మూత్రం తాగితే కొడుకు పుడుతాడని!: తీర్థంలా సేవించి, మండ్యలో విచిత్ర మొక్కు
మండ్య: జనం వెర్రి అనుకోవాలో లేక మూఢనమ్మకాలు మనుషులను ఇంత బలహీనంగా మారుస్తాయనుకోవాలో తెలియదు గానీ నమ్మకం పేరిట కొన్నిసార్లు మనుషులు చేసే చేష్టలు జుగుప్సను కలిగిస్తాయి.
ముఖ్యంగా సంతానం విషయంలో కొందరు దంపతులు ఎంతటి చాదస్తానికైనా వెనుకాడటం లేదు. కొడుకు పుట్టాలన్న కోరికతో ఆఖరికి మూత్రాన్నే తీర్థంగా సేవించే తంతు కూడా కొనసాగుతోంది.
తాజాగా కర్ణాటకలోని మండ్య జిల్లాలో ఇలాంటి వ్యవహారం ఒకటి వెలుగుచూసింది. పాండవపుర తాలూకాలోని డింక గ్రామంలో ఏటా ఆంజనేయ స్వామి పండుగ జరుపుతారు. ఈ సందర్భంగా కొడుకు పుట్టాలని భావించే దంపతులు స్వామిని మొక్కుకుంటారు. ఒకవేళ తమ కోరిక నెరవేరితే.. పుట్టిన బాలుడిని నగ్నంగా మార్చి ఆలయం ఎదుట విచిత్రమైన రీతిలో పూజలు చేస్తారు.
ఇదే క్రమంలో మొక్కు ద్వారా పుట్టిన ఓ బాలుడిని ఇటీవల ఆంజనేయ స్వామి ఆలయం ఎదుట నగ్నంగా ఊరేగించారు. ఓ నిచ్చెనపై కూర్చోబెట్టి.. బాల హనుమంతుగా అతన్ని స్తుతిస్తూ ఊరేగింపు కార్యక్రమం కొనసాగింది. అప్పటికే ఆలయం వద్ద బాలుని కోసం ఎదురుచూస్తున్న కొంతమంది దంపతులు.. బాలుడు అక్కడికి రాగానే అతని మూత్రాన్ని తీర్థంలా సేవించారు. ఆపై మీద చల్లుకున్నారు.
ఇలా చేయడం వల్ల తమకు మగబిడ్డే పుడుతుందనేది వారి నమ్మకం. ఈ సందర్భంగా బాల హనుమంతు ఆ ప్రాంతం మొక్క భవిష్యవాణి గురించి వివరించాడు. ఈ సాంప్రదాయం అక్కడ ఏళ్లుగా కొనసాగుతుండటం గమనార్హం.