టోల్ గేట్ సిబ్బంది నిర్వాకం.. రూ.40కి బదులు రూ.4 లక్షలు స్వైప్
టోల్ గేట్ ఫీజు కోసం ఓ డాక్టర్ తన డెబిట్ కార్డును సిబ్బంది చేతికిస్తే.. వారు రూ.40కి బదులు రూ.4 లక్షలకి స్వైప్ చేసేశారు. పాపం.. మొబైల్ కి వచ్చిన మెసేజ్ చూసుకోగానే గుండె ఆగినంత పనైంది ఆయనకి.
మంగళూరు: కార్డుల స్వైపింగ్ తో పెద్ద చిక్కొచ్చిపడింది. కార్డు చేతికిస్తే.. అవతలి వాళ్లు ఎంతకి స్వైప్ చేసుకుంటున్నారో కార్డుదారుడికి తెలియడం లేదు. ఒక్కోసారి మొబైల్ ఫోన్ కి మెసేజ్ కూడా రావడం లేదు. దీంతో లోలోపల తెలియని ఆందోళన.
సరిగ్గా ఇలాంటి సంఘటనే కొచ్చి-ముంబై జాతీయ రహదారి దగ్గర్లో ఉడిపి వద్ద చోటు చేసుకుంది. గుండ్మి టోల్ గేట్ వద్ద మైసూరుకు చెందిన ఓ డాక్టర్ డెబిట్ కార్డుపై రూ.40కి బదులు రూ.4 లక్షలు స్వైప్ చేసేశారు.
మైసూరుకు చెందిన డాక్టర్ రావు, తీరప్రాంతం మీదుగా ముంబైకి వెళుతూ టోల్ గేట్ దగ్గర రూ.40 చెల్లించడానికి అక్కడున్న సిబ్బందికి తన కార్డు ఇచ్చారు. కార్డును స్వైప్ చేసిన వ్యక్తి పీఓసీ రశీదు కూడా ఇచ్చాడు.
ఇంతలోనే డాక్టర్ గారి మొబైల్ ఫోన్ కి ఒక మెసేజ్ వచ్చింది. అందులో రూ.4 లక్షలు ఆయన అకౌంట్ నుంచి డెబిట్ అయినట్లుగా ఉంది. దీంతో ఆయనకు షాక్ తగిలినంత పనైంది. వెంటనే ఆ విషయాన్ని టోల్ గేట్ వద్ద ఉండే సిబ్బందికి ఆయన తెలిపినా ఫలితం లేకపోయింది.
వారు తప్పు తమది కాదన్నారు. దీంతో డాక్టర్ రావు దగ్గర్లోని పోలీసు స్టేషన్ కు వెళ్లి ఈ ఉదంతంపై ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగడంతో ఇక టోల్ గేట్ సిబ్బందికి తమ తప్పిదాన్ని ఒప్పుకోక తప్పలేదు. ఆ తప్పుడు మొత్తాన్ని తానే పొరపాటున స్వైప్ చేశానని టోల్ గేట్ అటెండెంట్ ఒప్పపకున్నాడు.
డాక్టర్ రావుకు డబ్బు తిరిగి ఇవ్వడమేకాక.. జరిగిన పొరపాటుకు క్షమాపణ చెబుతూ అదనపు మొత్తాన్ని కూడా ఆఫర్ చేశారు. అయితే ఆయన ఆ డబ్బు తీసుకోకుండా, కేవలం తనకు రావలసిన మొత్తాన్ని మాత్రమే తీసుకున్నారు. సదరు టోల్ గేట్ వద్ద రోజుకి రూ.8 లక్షల వరకు వసూలు అవుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.