రజనీ పొలిటికల్ ఎంట్రీకి డిమాండ్: 'ఆ సత్తా ఆయనొక్కడికే ఉంది!'..
రాష్ట్రంలో పేరుకుపోయిన అవినీతిని, అల్లర్లను అదుపు చేయగలిగే సత్తా ఒక్క రజనీకి మాత్రమే ఉందని, అందుకే ఆయన రాజకీయాల్లోకి రావాలని రాయల్ రాజు డిమాండ్ చేశారు.
చెన్నై: మన దేశంలో సినిమాలకు రాజకీయాలకు విడదీయరాని సంబంధం ఉంది. సినిమాల్లో ఓ వెలుగు వెలిగిన ఎన్టీఆర్, ఎంజీఆర్, జయలలిత వంటి నటులు ఆ తర్వాత రాజకీయాలను కూడా శాసించారు. అదే బాటలో కొంతమంది నడిచి విఫలమయ్యారు కూడా.
ఇకపోతే సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ కు తమిళనాట ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే ఆయన్ను రాజకీయాల్లోకి తీసుకొచ్చే ప్రయత్నాలు గతంలో చాలానే జరిగాయి. అయితే రజనీ మాత్రం సినిమాలకే పరిమితమై రాజకీయాల వైపు అసలు కన్నెత్తి కూడా చూడలేదు.
అభిమానుల డిమాండ్:
అయితే ఆయన అభిమానులు మాత్రం ఆయన్ను రాజకీయాల్లోకి తీసుకురావాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. తమిళ రాజకీయాల్లో చిన్నమ్మ శశికళ శకం మొదలైన తరుణంలో రజనీ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలన్న డిమాండ్స్ పెరుగుతుండటం ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
గోడ పత్రికలతో ప్రచారం:
తాజాగా రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలని కోరుతూ ఆయన అభిమానులు తమిళనాడులోని పలు ప్రాంతాల్లో గోడపత్రికలు అంటించడం హాట్ టాపిక్ గా మారింది. చెన్నై, తిరుచ్చి, మదురై తదితర పలు ప్రాంతాల్లో గోడ పత్రికలను అంటించిన అభిమానులు.. రజనీ రాజకీయాల్లోకి రావాలన్న తమ ఆకాంక్షను వీటి ద్వారా వెలిబుచ్చారు.
అంతటి మద్దతు.. ఆయనొక్కడికే:
దీనిపై స్పందిస్తూ రజనీ అభిమానుల సంఘం తిరుచ్చి జిల్లా నిర్వాహకుడు రాయల్ రాజు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దివంగత సీఎం జయలలిత స్థానాన్ని భర్తీ చేసేందుకు.. ప్రజామద్దతు ఉన్న నాయకులెవరూ లేరని ఆయన అన్నారు. ఒక్క రజనీకి మాత్రమే అంతటి మద్దతు ఉందని, ఆయన మాత్రమే జయలలిత స్థానాన్ని భర్తీ చేయగలరని అన్నారు.
నిజాయితీ పాలన కోసం.. రజనీ రావాల్సిందే:
రాష్ట్రంలో నిజాయితీ పాలనా కొనసాగాలంటే అది ఒక్క రజనీ వల్లే సాధ్యమని రాయల్ రాజు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం తమిళ రాజకీయాల్లో ఓ శూన్య స్థితి నెలకొనడంతో.. ఈ పరిస్థితిని వినియోగించుకుని రజనీ రాజకీయాల్లోకి అడుగుపెడితే బాగుంటుందన్నారు. త్వరలోనే రజనీని కలిసి ఈ విషయం ఆయనకు విన్నవించనున్నట్టు రాయల్ రాజు తెలిపారు.
ఆ సత్తా ఉన్నది రజనీకే..
రాష్ట్రంలో పేరుకుపోయిన అవినీతిని, అల్లర్లను అదుపు చేయగలిగే సత్తా ఒక్క రజనీకి మాత్రమే ఉందని, అందుకే ఆయన రాజకీయాల్లోకి రావాలని తామంతా కోరుకుంటున్నామని రాయల్ రాజు స్పష్టం చేశారు.