. పురంధేశ్వరి కూడా వెంకయ్య, హరిబాబుల సామాజిక వర్గమే కావడంతో ఆమె పేరు బలంగా ముందుకు వచ్చింది.
అయితే ఎప్పుడూ కోస్తాంధ్రకు చెందినవారినే పార్టీ అధ్యక్షులుగా నియమించడం రాయలసీమలో పార్టీ విస్తరణకు అవరోధంగా మారుతుందన్న అభిప్రాయాలు కూడా ఉన్నాయి. దీంతో చిత్తూరు జిల్లాకు చెందిన చల్లాపల్లి నరసింహారెడ్డికి రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి అప్పగించాలన్న డిమాండ్ కూడా వినిపిస్తోంది. సుదీర్ఘకాలంగా పార్టీలోనే కొనసాగుతూ చిత్తూరు జిల్లా తంబళపల్లె నుంచి పలుమార్లు అసెంబ్లీకి పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారాయన.
ఇక నరసాపురం ఎంపీ గోకరాజు రంగరాజు పేరు కూడా అధ్యక్ష పదవి పరిశీలనలో ఉన్నట్లు చెబుతున్నారు. సోము వీర్రాజు, కన్నా లక్ష్మీ నారాయణ పేర్లు కూడా రేసులో బలంగానే వినిపిస్తుండటంతో పార్టీ అధ్యక్ష పీఠం ఎవరిని వరిస్తుందనే దానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది.