ఇవీ లింకులు: తీగ లాగితే డొంకంతా!.. బోటు విషాదంతో వెలుగులోకి నివ్వెరపోయే విషయాలు
మత్స్యశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న స్టేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీ (ఎస్ఐఎఫ్టీ)లో కచ్చితంగా శిక్షణ తీసుకోవాలి.
Recommended Video
కాకినాడ: కృష్ణా నదిలో బోటు విషాదం రాష్ట్రంలో పర్యాటక రంగానికి పెద్ద సవాల్ గా మారింది. అధికారుల అక్రమాలకు తోడు రాష్ట్రంలో తయారవుతున్న నాసిరకం బోట్లు కూడా పర్యాటకులకు ప్రమాదకరంగా మారాయి.
తీగ లాగితే డొంకంతా కదిలినట్టు.. కృష్ణా నదిలో బోటు ప్రమాదం తర్వాత పలు నివ్వెరపోయే విషయాలు బయటపడుతున్నాయి. పర్యాటక రంగంలో అక్రమాలే కాదు.. ఆఖరికి బోట్ల తయారీలోను నాసిరకానికే మొగ్గుచూపడం పర్యాటకుల ప్రాణాల మీదకు తెస్తోంది.
డబ్బులకు కక్కుర్తిపడి కొంతమంది యజమానులు నాసిరకం బోట్లు తయారుచేయిస్తున్నారు. ఇటీవలి విషాదం సంఘటనకు నాసిరకం బోటును ఉపయోగించడం కూడా ప్రమాదానికి ఒక కారణంగా చెబుతున్నారు. ఈ బోటు నాసిరకమనే వాదనలు వెల్లువెత్తుతున్నాయి.
బోట్ల తయారీ:
ఏపీలో బోట్లకు తయారీకి కాకినాడ, విశాఖపట్నంలోని నక్కపల్లి ప్రసిద్ది. ఈ రెండు చోట్ల మాత్రమే బోట్లను తయారుచేస్తుంటారు. అందులోను కాకినాడలో తయారయ్యే బోట్లకు ఎక్కువ గిరాకీ ఉంటుంది. మత్స్యకారులు తమ బోట్ల కోసం రూ.20లక్షల దాకా వెచ్చించి బోట్లు తయారుచేయించుకుంటుంటారు.
కానీ తక్కువ పెట్టుబడితోనే ఎక్కువ లాభాలు ఆర్జించాలన్న కొంతమంది యజమానులు కక్కుర్తిపడుతున్నారు. కేవలం రూ.5లక్షలకే నాసిరకం ఫైబర్ బోట్లను తయారుచేయించి పర్యాటక రంగానికి వినియోగిస్తున్నారు. ఈ ఫైబర్ బోట్లే కొంపముంచుతున్నాయి.
నాసిరకం బోట్లు కొంపముంచుతున్నాయి:
కాకినాడలో నెలకు దాదాపు 15బోట్ల వరకు తయారుచేస్తుంటారు. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల వారు ఇక్కడే బోట్లను తయారుచేయించుకుంటుంటారు. కానీ నాసిరకం బోట్ల గురించి తెర పైకి రావడంతో ఇప్పుడు వాళ్ల వ్యాపారానికి గండిపడే ప్రమాదం ఏర్పడింది. సాధారణంగా పర్యాటక రంగానికి వినియోగించే బోట్లను ఫైబర్ తోనే తయారుచేస్తుంటారు. అయితే ఎన్ని ఎక్కువ లేయర్స్ తో తయారుచేస్తే బోటు అంత పటిష్టంగా ఉటుంది. కానీ తక్కువ పెట్టుబడికే ఎక్కువ లాభాలు గడించాలన్న దురాశతో కేవలం రూ.5లక్షల లోపే కొంతమంది ఫైబర్ బోట్లను తయారుచేయిస్తున్నారు.
20మంది సామర్థ్యమే, నాసిరకం ఇంజిన్లు:
సాధారణంగా పర్యాటక బోట్లను 20 మందికి సరిపడే సామర్థ్యంతో తయారు చేయిస్తారు. కానీ బోటు యజమానులు మాత్రం దీన్ని లెక్కలోకి తీసుకోవడం లేదు.పరిమితికి మించి పర్యాటకులను ఎక్కిస్తూ ప్రమాదాలను కొనితెస్తున్నారు.
బరువు ఎక్కువవడంతో బోటు అదుపు తప్పి ఒక పక్కకు ఒరిగిపోయి తిరగబడిపోయే దుర్ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ బోట్లకు అమర్చిన ఇంజిన్ల విషయంలోను పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. ఖర్చు తగ్గించుకోవాలన్న ఉద్దేశంతో బోట్లకు పాత ఇంజిన్లను అమర్చుతున్నట్టు తెలుస్తోంది.
మత్స్యకారులు తమ బోట్లకు ఉపయోగించే ఇంజిన్లకు ఈ ఇంజిన్లకు చాలా తేడా ఉంటున్నట్టు తెలుస్తోంది. వాళ్లు ఉపయోగించే ఇంజిన్లు నాణ్యమైనవి కాగా ఇవి మాత్రం నాసిరకం అని చెబుతున్నారు.
ఆ సర్టిఫికెట్ ఉంటేనే 'బోటు డ్రైవర్'
బోటు డ్రైవర్గా కొనసాగాలంటే దానికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి.మత్స్యశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న స్టేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీ (ఎస్ఐఎఫ్టీ)లో కచ్చితంగా శిక్షణ తీసుకోవాలి. ఏడాది శిక్షణ తర్వాత పరీక్షలో పాసైతేనే డ్రైవింగ్ సర్టిఫికెట్ ఇస్తారు.
ఆ సర్టిఫికేట్ ఉన్నవాళ్లు మాత్రమే బోటు నడపాలి. బోటు ప్రమాదాల గురించి కూడా వీరికి అవగాహన ఉంటుంది కాబట్టి వీళ్లను మాత్రమే బోటు నడపడానికి అనుమతిస్తారు. కానీ కృష్ణా నదిలో బోల్తా పడిన బోటు విషయంలో పరిస్థితులు వేరుగా ఉన్నాయి. బోటుకు డ్రైవర్లుగా వ్యవహరించిన జి. సూరిబాబు, భైరవస్వామి శిక్షణ తీసుకున్నారా? అన్న దానిపై స్పష్టత లేదు. ఒకవేళ తీసుకున్నా.. బోటును నడిపించడంలో విఫలమయ్యారా అన్నది కూడా తేలాలి.