వైసీపీకి చిక్కక టీడీపీలోకి: డిసైడ్ చేసేది ముస్లింలే.. ఇదీ నంద్యాల 'రియాలిటీ'?
నంద్యాల గెలుపోటముల సమీకరణాలన్ని ముస్లిం ఓట్ల చుట్టూ ముడిపడి ఉండటంతో.. వారి మద్దతు ఎవరికి లభిస్తే వారిదే విజయమన్నది స్పష్టమవుతోంది.
నంద్యాల: గురువారం నాటి వైసీపీ బహిరంగ సభతో నంద్యాల ఉపఎన్నిక మరింత రసవత్తరంగా మారింది. వైసీపీ వేదిక మీద ఊగిపోయే ప్రసంగాలు చేసిన శిల్పా బ్రదర్స్.. ఆ పార్టీకి ఎంతమేర దోహదపడుతారన్నది ఆసక్తికరంగా మారింది.
నిజానికి టీడీపీ, వైసీపీలు తమ బలాబలాల కన్నా కుల సమీకరణాలనే బలంగా నమ్ముకున్నాయన్న విషయం మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది. ముఖ్యంగా ముస్లిం ఓటు బ్యాంకును టార్గెట్ చేసుకుని ఈ రెండు పార్టీలు వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి.
'జగన్ది రాక్షస.. శిల్పా సోదరులది పిశాచి మనస్తత్వం': టీడీపీలోకి ఇంతియాజ్
ఈ నేపథ్యంలోనే ముస్లింల పట్ల ప్రభుత్వ తీరును ఎండగడుతూ వైసీపీ నాయకులు వారికి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. గురువారం నాటి బహిరంగ సభలోను ముఖ్య నాయకులంతా ప్రధానంగా ముస్లింలను ఉద్దేశించి మాట్లాడే ప్రయత్నం చేశారు. ముస్లిం పెద్దలంతా తమవైపే ఉన్నారన్న విశ్వాసం కూడా వ్యక్తం చేశారు.
పసిగట్టిన టీడీపీ:
ముస్లింలకు కేబినెట్లో స్థానం ఇవ్వకపోవడం.. సంక్షేమ కార్యక్రమాల విషయంలోను వారి పట్ల అంత శ్రద్ద పెట్టకపోవడం.. టీడీపీకి ప్రతికూలంగా మారాయి. ఈ పరిస్థితిని క్యాష్ చేసుకునేందుకు వైసీపీ వేస్తున్న ఎత్తుగడలను టీడీపీ ముందుగానే పసిగట్టినట్లుంది.
అందుకే నంద్యాలలో ముస్లిం మైనారిటీలంతా ఎక్కువగా అభిమానించే ఇంతియాజ్ అహ్మద్ కు ఆ పార్టీ గాలం వేసింది. . నేష నల్ విద్యాసంస్థల చైర్మన్గా, నేషనల్ ఎయిడెడ్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ గా ఆయన అందరికీ సుపరిచితమే. సామాజిక సేవా కార్యక్రమాలు, పేద ముస్లింలను ఆదుకోవడం, హజ్యాత్రకు వెళ్లే వందలాది మంది ముస్లింలకు ఉచిత శిక్షణ, ప్రజారోగ్య శిబిరాలు వంటి కార్యక్రమాల ద్వారా ఆయన ప్రజలకు మరింత చేరువయ్యారు.
అలాంటి వ్యక్తిని పార్టీలో చేర్చుకుంటే నంద్యాల ముస్లింలలో ఉన్న అసంతృప్తిని సద్దుమణిగేలా చేయవచ్చునని ఆ పార్టీ వ్యూహ రచన చేసింది.
Recommended Video
వైసీపీకి చిక్కక, టీడీపీలో చేరిన ఇంతియాజ్:
అనుకున్నట్లుగానే ఇంతియాజ్ అహ్మద్ను తమ పార్టీలో చేర్చుకోవడంలో టీడీపీ సఫలమైంది. అయితే టీడీపీ కన్నా ముందుగానే ఆయన్ను తమ పార్టీలో చేర్చుకోవాలని వైసీపీ కూడా ప్రయత్నించినట్లు చెబుతున్నారు. ఇందుకోసం ఆయనకు ఎమ్మెల్సీ పదవి కూడా ఆఫర్ చేశారన్న ప్రచారం ఉంది.
