కాషాయకోటలో ముగ్గురు మొనగాళ్ల సవాల్.. మోడీకి యువ నేతల దడ
గుజరాత్లో భవిష్యత్ కోసం ఆరాటం మొదలైంది. 22 ఏళ్ల క్రితం రాజకీయాలు తెలియని చిన్నారులు.. ఈనాడు తమ సామాజిక వర్గాలకు నేతలుగా మారారు. అధికార బీజేపీలో కలకలం స్రుష్టిస్తున్నారు.
Recommended Video
గాంధీనగర్: గుజరాత్లో 22 ఏళ్ల క్రితం ఒకరు బీజేపీ అధికారానికి వచ్చినప్పుడు రెండేళ్ల పసిబాలుడు, మరొకరికి పన్నెండేళ్లు, ఇంకొకరు 18 ఏండ్ల టీనేజ్ యువకుడు. ఆ వయసులో వారికి లోకం పోకడ, రాజకీయాలు తెలియవు. కానీ ఇప్పుడు ఆ ముగ్గురు ప్రజా నాయకులుగా ఎదిగారు. తమ సామాజిక వర్గాలకు నాయకత్వం వహిస్తూ గుజరాత్లో అధికార బీజేపీకి దడ పుట్టిస్తూ గంగ వెర్రులెత్తిస్తున్నారు. వారే పాటిదార్ రిజర్వేషన్ ఉద్యమ నాయకుడు, పాస్ కన్వీనర్ హార్దిక్ పటేల్ (24), దళిత వర్గాల నాయకుడు జిగ్నేశ్ మేవాని (34), ఓబీసీల నేతగా ఎదిగిన అల్పేశ్ ఠాకూర్ (40).
గుజరాత్ రాష్ట్ర రాజకీయాలను శాసించగల మూడు ప్రధాన ఓటు బ్యాంకులకు ప్రాతినిధ్యం వహిస్తున్న వీరికి అపూర్వంగా ప్రజాదరణ లభించడం, పైగా తమకు ప్రత్యర్ధులుగా ఉండటంతో ఈ అసెంబ్లీ ఎన్నికల్లో వారిని ఎదుర్కొని విజయం సాధించేందుకు బీజేపీ వ్యూహాలు రచిస్తున్నది. కాకపోతే ఈ ముగ్గురు యువనేతల కారణంగా కాంగ్రెస్ పార్టీ తన సీట్ల సంఖ్యను పెంచుకోవచ్చుగాని విజయం సాధించడం కష్ట సాధ్యమని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
పాటిదార్ల ఆందోళనపై ఉక్కుపాదం మోపిన గుజరాత్ సర్కార్
‘స్ప్రింగ్ కో బహుత్ దబాయా హై (స్ప్రింగ్ను చాలాకాలంగా నొక్కి పెట్టారు). గత 25 ఏళ్లలో రైతులు, వ్యాపారులు సహా ప్రజలకు ఏ మేలూ జరుగలేదు. నిరసన తెలిపిన వారిని భయపెడుతున్నారు, జైళ్లకు పంపుతున్నారు. వ్యాపారులు నిరసన గళం వినిపిస్తే వారిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు జరుగుతున్నాయి. అవినీతి భారీగా పెరిగిపోయింది. ప్రభుత్వ ఉద్యోగం కావాలంటే లక్షల రూపాయలు చెల్లించాల్సి వస్తున్నది. ఈ పరిస్థితి మారాలి. ఇందుకు సానుకూలమైన రాజకీయ ప్రత్యామ్నాయం ఏర్పడితే, పరిస్థితులు తప్పకుండా మారుతాయి' అని హార్దిక్ పటేల్ ఇటీవల పేర్కొన్నారు. హార్దిక్ సామాజికవర్గమైన పాటిదార్లు రాష్ట్రంలో 12-14 శాతం మధ్య ఉంటారు. వీరికి విద్య, ఉద్యోగాలలో ఓబీసీ రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ రెండేళ్ల క్రితం క్రితం హార్దిక్ పటేల్ ఉద్యమం ప్రారంభించారు. ఉద్యమం తీవ్ర రూపం దాల్చడంతో ప్రభుత్వం ఆయనను జైలుపాలుచేసి జాతి వ్యతిరేకి అన్న ముద్ర వేసింది. పాటిదార్ల ఆందోళనపై ఉక్కుపాదం మోపింది.
పాస్ వైఖరి తేల్చని హార్దిక్ పటేల్ వ్యూహం
పాస్ కన్వీనర్ హార్దిక్ పటేల్ను గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం ఆరు నెలల పాటు రాష్ట్ర బహిష్కారం చేసి పాటిదార్లలో లేని వ్యతిరేకత కొని తెచ్చుకున్నది. దీంతో గత రెండేళ్లలో అతని ఉద్యమానికి మద్దతు పెరిగిందే తప్ప తగ్గలేదు. వచ్చే నెలలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చిన హార్దిక్ ఏ పార్టీకి మద్దతునిస్తారన్నది మాత్రం ఇప్పటివరకూ వెల్లడించలేదు. ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతో ఆ పార్టీ న్యాయ విభాగం నాయకుడు కపిల్ సిబాల్ తదితరులతో పాటిదార్ ఉద్యమ నాయకులు చర్చలు జరిపారు. పాటిదార్ నాయకులతో జరిగిన చర్చల్లో కాంగ్రెస్ మూడు ప్రత్యామ్నాయాలు పెట్టినట్లు తెలుస్తోంది. పాటిదార్ నాయకులు కూడా తాము చర్చించుకుని, న్యాయ నిపుణులతో సంప్రదించాక తుది నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్ పార్టీకి చెప్పారు.
