బురద గుంట దాటేందుకు..: కెమెరాకు చిక్కి బుక్కైన ఎమ్మెల్యే
ఒడిశా మల్కన్గిరి బిజూ జనతా దళ్ (బిజెడి) ఎమ్మెల్యే మనస్ మడ్కామీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఆయన ఓ గ్రామంలో వెళ్తుండగా బురదను దాటేందుకు, ఆయన మద్దతుదారులు చేతులపై ఎత్తుకున్నారు.
భువనేశ్వర్: ఒడిశా మల్కన్గిరి బిజూ జనతా దళ్ (బిజెడి) ఎమ్మెల్యే మనస్ మడ్కామీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన ఓ గ్రామంలో వెళ్తుండగా బురదను దాటేందుకు, ఆయన మద్దతుదారులు చేతులపై ఎత్తుకున్నారు.
ఇది విమర్శలకు దారి తీసింది. జిల్లాలో అమలవుతున్న సంక్షేమ పథకాలను పర్యవేక్షించేందుకు ఓ ఎంపీ, ఎమ్మెల్యే నియోజకవర్గంలో పర్యటించారు. అప్పుడు గ్రామంలో కాలినడక వెళ్తుండగా బురద నీటి గుంట ఎదురైంది. అది దాటాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అప్పుడు ఆయన మద్దతుదారులు అతనిని తమ భుజాలపై ఎత్తుకొని బురద గుంటను దాటించారు. అప్పుడు ఆయన తెల్లని దుస్తులు ధరించి ఉన్నారు. అదే సమయంలో ఎమ్మెల్యేతో పాటే ఉన్న ఎంపీ మాత్రం అలాగే నడుస్తూ వచ్చారు.
ఎమ్మెల్యేను కార్యకర్తలు ఎత్తుకున్న ఫొటో ఒకటి స్థానిక మీడియాలో రావడంతో ఈ ఘటన వివాదాస్పదంగా మారింది. అయితే ఎమ్మెల్యే మానస్ మాత్రం కార్యకర్తలకు తనపై ఉన్న ప్రేమ, అభిమానంతోనే ఎత్తుకున్నారని చెబుతూ తనను తాను సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాను ఎవర్నీ బలవంత పెట్టలేదని, తనను అలా తీసుకెళ్తూ వారు ఎంతో ఉప్పొంగిపోయారనడం గమనార్హం.