ఎస్పీపై జయప్రదకు వైరాగ్యం: కొత్త గూడే...
ఎస్పీపై సినీ నటి జయప్రద విసిగిపోయినట్లే ఉన్నారు. తాను తిరిగి ఎస్పీలో చేరబోనని చెబుతూ మోడీని ప్రశంసించారు. ఆమె ఆంతర్యమేమిటి...
షిర్డీ: తాజా పరిణామాలతో ప్రముఖ సినీ నటి జయప్రద సమాజ్వాదీ పార్టీతో విసిగిపోయినట్లే ఉన్నారు. తాను ఎస్పీలో తప్ప మరే పార్టీలోనైనా చేరుతానని చెప్పారు. షిర్డీలో ఆమె సోమవారం మీడియాతో మాట్లాడారు. ఎస్పీపై ఆమె విమర్శల వర్షం కురిపించారు.
ఎస్పీ పాలనలో యుపి గుండారాజ్గా మారిపోయిందని ఆమె దుయ్యబట్టారు. ఆజంఖాన్ వంటి నేతలున్న సమాజ్వాదీ పార్టీలో చేరబోనని ఆమె అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీని గాడిద అని సంబోధించడం సరి కాదని ఆమె అన్నారు. ప్రజలు ఇబ్బందులు ఎదుర్కున్నప్పటికీ మోడీన తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం సరైందేనని ఆమె ప్రశంసించారు.
అమర్ సింగ్ జయప్రదకు రాజకీయ గురువు. ఎస్పీ చీఫ్ ములాయం సింగ్కు ఆయన ఆ మధ్య దగ్గరయ్యారు. దాంతో జయప్రద కూడా ఎస్పీలో తిరిగి చేరుతారని ప్రచారం సాగింది. అయితే, మూలయం సింగ్కు, ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్కు మధ్య విభేదాలు పొడసూపిన నేపథ్యంలో ఆమె ఎస్పీతో విసిగిపోయినట్లు కనిపిస్తున్నారు.
అఖిలేష్ యాదవ్ నుంచి పార్టీని మొత్తంగా తిరిగి ములాయం సింగ్ యాదవ్ చేతుల్లోకి తేవడానికి అమర్ సింగ్ తీవ్రంగా ప్రయత్నించారు. కానీ ఫలితం లభించలేదు. మోడీని ప్రశంసించడాన్ని బట్టి జయప్రద బిజెపి వైపు మొగ్గు చూపుతున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి.