పన్నీర్ సెల్వంకు కొత్త కష్టాలు.. అద్దె ఇంటికోసం వెతుకులాట..
ఇల్లు ఖాళీ చేయాలని పీడబ్ల్యూ శాఖ నుంచి ఆదేశాలు జారీ అవడంతో పన్నీర్ సెల్వం ఇప్పుడు అద్దె ఇంటి వేటలో ఉన్నట్లు సమాచారం.
చెన్నై: శశికళతో వార్ లో రెంటికి చెడ్డ రేవడిలా మారిన పన్నీర్ సెల్వంను కొత్త కష్టాలు వెంటాడుతున్నాయి. శశికళపై పైచేయి సాధించలేక, ఇటు సొంత పార్టీకి దూరమై.. అటు ఎమ్మెల్యేల రాజకీయ ఆదరణ కరువై ఆయన చతికిలపడిపోయారు.
ఈ నేపథ్యంలో సీఎం పీఠాన్ని అధిష్టించిన చిన్నమ్మ అనుయాయి పళనిస్వామి పన్నీర్ సెల్వంకు చెక్ పెట్టే ప్రయత్నాలను మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఆయన సీఎం అయిన వెంటనే అధికారిక నివాసాన్ని ఖాళీ చేయాలంటూ పన్నీర్ సెల్వంకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ వాహనాన్ని, భద్రతను ఉపసంహరించారు.
ఇల్లు ఖాళీ చేయాలని పీడబ్ల్యూ శాఖ నుంచి ఆదేశాలు జారీ అవడంతో పన్నీర్ సెల్వం ఇప్పుడు అద్దె ఇంటి వేటలో ఉన్నట్లు సమాచారం. అధికారిక నివాసం కేంద్రంగానే పన్నీర్ శశికళపై వ్యూహాస్త్రాలు సంధించిన నేపథ్యంలో ఆ నివాసాన్ని ఖాళీ చేయాల్సిందిగా పళినిస్వామి ఆదేశాలు జారీ చేశారనేది అందరికీ తెలిసిన సత్యమే.
కాగా , 2011లో అన్నాడీఎంకే గెలుపొందిన తర్వాత ఆర్థికశాఖ మంత్రిగా బాధ్యతలను చేపట్టిన పన్నీర్ సెల్వం.. ఆ సమయంలో న్నైలోని గ్రీన్ వేస్ రోడ్డులో ఉన్న పీడబ్ల్యూడీకి చెందిన బంగ్లాలో నివాసమున్నారు. జయలలిత జైలుకు వెళ్లిన తర్వాత సీఎం పదవిని చేపట్టినా.. అప్పుడు కూడా అదే బంగ్లాలో ఉన్నారు.
అప్పటినుంచి ఇప్పటిదాకా అదే బంగ్లాలో నివాసముంటూ వస్తున్న పన్నీర్ సెల్వం ఇప్పుడు దాన్ని ఖాళీ చేయక తప్పని పరిస్థితి వచ్చింది. ఖాళీ చేయడానికి ఆరు నెలల గడువు కోరుదామని అనుచరులు చెబుతున్నా.. పన్నీర్ సెల్వం మాత్రం ఖాళీ చేయడానికే మొగ్గుచూపుతున్నట్లు సమాచారం.
దీంతో ఆయన అద్దె ఇంటి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇదిలా ఉంటే, ఎమ్మెల్యేల ఆదరణ లేకపోయినా.. జనాల్లో మాత్రం కావాల్సినంత సానుభూతిని పన్నీర్ సెల్వం కూడగట్టుకోగలిగారు.ఈ నేపథ్యంలోనే ప్రతీ రోజు ఆయన్ను కలవడానికి తమిళనాడువ్యాప్తంగా చాలామంది ప్రజలు తరలివస్తున్నారు.