రజనీ శ్రీలంక పర్యటన ఉద్దేశమిదీ...మీడియాకు లేఖ: బిక్కచచ్చిన పార్టీలు
తమిళనాడులోని రాజకీయ పార్టీల వ్యతిరేకత వల్ల శ్రీలకంలో తన పర్యటనను రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించిన రజనీకాంత్.. ఆ దేశంలో తాను చేయాలనుకున్న కార్యక్రమాలను ఒక లేఖలో బహిర్గతం చేశారు.
చెన్నై: తమిళనాడులోని రాజకీయ పార్టీల వ్యతిరేకత వల్ల శ్రీలకంలో తన పర్యటనను రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించిన రజనీకాంత్.. ఆ దేశంలో తాను చేయాలనుకున్న కార్యక్రమాలను ఒక లేఖలో బహిర్గతం చేశారు. రజనీ నిర్ణయంతో డీపీఐ, ఎండీఎంకే, తమిళ వాల్ ఉరిమై వంటి పార్టీలు పూర్తిగా పునరాలోచనలో పడ్డాయి.
శ్రీలంక సైన్యం అరాచకాలతో బిక్క చచ్చిన తమిళులను ఓదార్చాలనుకున్నానని, అలాగే తమిళ జాలర్లపై శ్రీలంక నావికాదళం చేస్తున్న దాష్టీకం గురించి కూడా ఆ దేశాధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనకు చెప్పాలనుకున్నానని, అయితే రాష్ట్ర పార్టీల నేతల విమర్శలతో తాను ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నానని రజనీ తన ప్రకటనలో తెలిపారు.
పార్టీలపై తమిళుల ఆగ్రహ జ్వాలలు
దీంతో తమిళుల్లో రజనీని విమర్శించిన పార్టీల పట్ల ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. విమర్శించిన పార్టీల నేతలు తమకు ఒరగబెట్టిందేమీ లేకున్నా.. ఎంతోకొంత చేద్దామనుకున్న రజనీని కూడా అడ్డుకున్నారని సాధారణ పౌరుల్లో నిరసన వ్యక్తమవుతోంది. దీంతో రజనీని విమర్శించిన పార్టీల నేతలు పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది. రజనీ ఇలాంటి నిర్ణయం తీసుకుంటారని ఊహించని ఆ నేతలు పూర్తిగా డైలమాలో పడిపోయారు.
బీజేపీ నేతలు మాత్రం రజనీ శ్రీలంక వెళ్లివుండాల్సిందని పేర్కొంటున్నారు. కేంద్ర సహాయమంత్రి పొన్ రాధాకృష్ణన్, రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్యస్వామి, రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్ ఇప్పటికైనా రజనీ తన నిర్ణయాన్ని పునఃపరిశీలించి శ్రీలంక వెళ్లి రావాలని విజ్ఞప్తి చేశారు. రజనీ పర్యటనతో ఇరుదేశాల మధ్య సుహృద్భావ వాతావరణం ఏర్పడడంతో పాటు తమిళ జాలర్ల సమస్య పరిష్కారమయ్యే అవకాశముందని వారు అన్నారు.
నేతల దురభిమానంతో సూపర్ స్టార్ మన:స్తాపం
కొంతమంది నేతలు దురభిమానంతో తనపై చేసిన విమర్శలతో సూపర్స్టార్ రజనీకాంత్ మనస్తాపానికి గురయ్యారు. 'మంచికి పోతే.. చెడు ఎదురైంది' అనే రీతిలో ఆ దేశంలోని తమిళుల బాగోగులు తెలుసుకునేందుకు తనకు మంచి అవకాశంగా భావించి శ్రీలంకలో జరిగే కొన్ని కార్యక్రమాలకు వెళ్దామనుకున్న తనపై కొంతమంది నేతలు లేనిపోని విమర్శలు చేయడమేంటని రజనీకాంత్ ఆగ్రహిస్తున్నట్లు వినికిడి. దీన్ని వెల్లడిస్తే లేనిపోని విమర్శలు వస్తాయన్న ఉద్దేశంతో ఆయన మిన్నకున్నారని తెలుస్తోంది.
శ్రీలంక - ఎల్టీటీటీఈ మధ్య యుద్ధంలో నష్టపోయిన తమిళులు
శ్రీలంక సైన్యం -ఎల్టీటీ మధ్య జరిగిన యుద్ధంలో జాఫ్నాలోని లక్షల తమిళులు తీవ్రంగా నష్టపోయారు. శ్రీలంక ప్రభుత్వం పక్షపాత వైఖరి కారణంగా ఇప్పటికీ అక్కడి తమిళులు నిలువ నీడ లేకుండా కేవలం గుడారాల్లోనే జీవనం సాగిస్తున్నారు. దీన్ని గమనించిన లైకా సంస్థ చైర్మన్ సుభాష్కరన్ వావునియా ప్రాంతంలో ఇళ్లు కోల్పోయిన నిరుపేద తమిళులకు 150 గృహాలను నిర్మించారు.
