ఇద్దరు యువతులు.. ఇష్టపడ్డారు.. పెళ్లి చేసుకుని పరారయ్యారు
పరస్పరం ఇష్టపడిన ఇద్దరు యువతులు పెళ్లి చేసుకుని ఇంటి నుంచి పరారైన ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది.
బెంగళూరు: ఇద్దరు యువతులు ఇంటి నుంచి పరారయ్యారు. అయితే ఇందులో అంతగా ఆశ్చర్యపోవలసిన విషయం ఏముంది? అనుకుంటున్నారు కదూ! ఆగండాగండి.. అక్కడే ఉంది అసలు కథ.
వారిద్దరూ మామూలుగా ఇంటి నుంచి పారిపోలేదు. ఒకరినొకరు ఇష్టపడ్డారు.. పెళ్లి చేసుకుని ఇంటి నుంచి పరారయ్యారు. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన వారి కుటుంబ సభ్యులు తమ కుమార్తెలను వెతికి అప్పగించాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసుల కథనం ప్రకారం ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. పరారైన యువతుల ఇద్దరి వయసు 20 ఏళ్లే. శుక్రవారం సాయంత్రం చర్చికి వెళ్లివస్తామని వారి ఇళ్లల్లో చెప్పి బయటికి వెళ్లారు. అంతే - ఇక తిరిగి రాలేదు.ఒకే ప్రాంతానికి చెందిన వీరిద్దరూ ఒకే పాఠశాలలో చదువుకున్నారు. తామిద్దరం సహజీవనం చేస్తామంటూ పట్టుబట్టడంతో పెద్దలు ఆశ్చర్యపోయారు. ఇరు కుటుంబాల పెద్దలు 'అది తప్పు' అంటూ కౌన్సెలింగ్ ఇప్పించారు.
అయితే కొద్ది నెలల క్రితం ఆ యువతులిద్దరూ తమిళనాడులోని మధురైకి వెళ్లి.. అక్కడి హిజ్రాల సహకారంతో వివాహం చేసుకున్నారు. అనంతరం ఇద్దరూ మధురై న్యాయస్థానంలో హాజరై.. తాము వివాహం చేసుకున్నామని న్యాయమూర్తి సమక్షంలో తెలిపారు.
అయితే న్యాయమూర్తి ఇరు కుటుంబాల సభ్యులను మధురైకి పిలిపించి, వారికి కౌన్సెలింగ్ ఇచ్చి, వారి వారి బిడ్డలను ఇళ్లకు తీసుకెళ్లాలని సూచించారు. అయితే బెంగళూరుకు తీసుకొని వచ్చిన తరువాత ఇరు కుటుంబాల పెద్దలు వారిని బయటికి వెళ్లనీయకుండా, ఒకరినొకరు కలవకుండా జగ్రత్తలు తీసుకున్నారు.
కానీ శుక్రవారం సాయంత్రం ఆ ఇద్దరు యువతులు ఒక పథకం ప్రకారం చర్చికి వెళ్లివస్తామని చెప్పి ఇళ్లల్లోంచి వెళ్లిపోయి, చర్చిలో మళ్లీ పెళ్లి చేసుకుని అక్కడ్నించి పరారయ్యారు. ఈ మేరకు ఇరు కుంటుంబాల పెద్దల నుంచి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని, పారిపోయిన ఇద్దరు యువతులను పట్టుకునేందుకు తీవ్రంగా గాలిస్తున్నారు.