అంతేకాదు, జగన్ మేనమామ రవీంద్రనాథ్రెడ్డి, కడప ఎమ్మెల్యే అమ్జద్బాషాతో పాటు ఆ పార్టీకి చెందిన ఎంపీలు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇంతియాజ్ అహమ్మద్ తో గత నెలరోజులుగా చర్చలు జరుపుతూ వచ్చారని కూడా తెలుస్తోంది. అయితే ఈ ప్రచారమంతా టీడీపీ అనుకూల వర్గం నుంచి జరుగుతున్నది కావడంతో.. ఇందులో నిజమెంత అన్నది చెప్పడమే కష్టమే.
ముస్లిం ఓటు బ్యాంకే కీలకం:
ప్రస్తుతం నంద్యాల నియోజకవర్గంలో మొత్తం 2.30లక్షల ఓటర్లు ఉన్నారు. వీరిలో 70వేలకు పైగా ముస్లిం ఓటర్లు ఉన్నారంటే.. ఇక్కడ వారి ప్రాబల్యం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. వారిని ప్రసన్నం చేసుకోవడం కోసమే గత రంజాన్ మాసంలో సీఎం చంద్రబాబు రూ.1కోటి ఖర్చు పెట్టి మరీ వారికి ఇఫ్తార్ విందు ఇచ్చారు.
నంద్యాల ఉపఎన్నిక అవసరాన్ని గుర్తించే.. ఎప్పుడూ లేనిది ఆయన నంద్యాలలో ఇఫ్తార్ విందు ఇచ్చారని చెబుతారు. నంద్యాల గెలుపోటముల సమీకరణాలన్ని ముస్లిం ఓట్ల చుట్టూ ముడిపడి ఉండటంతో.. వారి మద్దతు ఎవరికి లభిస్తే వారిదే విజయమన్నది స్పష్టమవుతోంది.
అందుకే అటు వైసీపీ, ఇటు టీడీపీ ఎవరికీ వారు.. మేం ముస్లింల పక్షపాతం అంటూ ప్రచారం చేసుకుంటున్నారు. అయితే ముస్లిం మైనారిటీలు ఈ రెండు పార్టీల్లో ఎవరి మాటలను విశ్వసిస్తారన్నదే నంద్యాల 'గెలుపు'ను డిసైడ్ చేయనుంది.
ఇంతియాజ్ ప్రభావం ఏ మేరకు, ముస్లింలు ఎటువైపు?:
ఇంతియాజ్ అహ్మద్ తమ పార్టీలో చేరాడు కాబట్టి టీడీపీకే విజయవకాశాలు ఎక్కువ అని ఆ పార్టీ ప్రచారం చేసుకుంటోంది. అయితే ఆయన వల్ల టీడీపీకి అంత స్థాయిలో మేలు జరుగుతుందా? అన్నది చెప్పడం కష్టమే. మరోవైపు ముస్లింలలో భూమా పట్ల వ్యతిరేకత ఉందని బహిరంగ సభలో శిల్పా చేసిన వ్యాఖ్యలను కూడా గమనించాలి.
ముస్లింలలో గొడవలు తలెత్తినప్పుడు.. భూమా వారి వైపు కన్నెత్తి కూడా చూడలేదని, ఆ సమయంలో తానే పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి మరీ వారిపై కేసులు లేకుండా చేశానని శిల్పా చక్రపాణిరెడ్డి అన్నారు. ఎప్పుడైనా తనకు తెలియకుండా పొరపాటు జరిగినా క్షమించాలని కూడా విన్నవించారు. దీన్నిబట్టి ముస్లిం ఓట్లపై వైసీపీ కూడా ఎంతలా గురిపెట్టిందో అర్థం చేసుకోవచ్చు.
మొత్తం మీద నంద్యాల ఉపఎన్నికను డిసైడ్ చేయడంలో ముస్లిం సామాజిక వర్గం 'కీ'రోల్ పోషించనుంది. ఈ ఎన్నిక 2019జైత్రయాత్రకు నాంది అంటూ జగన్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో.. ముస్లిం మైనారిటీలు ఎవరిని కరుణిస్తారన్నది ఆసక్తికరం. రాష్ట్ర రాజకీయాల్లో ఈ ఎన్నిక పెనుమార్పులు తీసుకొచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదేమో!