మాయావతి రహస్యం వెలుగు చూసింది: ఏమిటి?
మాయావతి ధారాళంగా మాట్లాడినట్లు కనిపిస్తారు. ఆమె అలా మాట్లాడడానికి ఓ కారణం ఉంది. ఆ రహస్యాన్ని ఆమె విప్పి చెప్పారు.
లక్నో: బహుజన సమాజ్ పార్టీ (బిఎస్పీ) చీఫ్ మాయావతికి సంబంధించిన రహస్యం ఒకటి తాజాగా వెలుగు చూసింది. ఆమె ముందుగా రాసుకున్న ప్రసంగ పాఠాలను మాత్రమే చదువుతారు, విడిగా మాట్లాడారు. ఈ విషయం శుక్రవారంనాడు వెలుగు చూసింది. ఆ విషయం ఆమె నోటి వెంటనే వెలువడింది.
తన తమ్ముడు ఆనంద కుమార్ను ఆమె శుక్రవారంనాడు పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడిగా నియమించారు. ఈ సందర్బంలో ఆమె తొలిసారి తన ఆరోగ్య పరిస్థితిపై కార్యకర్తలకు చెప్పారు. ముందుగా రాసుకున్న ప్రసంగ పాఠాలను తాను ఎందుకు చదవాల్సి వస్తుందో ఆమె చెప్పారు.
తాను 1996లో ఓ గ్రంథిని కోల్పోయానని, గొంతులోని రెండు గ్రంథుల్లో ఒకదాన్ని వైద్యులు శస్త్రచికిత్స చేసి తొలగించారని, అందువల్ల గొంతుపై ఎక్కువ ఒత్తిడి పెట్టలేనని ఆమె చెప్పారు. ముందుగా రాసి సిద్ధం చేసుకున్న ప్రసంగ పాఠాలను మాత్రమే చదవాలని తనకు వైద్యులు సలహా ఇచ్చినట్లు కూడా ఆమె తెలిపారు.
ప్రసంగ పాఠాన్ని రాసుకోవడానికి ముందుగా తాను చాలా శ్రమిస్తానని, తర్వాత దాన్ని మాట్లాడుతానని ఆమె చెప్పారు. ఈవిఎంల ట్యాంపరింగ్ అంశాన్ని లేవనెత్తినందుకు బిజెపి తనను లక్ష్యంగా చేసుకుందని ఆమె విమర్శించారు.