జగన్కు గట్టి షాక్?: టీడీపీతో టచ్ లోకి ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు, బాబు వ్యూహం మొదలైంది..
వైసీపీకి చెందిన ఓ కోస్తాంధ్ర ఎమ్మెల్యేతో పాటు మరో రాయలసీమ ఎమ్మెల్యే ఇప్పటికే ఇద్దరు మంత్రులతో టచ్ లోకి వచ్చారట.
Recommended Video
అమరావతి: అనుకున్నదే అయింది.. నంద్యాల ఉపఎన్నిక ఫలితం తర్వాత అధికార పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ ను స్పీడప్ చేస్తుందని ఊహించినట్లుగానే పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
వైసీపీ ఉనికిని ప్రశ్నార్థకం చేయడానికి ఇది టీడీపీ మొదలుపెట్టిన మైండ్ గేమో.. లేక నిజంగానే ఆ పార్టీ వైపు వైసీపీ ఎమ్మెల్యేలు చూస్తున్నారో తెలియదు కానీ ఫిరాయింపు వార్తలు మాత్రం మరోసారి జోరందుకున్నాయి.
నంద్యాల బైపోల్తో అది క్లియర్: ఎన్నిక తర్వాత పార్టీల వ్యూహాలివే?..
వైసీపీకి చెందిన ఓ కోస్తాంధ్ర ఎమ్మెల్యేతో పాటు మరో రాయలసీమ ఎమ్మెల్యే ఇప్పటికే ఇద్దరు మంత్రులతో మంతనాలు జరిపినట్లుగా ప్రచారం జరుగుతోంది. వారిద్దరు ఎప్పుడంటే అప్పుడు టీడీపీలో చేరడానికి రెడీగా ఉన్నారని, సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే ఆలస్యం అన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
రాజకీయ భవిష్యత్తుపై అనుమానం:
నంద్యాల ఉపఎన్నికలో వైసీపీ ప్రదర్శించిన ధీమా చూసి.. చాలామంది ఆ పార్టీకి అనుకూలంగా ఫలితం వస్తుందనుకున్నారు గానీ సీన్ పూర్తిగా రివర్స్ అయింది. అంచనా కంటే ఎక్కువ మెజారిటీని సంపాదించుకుని టీడీపీ మరోసారి తన సత్తా ఏంటో చాటింది.
స్వయంగా జగన్ రంగంలోకి దిగి అన్నేసి రోజులు ప్రచారం చేసినా.. జనం వైసీపీ వైపు నిలబడలేదంటే.. పార్టీలో వారి పట్ల విశ్వసనీయత లేదని కొంతమంది వైసీపీ నేతల్లో అంతర్మథనం మొదలైనట్లుగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీలోనే కొనసాగితే రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుందోనన్న భయం వారిని వెంటాడుతున్నట్లుగా తెలుస్తోంది.
వైసీపిని చిత్తు చేయడానికి:
నంద్యాల ఉపఎన్నిక ఫలితం తర్వాత సహజంగానే టీడీపీలో ఆత్మవిశ్వాసం మరింత బలపడింది. అదే సమయంలో వైసీపీ నేతల్లో ఒకింత ఆత్మన్యూనత భావం ఏర్పడింది. ప్రజలు మున్ముందు కూడా పార్టీ పట్ల ఇదే వైఖరి ప్రదర్శిస్తే రాజకీయంగా ఎదగడం కష్టమనే అభిప్రాయంలోకి వారు వస్తున్నారు.
సరిగ్గా ఇదే పాయింట్ పై ఫోకస్ చేసిన టీడీపీ.. వచ్చే ఎన్నికల నాటికి వైసీపిని చావుదెబ్బ తీయాలనే వ్యూహంతోనే ముందుకు కదులుతున్నట్లు తెలుస్తోంది. 2019ఎన్నికల నాటికి జగన్ ప్రభావం మరింత తగ్గించాలంటే.. వీలైనంత మేర ఆ పార్టీలోని ఎమ్మెల్యేలను లాగాలనే భావనలో టీడీపీ ఉన్నట్లు చెబుతున్నారు. ఎన్నికల సమయానికి ఆ పూర్తయితే తదుపరి ఫలితంపై ఎటువంటి ఆందోళన అక్కర్లేదనేది టీడీపీ ఆలోచనగా తెలుస్తోంది.
టచ్ లోకి వైసీపీ ఎమ్మెల్యేలు:
బుధవారం ఇద్దరు మంత్రులకు వైసీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు టచ్ లోకి వచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. మంత్రులిద్దరూ సచివాలయంలో ఉన్న సమయంలోనే వారి నుంచి ఫోన్ కాల్స్ రావడంతో.. త్వరలోనే శుభవార్త వింటారంటూ ఓ మంత్రి గారు వ్యాఖ్యలు చేశారట. అంతేకాదు, ఇప్పటికే విషయాన్ని అధిష్టానానికి కూడా చేరవేసినట్లు చెబుతున్నారు.
తొలుత రాయలసీమకు చెందిన ఓ వైసీపీ ఎమ్మెల్యేకు ఫోన్ కాల్ రాగా.. సుమారు 20నిమిషాల పాటు ఇద్దరి మధ్య సంభాషణ కొనసాగినట్లు తెలుస్తోంది. టీడీపీలోకి తన ఎంట్రీని క్లియర్ చేయాలని సదరు ఎమ్మెల్యే మంత్రితో విన్నవించుకున్నట్లుగా సమాచారం.
టీడీపీ తలుపులు తడుతున్నారు:
కోస్తా ప్రాంతానికి చెందిన ఓ ఎమ్మెల్యే మరో మంత్రితో టచ్ లోకి వచ్చారట. ఫోన్ ద్వారా ఆయనకు విషయాన్ని చేరవేసి.. చంద్రబాబుతో గ్రీన్ సిగ్నల్ ఇప్పించాలని కోరారట. వైసీపీ ఎమ్మెల్యేతో సంభాషణ అనంతరం సదరు మంత్రి గారు ఆసక్తికర వ్యాఖ్యలు చేసినట్లుగా చెబుతున్నారు.
'వైసీపీ ఎమ్మెల్యేలు మా తలుపులు తడుతున్నారు. మేం కూడా ముందూ వెనకా చూసుకుని.. అన్నీ ఆలోచించుకుని నిర్ణయం తీసుకోవాలనుకొంటున్నాం. పార్టీలో తగిన స్థాయిలో చర్చ తర్వాతే తుది నిర్ణయాలు జరుగుతాయి' అని ఆయన వ్యాఖ్యానించినట్లుగా తెలుస్తోంది. దీన్నిబట్టి టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్ మున్ముందు మరింత జోరందుకోబోతుందనేది స్పష్టం అవుతోంది.