నౌ డేట్: పద్మావతి విడుదల సందేహమే: గుజరాత్ ఎన్నికలే అడ్డంకి?
Recommended Video
ముంబై: ఒక వైపు మరో 11 రోజుల్లో పద్మావతి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి విశ్వప్రయత్నాలు జరుగుతున్నాయి. మరోవైపు ఈ సినిమా విడుదలకు అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి. పద్మావతి సినిమా విడుదలను నిరసిస్తూ రాజస్థాన్ నుంచి కర్ణాటక, తమిళనాడు వరకు విస్తరించిన ఆందోళనను ఆదివారం దేశ రాజధాని ఢిల్లీ నగరాన్ని తాకనున్నాయి. రాజపుత్రులకు నిలయమైన రాజస్థాన్ మహారాణి 'పద్మావతి' జీవిత చరిత్రను వక్రీకరించారని ఆరోపిస్తూ శ్రీ రాజ్ పుత్ర కర్ణిసేన, అఖిల భారతీయ క్షత్రియ మహాసభ తదితర సంఘాల ఆధ్వర్యంలో ఢిల్లీలో నిరసన ప్రదర్శన చేపట్టనున్నారు. ఇదిలా ఉండగా 'పద్మావతి' సినీ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ స్పందిస్తూ తమ సినిమా చారిత్రక వాస్తవాలను వక్రీకరించడం లేదని వీడియో విడుదల చేశారు. మరోవైపు సినిమా విడుదలను నిలువరించేందుకు తెర వెనుక ప్రయత్నాలు సాగుతున్నాయా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. సర్టిఫికెట్ జారీ చేయకుండానే రివ్యూల కోసం ఎలా ప్రదర్శిస్తున్నారని ప్రశ్నించిన సీబీఎఫ్సీ చైర్మన్ ప్రసూన్ జోషి.. దరఖాస్తు అసంపూర్తిగా ఉన్నందున వెనక్కు పంపామని.. పూరించి పంపితే పరిశీలిస్తామని, తాజా పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని చర్యలు తీసుకోవాలని సూచించడం అందుకు సంకేతమే.
డిసెంబర్ ఒకటో తేదీన సినిమా విడుదల చేస్తే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీని ఓడిస్తామని రాజపుత్రులు, క్షత్రియులు ఇప్పటికే హెచ్చరించారు. హార్దిక్ పటేల్, అల్పేశ్ ఠాకూర్, జిగ్నేశ్ మేవానీల త్రయం దాడితోనే సతమతం అవుతున్న కమలనాథులు.. తాజాగా 'పద్మావతి' సినిమా విడుదల కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తున్నది. ఈ నేపథ్యంలోనే గుజరాత్ పక్కనే ఉన్న రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ సీఎంలు వసుంధర రాజె సింధియా, యోగి ఆదిత్యనాథ్.. శాంతిభద్రతల పరిరక్షణ ద్రుష్ట్యా సినిమా విడుదలను నిలిపేయాలని కేంద్రానికి లేఖలు రాయడం ఈ కోణంలోకే వస్తుందని ప్రజాస్వామ్య వాదులు, రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
సినీ నిర్మాణ సంస్థకు సీబీఎఫ్సీ చైర్మన్ ప్రశ్నలు ఇలా
సినిమాలో ఉన్న ఆసక్తికర మలుపుల కన్నా.. ప్రస్తుతం విడుదలపై నెలకొన్న ఉత్కంఠ, రోజుకో మలుపు ప్రజల్లో అమితాసక్తిని రేకెత్తిస్తున్నాయి. శనివారం సెంట్రల్ బోర్ట్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్(సీబీఎఫ్సీ) చైర్మన్ ప్రసూన్ జోషి మాట్లాడుతూ పద్మావతి సినిమాకు ఫిల్మ్ సర్టిఫికెట్ ఇవ్వకముందే ఈ సినిమాను పలువురికి ఎందుకు చూపిస్తున్నారని సదరు సినిమా నిర్మాతను ప్రశ్నించారు. ఈ సినిమా నిర్మాణ సంస్థ వయ్కామ్ 18 మోషన్ పిక్చర్స్ ఇలా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం తప్పని తెలిపారు. కొంత మంది మీడియా ప్రతినిధులకు ఈ సినిమాను చూపించడం, దీనిపై సమీక్షలు రావడం నిజంగా బాధాకరమని చెప్పారు. సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ కోసం చేసిన దరఖాస్తు అసంపూర్తిగా ఉన్నదని, ఈ సినిమా కల్పితమా? లేక చరిత్ర ఆధారంగా తీశారా? తదితర వివరాలను నిర్మాణ సంస్థ సమర్పించలేదని, ఈ నేపథ్యంలోనే దరఖాస్తును తిరిగి వెనక్కి పంపామని తెలిపారు.
