'వీరప్పన్'ను పట్టించింది ఆ సగం ముక్కనే.. 'ట్రాప్' వెనుక బిజినెస్మ్యాన్
పోలీసుల ముందస్తు వ్యూహం ప్రకారం.. ఎస్సై వెల్లదురైకి ఆ సగం ముక్కను ఇచ్చి మారువేషంలో అడవుల్లోకి పంపించారు.
చెన్నై: ఒక్క స్మగ్లర్ మూడు రాష్ట్రాలను గడగడలాడించాడు. తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేశాడు. ఎక్కడ చిక్కుతాడో.. ఎలా వల పన్నాలో తెలియక.. పోలీసులు ఎన్నో విఫలయత్నాలు చేశారు. ఆఖరికి ఐపీఎస్ విజయకుమార్ నేత్రుత్వంలో 'వీరప్పన్' ఖతమయ్యాడు.
అయితే 13ఏళ్ల క్రితం జరిగిన ఈ ఆపరేషన్ కు సంబంధించి ఏ ఒక్క విషయం కూడా బయటకు పొక్కలేదు. ఎలా ప్లాన్ చేశారు? ఎక్కడ పట్టుకున్నారు?.. ఇవన్నీ మిస్టరీగానే మిగిలిపోయాయి. మాజీ ఐపీఎస్ విజయకుమార్ దీనిపై ఓ పుస్తకం రాస్తుండటంతో ఇన్నాళ్లకు ఆ మిస్టరీలో కొన్నైనా నిజాలు వెలుగుచూడబోతున్నాయి.
ఆ పారిశ్రామికవేత్తే కీలకం' :
తాజాగా ఆయన రాస్తున్న పుస్తకం నుంచి కొన్ని విషయాలు బయటకు లీక్ అవడం సంచలనం రేకెత్తిస్తున్నాయి. వీరప్పన్ ను మట్టుబెట్టడానికి ఓ పారిశ్రామికవేత్తను వాడుకున్నారన్నది దాని సారాంశం. చెన్నైకి చెందిన సదరు పారిశ్రామికవేత్తకు వీరప్పన్ తో సన్నిహిత సంబంధాలు ఉన్నట్టుగా తెలుస్తోంది.
అతనొక్కడికే వీరప్పన్ తో సంబంధాలు:
ఈ నేపథ్యంలోనే ఆ పారిశ్రామికవేత్త కదలికలపై ఓ కన్నేసి ఉంచిన పోలీసులు..వీరప్పన్ తో అతడికి సంబంధాలు ఉన్నట్టుగా నిర్ధారించుకున్నారు. ఇదే క్రమంలో వీరప్పన్ పంపించిన గూఢచారి ఒకరు పారిశ్రామికవేత్తను ఒక హోటల్ లో కలుసుకున్నాడు. కొద్దిసేపు ఇద్దరి దేని గురించో చర్చించుకున్నారు.
'కంటి ఆపరేషన్' నుంచి అసలు ఆపరేషన్:
గూఢచారి అక్కడినుంచి బయటకి వెళ్లిన వెంటనే.. కమెండో దళాలు పారిశ్రామికవేత్తను చుట్టుముట్టాయి. అడ్డంగా దొరికిపోయేసరికి.. ఇక చేసేదేమి లేక అతను నిజాలన్ని చెప్పేశాడు. కంటిచూపు మందగించిన కారణంగా.. తనకు ఆపరేషన్ చేయించాల్సిందిగా, అలాగే కొన్ని మారణయుధాలు పంపించాల్సిందిగా వీరప్పన్ వర్తమానం పంపించినట్టుగా పారిశ్రామికవేత్త అసలు నిజం చెప్పేశాడు.
మారువేషంలో ఎస్సై వెల్లదురై:
అంతే.. ఇక్కడినుంచి పోలీసుల అసలు ప్లాన్ మొదలైపోయింది. పారిశ్రామికవేత్తను పావులా వాడుకుని వీరప్పన్ ను మట్టుబెట్టడానికి పక్కా స్కెచ్ గీశారు. పేరుమోసిన రౌడీ అయోధ్యకుప్పం వీరమణిని ఎన్కౌంటర్ చేసిన ఎస్సై వెల్లదురైని మారువేషంలో వీరప్పన్ వద్దకు పంపాలని విజయకుమార్ నిర్ణయించారు. అనంతరం పారిశ్రామికవేత్తను కలిసి ఇదే విషయం చెప్పారు.
ఆ సగం ముక్క తెస్తేనే..
ఇక్కడినుంచి పోలీసులు చెప్పింది చెప్పినట్టు ఆ పారిశ్రామికవేత్త అనుసరించాడు. కంటి ఆపరేషన్ నిమిత్తం వీరప్పన్ కు పారిశ్రామికవేత్త కబురుపెట్టాడు. దీంతో వీరప్పన్ ముందుగా తన గూఢచారిని పారిశ్రామికవేత్త వద్దకు పంపించాడు.
'నా మనిషి ఒకరిని పంపిస్తాను.. వీరప్పన్ అతనితో కలిసి తిరుచ్చి లేదా మధురై వస్తే.. అక్కడ కంటి ఆపరేషన్ చేయిస్తాను' అని వీరప్పన్ పంపించిన గూఢచారికి పారిశ్రామికవేత్త చెప్పాడు. అనంతరం ఒక లాటరీ టికెట్ కొన్న గూఢచారి.. దాన్ని సగానికి చించేశాడు. అందులో ఒక ముక్కను తనవద్ద పెట్టుకుని, రెండో ముక్కను తీసుకొచ్చేవారితో వీరప్పన్ వస్తాడని చెప్పి వెళ్లిపోయాడు.
ప్లాన్ సక్సెస్.. వీరప్పన్ ఖతం..
పోలీసుల ముందస్తు వ్యూహం ప్రకారం.. ఎస్సై వెల్లదురైకి ఆ సగం ముక్కను ఇచ్చి మారువేషంలో అడవుల్లోకి పంపించారు. అడవుల్లో వీరప్పన్ ను కలుసుకున్న వెల్లదురై.. వీరప్పన్ ను తీసుకుని కంటి ఆపరేషన్ కోసమని బయలుదేరాడు. ప్లాన్ లో భాగంగానే ఏర్పాటు చేసిన అంబులెన్స్ లోకి వీరప్పన్, అతని అనుచరులను ఎస్సై ఎక్కించాడు.
అలా.. అంబులెన్స్ ధర్మపురి వద్దకు రాగానే.. అప్పటికే సిద్దంగా ఉన్న కమెండోలు అంబులెన్స్ పై కాల్పులు జరిపి వీరప్పన్ ను హతమార్చారు. ఇక్కడితో వీరప్పన్ స్మగ్లింగ్ ప్రస్థానానికి ఫుల్ స్టాప్ పడింది. ఏళ్లుగా వీరప్పన్ ను మట్టుపెట్టాలన్న మూడు రాష్ట్రాల కోరిక నెరవేరింది. అయితే ఈ మొత్తం వ్యవహరంలో కీలకంగా ఉన్న సదరు పారిశ్రామికవేత్త పేరు మాత్రం ఇప్పటికీ వెలుగుచూడలేదు.