మాజీ మంత్రిని మట్టుబెట్టేందుకు మరో మాజీ మంత్రి పథకం, మావోయిస్టులకు రూ.5 కోట్ల సుపారీ!?
జార్ఖండ్ మాజీ మంత్రి రమేష్ సింగ్ ముండాను మట్టుబెట్టేందుకు తాను రూ.5 కోట్లు తీసుకున్నట్లు జైల్లో ఉన్న మావోయిస్ట్ కమాండర్ కుందన్ పహాన్ వెల్లడించాడు. జాతీయ దర్యాప్తు సంస్థ విచారణలో ఈ సంచలన విషయం వెల్లడై
రాంచీ: జార్ఖండ్ మాజీ మంత్రి రమేష్ సింగ్ ముండాను మట్టుబెట్టేందుకు తాను రూ.5 కోట్లు తీసుకున్నట్లు జైల్లో ఉన్న మావోయిస్ట్ కమాండర్ కుందన్ పహాన్ వెల్లడించాడు. జాతీయ దర్యాప్తు సంస్థ విచారణలో ఈ సంచలన విషయం వెల్లడైంది.
పోలీసుల కథనం ప్రకారం... 2008లో ఈ ఘటన జరిగింది. జేడీయూ నేత అయిన రమేష్ ముండాను హతమర్చేందుకు మరో మాజీ మంత్రి గోపాల కృష్ణ పటార్ అలియాస్ రాజా పీటర్... మావోయిస్ట్ కమాండర్ కుందన్ పహాన్ తో ఈ మేరకు ఒక ఒప్పందం కుదుర్చుకున్నాడు.
జూలై 2008లో ఓ బహిరంగ సభలో పాల్గన్న రమేష్ ముండాను మావోయిస్ట్ గెరిల్లాలు కాల్చి చంపారు. తాజాగా ఎన్ఐఏ విచారణలో ఈ 'సుపారీ' విషయం వెలుగులోకి రావడంతో ముండా హత్య కేసులో సోమవారమే రాజా పీటర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
2009 ఉప ఎన్నికల్లో అప్పటి జార్ఖండ్ ముఖ్యమంత్రి, జేఎంఎం చీఫ్ శిబు సోరెన్ ను ఓడించి రాజా పీటర్ చరిత్ర సృష్టించాడు. రమేష్ ముండాను హతమార్చే పథకంలో భాగంగా తొలుత రాజా పీటర్ రూ.3 కోట్లు అడ్వాన్స్ గా చెల్లించాడు. హత్యానంతరం మిగిలిన రూ.2 కోట్లు చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నాడు.
అయితే రమేష్ ముండా హత్యానంతరం సీపీఐ-మావోయిస్ట్ పోలిట్ బ్యూరోకు ఆ రూ.2 కోట్ల డబ్బు అందలేదు. ఆ డబ్బును మావోయిస్ట్ కమాండర్ బలరామ్ సాహు తీసుకుని పరారయ్యాడు. తర్వాత బలరామ్ ను కూడా పోలీసులు అరెస్టు చేశారు.
అసలు అంత పెద్ద మొత్తంలో డబ్బు రాజా పీటర్ ఎలా ఇచ్చాడు? వాటిని ఎవరు సమకూర్చారు? అనే కోణంలో కూడా దర్యాప్తు అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాజా పీటర్ కూడా ఎన్ఐఏ రిమాండ్ లో ఉన్నాడు.
ముండా హత్య కేసును పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్న ఎన్ఐఏ జైల్లో ఉన్న మావోయిస్ట్ లను కూడా విచారించాలని నిర్ణయించింది. ముండా హత్య కేసులో ఆయన బాడీగార్డ్ అయని ఎస్సై శేష్ నాథ్ సింగ్ ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రమేష్ ముండా కదలికలపై మావోయిస్ట్ లకు ఆయనే సమాచారం ఇచ్చాడనే ఆరోపణలు ఎస్సై శేష్ నాథ్ సింగ్ పై ఉన్నాయి.