తొలి నుంచి కాంగ్రెస్ పార్టీకి ఓబీసీలు అనుకూలం
‘ఓబీసీల నుంచి వ్యక్తమవుతున్న ప్రభుత్వ వ్యతిరేకతకు బీజేపీ కులం ముద్ర వేసింది. నిజానికి మతం కార్డును ప్రయోగించింది బీజేపీనే. ఇప్పుడు మా పోరాటాలకు కులం రంగు పులుముతున్నది. మేము పేదలు, అభివృద్ధి ఫలాలు అందని వారి తరఫున పోరాడుతున్నాం. బీజేపీ ఆటలు ఇక సాగవు' అని ఓబీసీల నేత అల్పేశ్ ఠాకూర్ చెప్పారు. ప్రభుత్వ వ్యతిరేకతకు జాతి ద్రోహం ముద్ర వేస్తోంది బీజేపీ సర్కార్. ఇటీవల కాంగ్రెస్లో చేరిన అల్పేశ్ రాష్ట్రంలో మద్య నిషేధ చట్టాలను సక్రమంగా అమలు చేయాలని కోరుతున్నారు. గుజరాత్లో ఓబీసీలు 40 - 45 శాతం మధ్య ఉన్నారు. గుజరాత్లో తొలినుంచి దళితులు, ఓబీసీలు కాంగ్రెస్కు అనుకూలంగా ఉన్నారు.
ఫాసిస్టు ధోరణులను అరికట్టాలన్న జిగ్నేశ్
‘అభివృద్ధి ఫలాలు అందరికీ అందలేదు. దాదాపు అన్ని వర్గాలకు చెందినవారు ఆందోళనలు చేస్తున్నారు. అంగన్వాడీ వర్కర్లు, వ్యాపారులు, దళితులు, పాటిదార్లు, రైతులు పోరాడుతున్నారు. ముఖ్యంగా పెరుగుతున్న ఫాసిజం పోకడలను అరికట్టాల్సి ఉన్నది. ఈ విషయాన్ని ప్రజలు గ్రహిస్తున్నారు. భిన్న గ్రూపుల వారు తమ వైరుధ్యాలను మరిచి ఈ ఫాసిస్టు ధోరణులను ఓడించేందుకు సమైక్యం అవుతున్నారు. గుజరాత్లో బీజేపీని ఓడించడం 2019లో కీలకంగా మారుతుంది. అందుకే సిద్ధాంతాల విషయంలోనూ రాజీపడేందుకు సిద్ధపడ్డాను' అని దళిత నేత జిగ్నేశ్ మేవాని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏడు శాతం ఉన్న దళితులు ఉనా ఘటన తరువాత సంఘటితం అయ్యారు. గోవధపై నిషేధాన్ని అడ్డంపెట్టుకొని జరిగిన దాడులు కూడా దళితులను సంఘటితం చేశాయి. వచ్చే నెల 9, 14 తేదీల్లో రెండు దఫాలుగా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి.
పట్టణ యువతపైనే కమలనాథుల ఆశలు
గుజరాత్లో గత 22 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీకి ఇప్పుడు అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. ఓవైపు ప్రభుత్వ వ్యతిరేకత, మరోవైపు పుంజుకుంటున్న ప్రతిపక్ష కాంగ్రెస్, ఇంకోవైపు ముగ్గురు యువ నేతల వెనుకనున్న వర్గాలను తమవైపునకు తిప్పుకోవడం.. ఈ మూడు అంశాలకు బీజేపీ వేర్వేరు వ్యూహాలు రచిస్తున్నది. ఎన్ని ప్రతికూల అంశాలు ఉన్నా బీజేపీ మరోసారి 10 శాతం ఓట్ల తేడాతో అధికారానికి వస్తుందని ముందస్తు సర్వేలు పేర్కొంటున్నాయి. అసెంబ్లీలో 182 సీట్లుండగా, ఈ ఎన్నికల్లో కనీసం 150 స్థానాలు గెలవాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకున్నది. ఇటీవల కొన్ని వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను ప్రకటించడం, కనీసం 50 బహిరంగ సభల్లో ప్రధాని మోదీ పాల్గొననుండటం తమకు కలిసి వస్తుందని బీజేపీ నేతలు ఆశలు పెట్టుకున్నారు. అధిక సంఖ్యలో ఉన్న పట్టణ, నగరాల ఓటర్లు మరోసారి తమకే పట్టం కడుతారని ఆ నాయకులు ఆశలు పెట్టుకున్నారు.