గుజరాత్ ఎన్నికల కోసమే నాటకమన్న కాంగ్రెస్
ఓ వైపు సినిమా విడుదలకు అనుమతినివ్వాలని మాపై ఒత్తిడి తెస్తున్నారు. మరోవైపు అనుమతి పొందడానికి పాటించాల్సిన నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. వారి చర్యలు అవకాశవాదానికి అద్దం పడుతున్నాయి అని సెంట్రల్ బోర్ట్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్(సీబీఎఫ్సీ) చైర్మన్ ప్రసూన్ జోషి ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్టిఫికెట్ ఇవ్వకుండానే దరఖాస్తును సీబీఎఫ్సీ వెనక్కి పంపడం ఓ రాజకీయ స్టంట్ అని, గుజరాత్ ఎన్నికల నేపథ్యంలోనే ఈ నాటకం ఆడుతున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. నిజంగా చరిత్రను వక్రీకరించి ఉంటే సినిమా విడుదల చేయొద్దని కాంగ్రెస్ పార్టీ కోరింది. హెచ్చరికలు ఎదుర్కొంటున్న ఈ చిత్రంలోని ప్రధాన పాత్రదారు దీపికా పదుకొనేకు హాలీవుడ్ నటి రూబీ రోజ్ బాసటగా నిలిచారు. తనకు తెలిసిన ధైర్యవంత మహిళల్లో దీపికా ఒకరని ట్వీట్ చేశారు. దీపికా పదుకునేకు బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ తదితరులు మద్దతు పలికారు. కాంగ్రెస్ పార్టీ కూడా నిజంగా చరిత్ర వక్రీకరణ జరిగి ఉంటే చిత్ర విడుదలను నిలిపివేయవచ్చునని వ్యాఖ్యానించింది.
రాజస్థాన్లో కుంభల్గఢ్ కోట ద్వారం మూసివేత
త్వరలో గోవాలో జరుగనున్న అంతర్జాతీయ భారత చలన చిత్రోత్సవాన్ని(ఇఫీ) బాలీవుడ్ బహిష్కరించాలని ప్రముఖ నటి షబానా అజ్మీ శనివారం పిలుపునిచ్చారు. ప్రస్తుతం దేశంలో సాంస్కృతిక విధ్వంసం కొనసాగుతున్నదన్నారు. పద్మావతి సినిమా వివాదంపై కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి స్మృతిఇరానీ ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. ఈ సినిమాను అడ్డుకోవడంలో భాగంగానే నటి దీపికా పదుకొనె, నిర్మాత సంజయ్లీలా బన్సాలీకి బెదిరింపులు వస్తున్నాయని, ఈ కుట్రలను తిప్పికొట్టడానికి సినీ పరిశ్రమ ఏకం కావాలని ఆమె పిలుపు ఇచ్చారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ది పొందడానికే సెన్సార్ బోర్డుకు రాసిన దరఖాస్తు అసంపూర్తిగా ఉన్నదన్న సాకు చూపుతున్నారని ఆమె మండిపడ్డారు. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్, సినీ నిర్మాత ఒనీర్ తదితరులు ‘పద్మావతి' సినిమాకు అండగా నిలిచారు. అంతకుముదు బాలీవుడ్ నటి దియా మీర్జా స్పందిస్తూ దీపికా పదుకునే, సంజయ్ లీలా భన్సాలీలపై బెదిరింపులకు దిగిన ఆందోళనకారులను జైలులో పెట్టాలని డిమాండ్ చేశారు. సినిమాలకు మలిన రాజకీయాలు పులమడం సరికాదని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా పద్మావతి సినిమాను నిరసిస్తూ ఆందోళనకారులు శనివారం రాజస్థాన్లోని కుంభల్గఢ్ కోట ద్వారాన్ని మూసివేశారు. రాజ్పుత్ సామాజిక వర్గానికి చెందిన ఆందోళనకారులు రాజ్సమంద్ జిల్లాలోని కుంభల్గఢ్ కోట వద్దకు చేరుకొని కోట ద్వారాన్ని మూసివేశారు. పద్మావతి సినిమాను నిషేధించాలని డిమాండ్ చేశారు.
