దినకరన్ గెలుపు వెనుక: అన్నాడీఎంకేకు 'మోడీ' దెబ్బ: శశికళ వీడియో 'గేమ్', జైలు నుంచే చక్రం
చెన్నై: ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో టీటీవీ దినకరన్ ఘన విజయం సాధించారు. అధికార, ప్రతిపక్షాలు ఆయనకు కనీసం పోటీ ఇవ్వలేకపోయాయి. ఆయన గెలుపుకు వెనుక ఎన్నో కారణాలు ఉన్నాయని అంటున్నారు. ఎన్నికలకు ముందు వీడియో గేమ్ మొదలు శశికళ చక్రం వరకు ఆయన విజయానికి తోడ్పడ్డాయని చెబుతున్నారు.
జయలలిత మరణమే ఈ ఎన్నికల్లో ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆమె మరణం తర్వాత మూడు వర్గాలు ఆరు గ్రూపులుగా విడిపోయిన ఏఐడీఎంకే నేతలకు ఆర్కే నగర్ ఉప ఎన్నిక పెద్ద సవాల్గా మారింది. తొలుత రెండు గ్రూపులుగా ఉన్న పళని, పన్నీర్ వర్గాలు ఏకమై అన్నా డీఎంకే తరఫున మధుసూదన్ను బరిలో దింపాయి.
విధిలేక స్వతంత్ర అభ్యర్థిగా దినకరన్
జయకు తామే అసలైన వారసులమని, అన్నాడీఎంకే ఎన్నికల గుర్తు తమకే కేటాయించాలని దినకరన్ వర్గం ఎన్నికల సంఘాన్ని, కోర్టును ఆశ్రయించినా ఫలితం లేకపోయింది. దీంతో దినకరన్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే ఎన్నికల్లో జయ మృతికి శశికళ కుటుంబ సభ్యులే కారణమని పన్నీర్, పళని వర్గీయులు విస్తృత ప్రచారం చేశారు. అమ్మ మృతి చెందినప్పటి నుంచి శశికళ వర్గంపై ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో పోలింగ్కు 24 గంటల ముందు అపోలో ఆసుపత్రిలో జయలలిత చికిత్స పొందినప్పటి దృశ్యాలు అంటూ ఎమ్మెల్యే వెట్రివేల్ ఓ వీడియోను విడుదల చేశారు.
ఆ వీడియోతో లాభపడ్డ దినకరన్
ఆ వీడియోలో జయ ఆసుపత్రిలో జ్యూస్ తాగుతూ, టీవీ చూస్తున్నట్లు కనిపించారు. అమ్మ చనిపోయిన తర్వాతే ఆసుపత్రికి తీసుకెళ్లారంటూ అప్పటి వరకు ప్రచారం చేసిన మధుసూదన్ వర్గీయుల ఆరోపణలను దినకరన్ వర్గం తిప్పికొట్టింది. తమిళనాడులో ఈ వీడియో సంచలనంగా మారడంతో ఈసీ స్పందించింది. జయలలిత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వీడియో ప్రసారం చేయెద్దని అన్ని పత్రికలు, టీవీ ఛానళ్లకు ఆదేశాలు జారీ చేసింది. మొత్తం మీద పోలింగ్కు 24 గంటల ముందు విడుదల చేసిన ఈ వీడియో దినకరన్ విజయానికి దోహదపడిందని అంటున్నారు.
అన్నాడీఎంకేలు కలిసినా, మధుసూదనన్కు వర్గపోరు
తొలినాళ్లలో అన్నాడీఎంకే రెండు వర్గాలుగా చీలిపోయింది. శశికళ కుటుంబాన్ని పార్టీ నుంచి బహిష్కరించడంతో సీఎం పళనితో పన్నీర్ వర్గం చేతులు కలిపింది. అనంతరం పార్టీకి రెండాకుల గుర్తు లభించింది. పార్టీ అభ్యర్థిగా సీనియర్ నేత మధుసూదనన్ను ప్రకటించినా పార్టీ వర్గాల నుంచి సహకారం లభించలేదు.
జయ కోసం రాజీనామా చేసిన వేట్రివేల్ ప్రచారం
2015లో ఆర్కే నగర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న అన్నాడీఎంకే సభ్యుడు వెట్రివేల్ తన పదవికి రాజీనామా చేశారు. అనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో పార్టీ అధినేత్రి జయలలిత విజయం సాధించారు. అనంతరం 2016లోనూ జయ గెలుపొందారు. తాజా ఎన్నికల్లో ఆయన దినకరన్తో పాటు ప్రచారంలో ముమ్మరంగా పాల్గొన్నారు.
నెరవేరని డీఎంకే ఆశలు
ఎన్నికలో విజయం సాధించి తమ ప్రభావాన్ని చూపాలన్న ప్రతిపక్ష డీఎంకే ఆశలు నెరవేరలేదు. పార్టీ అభ్యర్థి గణేశ్ డిపాజిట్ కోల్పోయారు. సాధారణంగా తమిళనాడులోని పట్టణప్రాంతాల్లో డీఎంకేకే బలముంది.
కీలకనేతగా దినకరన్
ఉప ఎన్నికలో విజయం సాధించడంతో టీటీవీ దినకరన్ రాష్ట్రంలో మరో కీలకనేతగా ఎదిగినట్లుగా భావిస్తున్నారు. కానీ ఈ గెలుపు ప్రభావం తాత్కాలికమేనని అధికార, విపక్షాలు భావిస్తున్నాయి. భవిష్యతులో తమిళనాట రాజకీయాలు ఎలా మారనున్నాయనే చర్చ సాగుతోంది.
ఆ తర్వాతే పరిస్థితి మారిపోయింది
ఎన్నికలకు నాలుగైదు రోజుల ముందు వరకూ దినకరన్ విజయానికి ఫిఫ్టీ ఫిఫ్టీ అవకాశమంటూ స్థానిక సర్వేలు తెలిపాయి. అయితే అనూహ్యంగా జయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పటి వీడియో ఒకటి బయటకు రావడంతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. అమ్మ మృతి విషయంలో శశికళ వర్గంపై ఉన్న అనుమానాలకు కొంతమేరకు ఆ వీడియో నివృత్తి చేసింది.
కేంద్రం చేతిలో బొమ్మ
కొద్దికాలంగా పన్నీరు, పళనిలు ఢిల్లీ పాలకుల చేతిలో పావులుగా మారారని, తమిళ ప్రజల ఇమేజ్ను ఆ ద్వయం దెబ్బతీసిందని, దినకరన్ మాత్రమే పోయిన గౌరవాన్ని తిరిగి కాపాడగలరని అని వేలాయుధన్ అనే ఓ ఆటో డ్రైవర్ అభిప్రాయపడ్డారు. ఇదే తమిళనాట సగటు ఓటరు అభిప్రాయమై అది పెద్దసంఖ్యలో దినకరన్కు ఓట్లు కురిపించిందని అంటున్నారు.
వీడియో వెనుక శశికళ వ్యూహం
మరోవైపు, దినకరన్కు ఇంతగా మేలు చేసిన వీడియో విడుదల వెనుక శశికళ వ్యూహమే ఉంటుందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ వీడియోను దినకరన్ అనుచరుల్లో ఒకరైన వెట్రివేల్ విడుదల చేశారు. ఈ వీడియో వెనుక చిన్నమ్మ ఉన్నారని చెబుతుండటం గమనార్హం.