పార్ట్ టైమ్ స్మగ్లర్లు! సంపాదన బాటలో మాదకద్రవ్యాల ఏజెంట్ల అవతారం
అడ్డగోలు సంపాదన కోసం గంజాయి స్మగ్లర్ల అవతారం ఎత్తిన వాళ్ళు చివరికి పోలీసుల చేతికి చిక్కి ప్రస్తుతం కటకటాలు లెక్కబెడుతున్నారు.
హైదరాబాద్: 'ఎన్నాళ్ళు చెమటోడ్చితే ఏం లాభం? కాస్త తెగిస్తే చాలు.. ఊహించనంత డబ్బు చేతికి వస్తుంది. నెలరోజుల ఆదాయం ఒక్కరోజులో సంపాదించవచ్చు..' సరిగ్గా ఇలాగే ఆలోచించారు వాళ్ళు. ఏమైతే అది అయిందని అడ్డగోలు సంపాదన కోసం గంజాయి స్మగ్లర్ల అవతారం ఎత్తారు.
కానీ, చివరికి అదృష్టం వెక్కిరించింది. ప్లాన్ బెడిసికొట్టింది. పోలీసుల చేతికి చిక్కి ప్రస్తుతం కటకటాలు లెక్కబెడుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. పెరుగుతున్న మత్తు పదార్థాల వినియోగం మాదకద్రవ్యాల మాఫియాకు కాసుల వర్షం కురిపిస్తోంది.
కొత్త ఏడాది తొలి వారం రోజుల వ్యవధిలోనే హైదరాబాదు మహానగరంలో పోలీసులు దాడులు జరిపి సుమారు 90 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారంతా కమీషన్ గా వచ్చే అదనపు ఆదాయం కోసమే ఈ పని చేస్తున్నట్లు చెప్పడం విశేషం.
శుక్రవారం వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు గంజాయి తరలిస్తున్న నలుగురిని మంగళ్ హాట్ గంగాబౌలి వద్ద పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 32 కిలోల గంజాయి, 3 సెల్ ఫోన్లు, రూ.32 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్ ఫోర్స్ డీసీపీ బి.లింబారెడ్డి వెల్లడించారు.
పోలీసులకు పట్టుబడిన వారిలో విశాఖజిల్లా గోపాలపాలెం నివాసి జె.త్రినాథ్, హైదరాబాదుకు చెందిన సునీల్ సింగ్, సి.విక్కీ సింగ్, గణపతి సింగ్ ఉన్నారు. వీరంతా కుటుంబ పోషణకు వస్త్ర దుకాణం, వినాయక విగ్రహాల కార్మికులుగా పనిచేస్తుంటారు.
మాదకద్రవ్యాల సరఫరాలో కీలక సూత్రధారి అయిన బాలాజీ అనే వ్యక్తి రహస్యంగా సరుకును గమ్యం చేర్చేందుకు వీరిని ఏజెంట్లుగా నియమించుకున్నాడు. అధిక మొత్తంలో లాభం వస్తుందని ఆశ చూపడంతో వీరంతా ముఠాగా ఏర్పడి విశాఖ ఏజెన్సీ ప్రాంతాల నుంచి ఇక్కడికి మత్తు పదార్థాలను చేర వేస్తున్నారు.
నిందితులలో ఒకడైన త్రినాథ్ స్వస్థలమైన విశాఖజిల్లా గోపాలపాలెంలోని వ్యవసాయ భూమిలో గంజాయి సాగు చేపట్టాడు. స్థానికుల నుంచి రూ.5 వేలకు రెండు కిలోల గంజాయిని కొని దానిని హైదరాబాద్ చేర్చి రూ.10 వేలకు విక్రయించేవాడు.
ఇలా రెట్టింపు లాభాలు వస్తుడడంతో మరికొందరిని ఏజెంట్లుగా తయారు చేసి భారీగా మత్తు పదార్థాలు తరలిస్తూ వస్తున్నారు. ఈ మేరకు సమాచారం అందడంతో శుక్రవారం టాస్క్ ఫోర్స్ ఇన్ స్పెక్టర్ ఎల్.రాజారెడ్డి, ఎస్సైలు పి.మల్లికార్జున్, ఎం.ప్రభాకర్ రెడ్డి, వి.కిషోర్, ఎల్.భాస్కర్ రెడ్డి తమ సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించి నిందితులను అదుపులోకి తీసుకుని మంగళ్ హాట్ పోలీసు స్టేషన్లో అప్పగించారు.
మత్తుకు బానిస అవుతున్న యువత!
ముఖ్యంగా కళాశాల విద్యార్థులు, ఐటి ఉద్యోగులు ఈ మత్తు పదార్థాలకు బానిసలు అవుతున్నట్లు తెలుస్తోంది. ధూల్ పేట్, మంగళ్ హాట్ ప్రాంతాలు కేంద్రంగా సాగుతున్న గంజాయి వ్యాపారాన్ని కట్టడి చేసేందుకు ఎక్సైజ్ శాఖ సన్నద్ధమవుతోంది.
గంజాయికి నగరంలో క్రమేణా డిమాండ్ పెరుగుతున్నట్లు గణాంకాలు తెలుపుతున్నాయి. దీనిని అవకాశంగా చేసుకుని సులువుగా డబ్బు సంపాదించేందుకు దుకాణాలు, పరిశ్రమల్లో రోజువారీ కూలీలుగా పనిచేసే యువకులు గంజాయి ఏజెంట్లుగా మారుతున్నారు.
కిలో గంజాయిని 5, 10 గ్రాముల ప్యాకేట్లుగా మార్చి వీరి విక్రయిస్తున్నారు. కిలో గంజాయి అమ్మితే వీరికి రూ.5 వేల నుంచి రూ.8 వేల వరకు లాభం వస్తున్నట్లు తెలుస్తోంది. నగరంలో గుడుంబా విక్రయాలు తగ్గడంతో అటువైపు నుంచి కొందరు ఈ మత్తు పదార్థాల రవాణా వైపు మొగ్గు చూపుతున్నారు.