ఈ ఇళ్ల ప్రారంభోత్సవంతోపాటు లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు సూపర్ స్టార్ రజనీకాంత్ను ఆహ్వానించారు. వచ్చే నెల తొమ్మిదో తేదీన జరిగే ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు రజనీ కూడా సిద్ధమయ్యారు. ఈ కార్యక్రమానికి ఇంకా మలేషియా సెనేట్ సభ్యుడు లింగేశ్వరన్, తమిళ నేషనల్ ఫోరం చైర్మన్ సంబంధన్, యునైటెడ్ కింగ్డమ్కు చెందిన ఎంపీ జేమ్స్బెర్రీ, శ్రీలంక నార్త్ ప్రావెన్సీ సీఎం విఘ్నేశ్వరన్లతో పాటు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల తమిళులు కూడా తరలివస్తున్నారు.
పలు ప్రాంతాల్లో పర్యటనకు రజనీ రూట్ మ్యాప్
ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత రజనీ ముల్లైదీవు, కిళినొచ్చిన్, పుదుకుడియిరుప్పు తదితర ప్రాంతాల ప్రజలతో నేరుగా మాట్లాడేలా తన పర్యటనను రూపొందించుకున్నారు. లక్షల తమిళులు మృతి చెందిన వీరభూమికి వెళ్లాలని, చివరిగా శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనతో భేటీ అయి తమిళ జాలరుల విషయంపైనా చర్చించాలని కూడా భావించారు. ఈ మేరకు నిర్వాహకులు కూడా ఏర్పాట్లు చేపట్టినట్టు స్వయంగా రజనీయే తెలిపారు.
నోరు పారేసుకున్న పార్టీల నేతలు
రజనీ కాంత్ పర్యటన పూర్తి వివరాలేమీ గ్రహించలేని డీపీఐ నేత తిరుమావళవన్, ఎండీఎంకే నేత వైగో, తమిళ వాయ్వురిమై కట్చి నేత వేల్మురుగన్ వంటి నేతలు ప్రత్యక్ష, పరోక్ష విమర్శలు కురిపించారు. తమిళులను హతమార్చిన శ్రీలంకకు వెళ్లరాదని సూచించడంతో పాటు ఒకవేళ రజనీ అక్కడకు వెళితే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. తమిళ రాజకీయ పార్టీల తీరు పట్ల రజనీ తీవ్ర మనస్తాపం చెందినట్టు విశ్వసనీయంగా తెలిసింది.
తాను మంచి చేయాలనుకుంటే తననే తప్పు పట్టడమేమిటని రజనీకాంత్ తన సన్నిహితుల వద్ద ప్రశ్నించినట్టు తెలిసింది. గతంలో తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య జలచిచ్చు రేగినప్పుడు కూడా కొంతమంది అవగాహనా రాహిత్యంతో రజనీపై విమర్శలు కురిపించారు. కన్నడిగుడైన ఆయన.. తమిళనాడుకు ద్రోహం చేస్తున్నారని ఆగ్రహించారు. అయితే అప్పుడు రజనీ నేరుగా మీడియాకు వచ్చి సంధించిన ప్రశ్నలతో విమర్శకులు ఉక్కిరి బిక్కిరయ్యారు. కానీ అప్పటికే రజనీ వ్యవహారం పెద్ద వివాదమైంది. ఆయన మీడియా ముందు వివరణ ఇచ్చినా, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
ముందు జాగ్రత్తగా వెనక్కు తగ్గిన రజనీ
గత అనుభవాలను దృష్టిలో పెట్టుకునే రజనీకాంత్ ఈసారి ముందు జాగ్రత్త వహించినట్టు తెలుస్తోంది. జాతి, భాషా దురభిమానం గల రాష్ట్రంలో లేనిపోని వివాదాలకు కేంద్రబిందువు అయ్యే కన్నా, పక్కకు తప్పుకోవడం మంచిదన్న ఉద్దేశంతోనే ఆయన శ్రీలంక పయనాన్ని రద్దు చేసుకున్నట్టు తెలుస్తోంది. శ్రీలంక వెళ్లడం వల్ల తనకు వచ్చే లాభం గానీ, వెళ్లకపోవడం వల్ల జరిగే నష్టం గానీ లేనందున.. తానెందుకు వివాదాల్లో చిక్కుకోవాలన్న ఉద్దేశంతోనే ఆయన ఈ పర్యటనను రద్దు చేసుకున్నట్టు సమాచారం.