వెంకయ్య విషయంలో జగన్ స్ట్రాటజీ ఇదే?: టీడీపీకి కష్టాలే!, వాళ్లు ఎదురుతిరిగే ఛాన్స్..
ప్రత్యర్థికి ఆప్తుడి లాంటి వ్యక్తితో కరచాలనం చేయడం జగన్కు ఎంత చేదుగా ఉన్నా.. భవిష్యత్తులో బీజేపీతో చెలిమి చిగురించాలంటే ఆయనకు ఇవన్ని తప్పేలా లేదు.
న్యూఢిల్లీ: రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వాలు.. శాశ్వత మిత్రుత్వాలు ఉండవన్నది ఎంత నిజమో ప్రస్తుతం 'జగన్' ఫాలో అవుతున్న స్ట్రాటజీ చూస్తే ఇట్టే అర్థమవుతుంది. తొలి నుంచి వెంకయ్యతో అంటీముట్టనట్లే ఉన్న జగన్ కు.. ఇప్పుడు మాత్రం తప్పక.. మనసొప్పక.. ఆయనకు దన్నుగా నిలబడాల్సిన పరిస్థితి ఎదురైంది.
బద్దశత్రువు లాంటి టీడీపీకి అత్యంత సన్నిహితుడైన వెంకయ్యకు జగన్ బాసటగా నిలుస్తారని ఎవరూ ఊహించి ఉండరు. కానీ అనూహ్యంగా ఆయన ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికవడం జగన్ ను ఇరుకున పడేసింది. రాష్ట్రపతి విషయంలో అంటే.. రామ్నాథ్ కోవింద్ తెలుగు రాష్ట్రానికి చెందినవారు కాదు కాబట్టి జగన్ మద్దతునిచ్చినా ఇవ్వకున్నా దానిపై అంతగా చర్చ జరిగేది కాదు.
వెంకయ్య ఎఫెక్ట్, వైసిపికి కొత్త సమస్య: జగన్ ముందు ప్రశ్నలెన్నో
కానీ వెంకయ్య విషయంలో పరిస్థితి వేరు. ప్రత్యర్థికి ఆప్తుడి లాంటి వ్యక్తితో కరచాలనం చేయడం జగన్కు ఎంత చేదుగా ఉన్నా.. భవిష్యత్తులో బీజేపీతో చెలిమి చిగురించాలంటే ఆయనకు ఇవన్ని తప్పేలా లేదు. అందుకే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఫోన్ చేయగానే.. వెంకయ్యకు మద్దతునివ్వడానికి ఓకె అన్నారట జగన్.
వచ్చే ఎన్నికల్లో బీజేపీ జగన్ను ఎంతమేర చేరదీస్తుందో తెలియదు గానీ ఆయన మాత్రం చాలానే ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు టీడీపీకి బీజేపీ హ్యాండ్ ఇస్తుందా? అన్న సంకేతాలు కూడా చూచాయగా కానవస్తున్నాయి. ఇక ఏపీ బీజేపీలో మునుపటి రీతిలో వెంకయ్య అంత క్రియాశీలకంగా వ్యవహరించే అవకాశం లేదు కాబట్టి.. పార్టీలోని వెంకయ్య వ్యతిరేక వర్గం టీడీపీతో తెగదెంపులకు సిద్దపడినా ఆశ్చర్యం లేదు.
గతంలోనే టీడీపీతో తెగదెంపులు చూసుకోవాలంటూ కేంద్రానికి సూచించినవారు.. ఇప్పుడు వెంకయ్య అడ్డు కూడా లేకపోవడంతో.. నిరాటంకంగా ఆ పనిలో నిమగ్నమైపోతారన్న వాదన వినిపిస్తోంది. దీంతో బీజేపీలోని ఆ వర్గం ఇప్పటినుంచే టీడీపీకి ఎదురుతిరిగే అవకాశాలు లేకపోలేదు. మొత్తంగా ఏపీ రాజకీయాన్ని బీజేపీ భలే రసకందాయంలో పడేసిందనే చెప్పాలి.