ఇదీ జరిగింది: చంద్రబాబుకు రాయపాటి పోలవరం దెబ్బ
న్యూఢిల్లీ): పోలవరం ప్రాజెక్టు విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి సొంత తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివ రావు షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టు పనులు రాయపాటి సాంబశివ రావుకు చెందిన ట్రాన్స్స్టాయ్ దక్కించుకుని, పనులు చేస్తున్న విషయం తెలిసిందే. కాంట్రాక్టు పనులను ఆ సంస్థ నుంచి తప్పించేందుకు చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే కొన్ని పనులకు టెండర్లను ఆహ్వానించింది.
అది రాయపాటిదే...
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం రాయపాటి సాంబశివ రావుకు చెందిన ట్రాన్స్స్ట్రాయ్కు పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టు అప్పగించారు. ఈ విషయాన్ని రాయపాటి స్వయంగా ఓ సందర్భంలో చెప్పారు. అయితే, దాని నిర్మాణ వ్యయం గణనీయంగా పెరిగిందని, దానికి అనుగుణంగా తమకు నిధులు విడుదల చేయాలని ట్రాన్స్స్ట్రాయ్ అంటోంది. అయితే, చంద్రబాబు ప్రభుత్వం కాంట్రాక్టర్ను మార్చే ఆలోచనలో ఉంది. దానికి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గడ్కరీ అంగీకరించడం లేదు.
ఆయన అంగీకరించకపోవడంతో...
కాంట్రాక్టరును మార్చడానికి గడ్కరీ అంగీకరించకపోవడంతో చంద్రబాబు ప్రభుత్వం కొన్ని పనులను ప్రధాన కాంట్రాక్టర్ నుంచి తప్పించి వేరే సంస్థలకు అప్పగించడానికి సిద్దమైంది. ఇందుకు ప్రభుత్వానికి తగిన అధికారం ఉందని అంటారు. ఈ మేరకు స్పిలే వే, తదితర పనులకు టెండర్లను ఆహ్వానించడానికి సిద్ధపడింది. వాటిని ఆపేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో వివాదం ప్రారంభమైంది. అయితే, దీని వెనక పెద్ద కథే నడిచినట్లు చెబుతున్నారు.
ఇలా చేయడమేమిటి.
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి స్పిల్ వే, స్పిల్ చానల్ తదితర పనులకు సంబంధించి తనకు తెలియకుండా టెండర్లు పిలవడం సరికాదంటూ ప్రధాన కాంట్రాక్టు సంస్థ ట్రాన్స్ట్రాయ్ నవంబరు 21న కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి అమర్జిత్ సింగ్ కు ఓ లేఖ రాసింది. ఈ- మెయిల్ ద్వారా దీన్ని పంపింది. అదే చంద్రబాబుకు వ్యతిరేకంగా కేంద్రం నిర్ణయం తీసుకోవడానికి కారణమని అంటున్నారు.
మమ్మల్ని తప్పించడమేనని...
తమకు తెలియకుండా టెండర్లు పిలవడమంటే ఒప్పందంలోని 60(సి) క్లాజు కింద తమను తప్పించడమేనని ట్రాన్స్ట్రాయ్ కేంద్రానికి రాసిన లేఖలో అభిప్రాయపడింది. తమకు సెప్టెంబరు 15న నోటీసు ఇచ్చిన తర్వాత పోలవరం నిర్మాణంలో జాప్యానికి కారణాలను వివరించామని, అసలు తమకు నోటీసు ఇచ్చేందుకు సూపరిండెంట్ ఇంజనీరుకు చట్టపరమైన హక్కే లేదని కూడా ట్రాన్స్స్ట్రాయ్ అభిప్రాయపడింది.. ఒప్పందం కుదిరిన 40 నెలల తర్వాత 2016లో తమకు భూమి అప్పగించారని, అనుబంధ ఒప్పందాన్ని పూర్తి చేయడంలో కూడా ఆలస్యం జరిగిందని ట్రాన్స్స్ట్రాయ్ వివరించింది.
ఆ లేఖ అందడమే తరువాయి....
ట్రాన్స్స్ట్రాయ్ నుంచి ఈ మెయిల్ అందిన తక్షణమే, రాష్ట్ర ప్రభుత్వం నుంచి సమాచారం కోరకుండా కేంద్రం టెండర్లు నిలిపివేయాలని కేంద్రం రాష్ట్రానికి ఆదేశాలు ఇచ్చేసింది. పోలవరం పనుల్లో జాప్యాన్ని నివారించి, పనుల్లో వేగం పెంచేందుకు కాంట్రాక్టర్ను తప్పించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతున్న తరుణంలో సదరు కాంట్రాక్టర్ పంపిన ఓ మెయిల్ కే కేంద్రం స్పందించి ఆదేశాలు జారీ చేసింది. దీనిపైనే చంద్రబాబు తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.