కెసిఆర్ వ్యూహం: కెటిఆర్కు ప్రమోషన్, హరీష్ అంతే...
కెసిఆర్ తన తనయుడు కెటిఆర్ను తన వారసుడిగా ముందుకు తెచ్చేందుకు వ్యూహరచన చేసినట్లు చెబుతున్నారు. కెటిఆర్కు పార్టీలో ప్రమోషన్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) కార్యవర్గ పునర్వ్యస్థీకరణలో భారీ మార్పులు సంభవించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తన వారసుడిగా తనయుడు కెటి రామారావును ముందుకు తెచ్చేందుకు కెసిఆర్ వ్యూహరచన చేస్తున్నట్లు సమాచారం.
అందుకు గాను కెటిఆర్కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ లేదా ప్రధాన కార్యదర్శి పదవి అప్పగించే అవకాశాలున్నట్లు ప్రచారం సాగుతోంది. రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, తన వారసుడిగా తనయుణ్ని నిలబెట్టే చర్యల్లో భాగంగా కెసిఆర్ ఆ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
కాంగ్రెస్ 2004లో అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన కరీంనగర్ ఉప ఎన్నికల సమయంలో కెటిఆర్ రాజకీయ రంగ ప్రవేశం చేశారు. అనంతరం ఉద్యమంలోనూ, టిఆర్ఎస్ పార్టీలోనూ ఆయన కీలక పాత్ర పోషిస్తూ వస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టిఆర్ఎస్కు అఖండ మెజారిటీ వచ్చిందంటే అందుకు కెటిఆర్ వ్యూహరచన, దాని అమలు కారణమనే అభిప్రాయం బలపడిపోయింది.
కెసిఆర్ తొలి పరీక్షలో నెగ్గిన కెటిఆర్
గ్రేటర్ హైదరాబాదు నగరపాలక సంస్థ ఎన్నికల్లో అనూహ్యమైన విజయంతో కెసిఆర్ వారసుడిగా తొలి పరీక్షలో కెటిఆర్ గట్టెక్కినట్లు భావిస్తున్నారు. ఉద్యమ కాలంలోనూ, 2014 ఎన్నికల్లోనూ కంటే ఇప్పుడు ముఖ్యమంత్రి కెసిఆర్ బలం మరింత పెరిగింది. అటు పార్టీపైనా, ఇటు ప్రభుత్వంపైనా పూర్తి పట్టు సాధించిన ప్రస్తుత తరుణంలోనే తనయుడికి పార్టీలోనూ కీలక బాధ్యతలు అప్పగించాలని కెసిఆర్ అనుకుంటున్నట్లు చెబుతున్నారు
ఆ సంప్రదాయం ప్రకాకరమే...
ప్రధాన కార్యదర్శిగా కన్నా వర్కింగ్ ప్రెసిడెంట్గానే కెటిఆర్ను నియమించేందుకు కెసిఆర్ ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. తద్వారా తన బాధ్యతలను తగ్గించుకోవడానికి కూడా వీలవుతుందని కెసిఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మాజీ ఎంపి నరేంద్ర తన పార్టీని టిఆర్ఎస్లో విలీనం చేసిన సమయంలో తొలిసారిగా ఆయనకు పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని అప్పగించారు. ప్రస్తుతం తెరాసలో ఆ పదవి లేదు. కాంగ్రెస్, టిడిపిలకు అధ్యక్షులతోపాటు వర్కింగ్ ప్రెసిడెంట్లు కూడా ఉన్నారు. దాంతో వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి తిరిగి స్థానం కల్పించి, కెటిఆర్ను ఆ పదవిలో నియమించాలని కెసిఆర్ భావిస్తున్నట్లు చెబుతున్నారు
అప్పుడు కెటిఆర్కు పట్టణాభిషేకం...
మొదట ఐటి, పంచాయతీరాజ్ శాఖల మంత్రిగా ఉన్న కెటిఆర్ తరువాత ఐటి, పరిశ్రమలు, మున్సిపల్ వ్యవహారాల శాఖలను చేపట్టి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. జిహెచ్ఎంసి ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత మున్సిపల్ శాఖను కెటిఆర్కు అప్పగించారు. దాన్ని కెటిఆర్ పట్టణాభిషేకంగా అభివర్ణించిన సందర్భాలున్నాయి. హైదరాబాదు ఎన్నికల్లో విజయం వల్ల కెటిఆర్కు ఆ పదవి అప్పగించినా పెద్దగా వ్యతిరేకత రాలేదు.
పవర్ సెంటర్గా కెటిఆర్, హరీష్ రావు...
కెటిఆర్ తెలంగాణ ఉద్యమంలోకి రాక ముందు హరీష్ రావు కీలకంగా వ్యవహరిస్తూ వచ్చారు. కెసిఆర్ తర్వాత హరీష్ రావే అనే అభిప్రాయం కూడా బలంగా ఉండేది. అయితే కెటిఆర్ రంగ ప్రవేశం చేసి, అటు పార్టీలోనూ ఇటు ప్రభుత్వంలోనూ కీలకంగా మారడంతో హరీష్ రావు పాత్ర తగ్గినట్లు భావిస్తున్నారు. ఈ స్థితిలో కెటిఆర్ ముఖ్యమంత్రి తరువాత ప్రభుత్వంలో పవర్ సెంటర్గా ఎదిగారు.
ఈసారి అప్పటి కన్నా భిన్నంగా...
ఇప్పటివరకు నిర్వహించిన తెరాస ప్లీనరీకి భిన్నంగా ఈసారి నిర్వహించనున్నారు. గతంలో హైదరాబాద్లోనూ, జిల్లాల్లోనూ పార్టీ ప్లీనరీ నిర్వహించినా ఒకేరోజు ప్లీనరీ, బహరంగసభ జరిగేవి. అందుకు భిన్నంగా ఈసారి ప్లీనరీ ఒక చోట, బహిరంగ సభ మరో చోట నిర్వహిస్తున్నారు. సాధారణంగా 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున ప్లీనరీ జరుగుతుంది. కానీ ఈసారి ఏప్రిల్ 21న హైదరాబాద్లో పార్టీ ప్లీనరీ నిర్వహిస్తున్నారు. ప్లీనరీ అనంతరం ఆరు రోజుల తరువాత 27న వరంగల్లో బహిరంగ సభ జరపాలని నిర్ణయించారు.
కూతురు కవిత అక్కడే...
నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలిగా ఉన్న కల్వకుంట్ల కవితను జాతీయ స్థాయి రాజకీయాలకు మాత్రమే పరిమితం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆమె తన సొంతంగా తెలంగాణ జాగృతిని నడిపిస్తూ రాజకీయాల్లో కూడా పైపైకి ఎదగాలనే ప్రయత్నంలో ఉన్నారు. ఆమె పార్టీలో సోదరుడు కెటిఆర్కు ఇప్పుడే పోటీ ఇచ్చే పరిస్థితులు మాత్రం లేవని అంటున్నారు.