ఉద్యోగుల స్థానంలో రోబోలు.. 2.5 లక్షల ఉద్యోగాలకు ఎసరు
2030 నాటికి 2.5 లక్షల ప్రభుత్వ రంగ ఉద్యోగాలను రోబోలు, కృత్రిమ మేధస్సు ఆక్రమిస్తాయని ఓ తాజా నివేదిక పేర్కొంది. చివరికి వైద్యులు, నర్సుల స్థానాలనూ భర్తీ చేస్తాయని తెలిపింది.
లండన్: ఒంట్లో బాగోక మీరు ఏదైనా ఆసుప్రతికి వెళ్లినప్పడు.. అక్కడ డాక్టర్ క్యాబిన్ లో ఉన్న రోబో 'ఎస్.. ప్లీజ్ టేక్ యువర్ సీట్...' అందనుకోండి, మీరేం షాక్ అవకండి. ఒకవేళ సదరు రోబో డాక్టర్ 'నర్స్ ..' అని పిలవగానే మరో రోబో టింగు టింగుమంటూ వచ్చి బిపి చూసే పరికరాన్ని మీ చేతికి కనెక్ట్ చేసిందనుకోండి, అప్పుడూ మీరు నోరెళ్లబెట్టనక్కర్లేదు.
మీకో, మీ అబ్బాయికో ఏదైనా ధ్రువీకరణ పత్రం కావాల్సి వచ్చి మీరు గవర్నమెంట్ ఆఫీసుకు వెళ్లారనుకోండి. అక్కడ కూడా మీకు ఉద్యోగులు కనిపించరు. అన్ని స్థాయిల్లోనూ రోబో ఉద్యోగులే దర్శనమిస్తారు. మీరు చెప్పడమే ఆలస్యం మీ పనులన్నిటినీ క్షణాల్లో చేసి పెడతారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది నిజం. రాబోయే రోజులు మనుషులవి కావు.. కృత్రిమ మేధస్సు కలిగిన మెటాలిక్ బాడీలవే.
ఎందుకంటే.. బ్రిటన్ లో 2030 నాటికి 2.5 లక్షల ప్రభుత్వ రంగ ఉద్యోగాలను రోబోలు, కృత్రిమ మేధస్సు ఆక్రమిస్తాయని ఓ తాజా నివేదిక పేర్కొంది. చివరికి వైద్యులు, నర్సుల స్థానాలనూ ఇవి భర్తీ చేస్తాయని తెలిపింది.
రిఫార్మ్ అనే మేధో మథన సంస్థ ఈ నివేదికను రూపొందించింది. ఈ నివేదిక ప్రకారం... 2030 నాటికి ప్రభుత్వ ఉద్యోగాలలో 90 శాతాన్ని వెబ్ సైట్లు, కృత్రిమ మేధస్సు, చాట్ బోట్ లు తన్నుకుపోతాయట.
అలాగే జాతీయ ఆరోగ్య సేవ (ఎన్ హెచ్ఎస్) లోని వేల ఉద్యోగాలు కూడా రోబోల పరమవుతాయట. ఫలితంగా ప్రతి ఏటా అక్కడి ప్రభుత్వానికి 400 కోట్ల పౌండ్ల ప్రజాధనం కూడా ఆదా అవుతుందట. ప్రభుత్వ ఆసుప్రతుల్లో నర్సులు, వైద్యులు కూడా ఈ యంత్రాల బారిన పడతారని ఈ నివేదిక తేల్చేసింది.
కొన్ని వ్యాధి నిర్ధారణల, సాధారణ శస్త్రచికిత్స ప్రక్రియల్లో రోబోలు మనుషులను మించిపోతాయని, సమాచార సేకరణ కూడా మెరుగ్గా ఉంటుందని. ప్రజాసేవలు మరింత వెసులుబాటుగా తయారుకావాల్సిన అవసరం ఉందని ఈ నివేదిక అభిప్రాయపడింది.