అరాచకం: అప్పు చెల్లించకపోతే మీ చెల్లిని ఎత్తుకెళ్తానన్న వడ్డీ వ్యాపారి
వడ్డీ వ్యాపారుల ఆగడాలు శృతిమించిపోతున్నాయి. ఆ మధ్య ‘కాల్ మనీ’ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి ప్రకంపనలు సృష్టించిందో తెలిసిందే.
హైదరాబాద్: వడ్డీ వ్యాపారుల ఆగడాలు శృతిమించిపోతున్నాయి. ఆ మధ్య 'కాల్ మనీ' వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి ప్రకంపనలు సృష్టించిందో అందరికీ తెలిసిందే. ప్రజాప్రతినిధులే ఫైనాన్స్ వ్యాపారులగా మారి పేద, మధ్యతరగతి ప్రజానీకం ధన, మాన, ప్రాణాలు కొల్లగొట్టడం సంచలనం సృష్టించింది.
అసలు అక్రమ వడ్డీ వ్యాపారులను శిక్షించేందుకు కఠినమైన చట్టాలు లేకపోవడం మన వ్యవస్థలో పెద్ద లోపం అయితే , కొన్ని చట్టాలు ఉన్నప్పటికీ వాటి అమలులో కొంతమంది పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తుండడంతో వడ్డీ వ్యాపారుల అక్రమాలకు అడ్డుకట్ట పడడం లేదు.
ఇప్పటికీ అక్కడక్కడా వడ్డీ వ్యాపారుల ఆగడాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. కొన్నిచోట్ల రక్షించాల్సిన పోలీసులే వడ్డీ వ్యాపారులకు కొమ్ముకాస్తుండడంతో వీరి దౌర్జన్యాలకు అంతూ పొంతూ లేకుండాపోతోంది.
తాజాగా హైదరాబాద్ లో ఓ వడ్డీ వ్యాపారి దౌర్జన్యం వెలుగులోకి వచ్చింది. తన అవసరం కోసం అప్పు తీసుకున్న ఓ వ్యక్తి నిన్సహాయ పరిస్థితిని ఆసరాగా తీసుకుని చెలరేగిపోయాడో వడ్డీ వ్యాపారి.
ఏకంగా 'అప్పు చెల్లించకపోతే మీ చెల్లిని ఎత్తుకెళ్తాం..' అని బెదిరించాడు. ఈ ఘటనపై బాధితుడు ఫిర్యాదు చేయడంతో బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని ముషీరాబాద్ పోలీసులు సోమవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
ఇన్స్పెక్టర్ రాం చంద్రారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లాకు చెందిన శ్రీకాంత్ రాంనగర్ రిసాల గడ్డలో కిరాణా వ్యాపారం చేస్తున్నాడు. వ్యాపారం కోసం డబ్బు కావాలని అదే ప్రాంతంలో నివసిస్తున్న విక్కీ అనే వ్యక్తిని అడిగాడు.
అతడు తనకు తెలిసిన ఫైనాన్స్ వ్యాపారి రాజేందర్ వద్ద రూ. 10 లక్షలు శ్రీకాంత్ కు ఇప్పించాడు. అప్పు ఇచ్చే ముందరే లక్షన్నర రూపాయలు పట్టుకుని, రూ. 8.5 లక్షలను మాత్రమే శ్రీకాంత్కు ఇచ్చి.. రోజుకు రూ. 5 వేలు కట్టాలని షరతు విధించారు.
ఆ డబ్బును తన వ్యాపారంలో పెట్టుబడిగా ఉపయోగించుకున్న శ్రీకాంత్ రూ. 5 వేల చొప్పున రెండు నెలలపాటు చెల్లించాడు. ఆ తరువాత ఆర్థిక ఇబ్బందుల్లో పడిపోయి వడ్డీ వ్యాపారికి డబ్బు చెల్లించలేకపోయాడు.
దీంతో రాజేందర్ ఈ విషయాన్ని విక్కీ దృష్టికి తీసుకెళ్లి తనకు డబ్బు చెల్లించాలని కోరాడు. అతడు శ్రీకాంత్ వద్దకెళ్లి ఒప్పందం ప్రకారం రోజూ రూ. 5 వేలు చెల్లించాల్సిందేనని, మరో మార్గం లేదని బెదిరించడంతో... చెల్లించడానికి ప్రస్తుతం తన వద్ద డబ్బు లేదని, తరువాత ఇస్తానని శ్రీకాంత్ ప్రాధేయపడ్డాడు.
అయినప్పటికీ విక్కీ వినకుండా.. 'షరతు ప్రకారం డబ్బు చెల్లించకపోతే మీ చెల్లిని ఎత్తుకెళ్తా..' అని శ్రీకాంత్ ను బెదిరించాడు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన శ్రీకాంత్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు కేసు నమోదు చేసుకుని విక్కీని అరెస్టు చేశారు. ఫైనాన్స్ వ్యాపారి రాజేందర్ పరారీలో ఉన్నాడని, అతడి కోసం గాలిస్తున్నామని సీఐ రాం చంద్రారెడ్డి చెప్పారు.