రూపానీకి షాక్: గుజరాత్ సిఎంగా స్మృతి ఇరానీ?
Recommended Video
అహ్మదాబాద్: గుజరాత్లో బిజెపి కనాకష్టంగా విజయం సాధించిందనే చెప్పాలి. ఆ విజయం కూడా ప్రధాని నరేంద్ర మోడీ వల్ల సాధ్యమైందే గానీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ వల్ల కాదనే అభిప్రాయాన్ని రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.
ఆ స్థితిలో విజయ్ రూపానికి మరోసారి ముఖ్యమంత్రి పదవి అప్పగించే విషయంపై బిజెపి అగ్రనాయకత్వం పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పలువురి పేర్లు చర్చలోకి వస్తున్నాయి. అందులో స్మృతి ఇరానీ పేరు కూడా ఉంది.
ప్రజాకర్షక నేత లేకపోవడంతో..
నరేంద్ర మోడీ ప్రధాని పదవిని చేపట్టిన తర్వాత గుజరాత్లో అంతటి ప్రజాకర్షక నేత లేకపోవడం బిజెపికి కొరతగా ఉంది. విజయ్ రూపానీ అంచనాలను అందుకోలేకపోయారనే అభిప్రాయం కూడా ఉది. ఈ స్థితిలో ప్రజాకర్షక నేతను ముఖ్యమంత్రిగా చేయాలనే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.
ముందంజలో స్మృతి ఇరానీ
కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కాబోయే గుజరాత్ ముఖ్యమంత్రి రేసులో ముందంజలో ఉన్నట్టు తెలుస్తోంది. ఆమెలో నాయకత్వ లక్షణాలు దండిగానూ, గుజరాతీలో ధారాళంగా మాట్లాడగలిగే నేర్పు ఆమెకు ఉన్నాయి. ఆమెను ముఖ్యమంత్రిగా చేస్తే రాష్ట్రంలో తమ పార్టీ భవిష్యత్తు బాగుంటుందనే అభిప్రాయం బిజెపి వర్గాల్లో వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే తాను రేసులో లేనని స్మృతి ఇరానీ అంటున్నారు.
రేసులో వీరు కూడా..
కాబోయే సిఎం రేసులో రెండోస్థానంలో మన్సుఖ్ ఎల్ మాండవ్య ఉన్నారు. ఆయన సౌరాష్ట్ర ప్రాంతానికి చెందిన పాటీదార్. రైతు పక్షపాతిగా ఆయనకు పేరుంది. సీఎం రేసులో మూడోస్థానంలో ఉన్న నేత వాజుభాయ్ వాలా. గతంలో గుజరాత్ మంత్రివర్గంలో పలు శాఖలు నిర్వహించిన అనుభవం ఆయనకు ఉంది.
విజయ్ రూపానీ వైపే అమిత్ షా
అమిత్ షా మాత్రం విజయ్ రూపానీ వైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. విజయ్ రూపానీని కాదని వేరొకరిని తెచ్చి పెడితే అనుకోని సమస్యలు ఎదురు కావచ్చునని ఆయన భావిస్తున్నారని అంటున్నారు. రాజ్కోట్ వెస్ట్ నుంచి ఆయన శాసనసభకు ఎన్నికయ్యారు.
హిమాచల్లో ధమాల్ ఓడిపోవడంతో..
హిమాచల్ ప్రదేశ్లో ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రేమ్కుమార్ ధుమాల్ ఓడిపోవడంతో ఆ పదవి కోసం పలువురు పోటీ పడుతున్నట్లు సమాచారం. కేంద్ర మంత్రి జేపీ నడ్డా పేరు కూడా హిమాచల్ సీఎం అభ్యర్థిగా వినిపిస్తోంది. జైరాం ఠాకూర్, సురేశ్ భరద్వాజ్, రాజీవ్ బిందాల్, అజయ్ జంవాల్ ఇలా పలువురు ఎమ్మెల్యేల పేర్లు వినిపిస్తున్నాయి.