ఈజిప్టులో హత్య: నిందితురాలికి కడపలో శిక్ష
ఈజిప్టులో హత్యానేరానికి పాల్పడిన ఓ మహిళను మనదేశంలోని జైలుకు తరలించారు.
కడప: ఈజిప్టులో హత్యానేరానికి పాల్పడిన ఓ మహిళను మనదేశంలోని జైలుకు తరలించారు. ఈజిప్టులోనే శిక్ష అనుభవించాల్సి ఉన్నప్పటికీ.. మన దేశంలో కూడా శిక్షను అనుభవించే అవకాశం ఉండటంతో ఆమెను కడప జైలుకు తరలించారు. దీంతో ఆమె తన సొంత ప్రాంతంలోనే శిక్షను అనుభవించే అవకాశం ఏర్పడింది.
వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లా కేవీ పల్లెకు చెందిన నాగమునెమ్మ అలియాస్ నాగమణి (45) జీవనోపాధి కోసమని కొన్నేళ్ల క్రితం గల్ఫ్కు వెళ్లింది. ఈ నేపథ్యంలో ఈజిప్టులో ఆమెకు తెలిసిన వారు ఉంటే గల్ఫ్ నుంచి ఈజిప్టు దేశానికి వచ్చింది.
అక్కడ ఆమె ఓ హత్య కేసులో చిక్కుకుంది. ఈజిప్టు పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచగా ఆమెకు జీవిత ఖైదు శిక్ష విధించారు. కానీ, ప్రస్తుతమున్న చట్టాల్లో వెలుసుబాటు వల్ల నిందితురాలు సొంత ఊళ్లొనే జైలు శిక్ష అనుభవించే అవకాశం ఉంది.
ఈ క్రమంలో ఆమె అభ్యర్థన మేరకు ఈజిప్టు కోర్టు ఆమెను చిత్తూరుకు పంపించింది. హత్య కేసు కావడంతో నాగమణిని మంగళవారం కడప కేంద్ర కారాగారానికి తీసుకొచ్చారు. కాగా, ఆమె 2025లో విడుదలవుతారని జైలు అధికారులు తెలిపారు.