అంతకు ముందు యోగి ఆదిత్యనాథ్ ఇలా
మరోవైపు, పద్మావతి సినిమా విడుదల కాకుండా నిలిపివేసేందుకు రాజకీయంగా చర్యలు మొదలయ్యాయా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పద్మావతి సినిమాపై వివాదానికి కేంద్రం రాజస్థాన్. ఆ రాష్ట్ర సీఎం వసుంధర రాజె సింధియా మౌనం వీడారు. చరిత్రకారులు, సినిమా ప్రముఖులు, రాజపుత్రులతో కూడిన ప్యానెల్ ముందు సినిమాను ప్రదర్శించి.. ఆమోదం పొందాలని ప్రతిపాదిస్తూ.. కేంద్ర ప్రసార శాఖ మంత్రి స్మృతి ఇరానీకి రాజస్థాన్ సీఎం వసుంధర రాజే లేఖ రాశారు. మార్పులు చేసిన తరువాతనే విడుదల చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్ర మంత్రి ఇరానీని కోరారు. కథ రూపకల్పనపై సినీ నిర్మాతలకు హక్కుల ఉన్నాయంటూనే ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. వసుంధర రాజె సింధియాతోపాటు కేంద్ర మంత్రి స్మ్రుతి ఇరానీకి లేఖ రాసిన ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందిస్తూ సినిమా విడుదల వల్ల శాంతిభద్రతల పరిస్థితి దిగజారుతుందని ఆందోళన వ్యక్తం చేయడం గమనార్హం. కేంద్ర మంత్రి ఉమా భారతి స్పందిస్తూ ఈ సినిమాలో వివాదం నుంచి నటులు బయటపడాలని కోరారు. సినీ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ, ఆయన సహచరులు, కథా రచయిత దీనికి బాధ్యత వహించాలని, చారిత్రక వాస్తవాల ఆధారంగా సినిమా కథ ఉండాలని ట్వీట్ చేశారు.
పాట్నాలో దీపికా, భన్సాలీ దిష్టి బొమ్మల దగ్ధం
రాష్ట్రీయ జనతాదళ్ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ అకస్మాత్తుగా యూ టర్న్ తీసుకున్నారు. చరిత్ర వక్రీకరణను సహించే ప్రసక్తే లేదని తేల్చేశారు. ‘ఏ ఒక్కరూ చరిత్రను వక్రీకరించొద్దు. సినిమాకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వారికి పద్మావతి విడుదలను అడ్డుకునే హక్కు ఉంది. పద్మావతి రాణి జీవిత చరిత్ర రాజస్థాన్ లోనే ముఖ్యమైంది. ప్రజల మనోభావాలను కించపర్చొద్దు' అని అన్నారు. తాజాగా రాజపుత్రుల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో పాట్నాలోని గాంధీ మైదాన్ లో భన్సాలీ, దీపికా పదుకునే దిష్టి బొమ్మలను దగ్ధం చేశారు. కాగా, గత జనవరిలో సినిమా చిత్రీకరణను వీక్షించేందుకు లాలూ, ఆయన తనయుడు తేజస్వి యాదవ్ నూ సినీ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ పాట్నాలో ఆహ్వానించారు.