వైసీపీలో టెక్కలి 'చిచ్చు': తిలక్కే టిక్కెట్టు, కిల్లి కృపారాణికి చెక్?
శ్రీకాకుళం జిల్లా టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గం నుండి 2019 ఎన్నికల్లో తిలక్ వైసీపీ అభ్యర్థిగా పోటీచేస్తారని ఆ పార్టీ నేతలు ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారాంలు చేసిన ప్రకటన కలకలం రేపుతోంది.
టెక్కలి: శ్రీకాకుళం జిల్లా టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గం నుండి 2019 ఎన్నికల్లో తిలక్ వైసీపీ అభ్యర్థిగా పోటీచేస్తారని ఆ పార్టీ నేతలు ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారాంలు చేసిన ప్రకటన కలకలం రేపుతోంది. ఈ ప్రకటనపై తిలక్ వైరి వర్గం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తోంది. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అభ్యర్థిని ప్రకటించడంతో వైరివర్గానికి మింగుడుపడడం లేదు.
శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలోని వైసీపీలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకొన్నాయి. మంగళవారం 'నవరత్నాల' ప్రచారానికి సంబంధించి నియోజకవర్గ బూత్ కమిటీలతో నిర్వహించిన సమావేశంలో భాగంగా 'టెక్కలి' వైసీపీ టిక్కెట్ తిలక్కే అంటూ ఆపార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు, హైపవర్ కమిటీసభ్యులు తమ్మినేని సీతారాంలు ప్రకటించడంపై మిగిలిన ఆశావహుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది.
2019 ఎన్నికల్లో పార్టీ పరిస్థితిని, అభ్యర్థుల స్థితిగతులపై ప్రశాంత్కిషోర్ బృందం సర్వేలు నిర్వహిస్తోంది. ఈ బృందం సర్వే కొనసాగుతున్న సమయంలోనే టెక్కలి టిక్కెట్టు తిలక్కే అంటూ చేసిన ప్రకటన శ్రీకాకుళం వైసీపీలో చిచ్చును రేపుతోంది.
వచ్చే ఎన్నికల్లో ఏపీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు వైసీపీ ఇప్పటి నుండే ప్రయత్నాలను ప్రారంభించింది. ఈ తరుణంలో పార్టీలో గ్రూపు తగాదాలు నష్టం కల్గించే అవకాశాలు లేకపోలేదు.
తిలక్కు టెక్కలి టిక్కెట్టుపై వైరి వర్గంలో అసంతృప్తి
శ్రీకాకుళం జిల్లా టెక్కలి నుండి 2019 అసెంబ్లీ ఎన్నికల్లో తిలక్ వైసీపీ అభ్యర్థిగా పోటీచేస్తారని వైసీపీ అగ్రనేతలు చేసిన ప్రకటన తిలక్ వైరి వర్గంలో తీవ్ర అసంతృప్తిని మిగిల్చింది. ఏకపక్షంగా అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన తీరును సైతం దుమ్మెత్తి పోస్తున్నారు. ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉండగా.. ఇప్పటి నుంచి తిలక్కే టిక్కెట్ అని ప్రకటించడం వెనుక భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Recommended Video
కిల్లి కృపారాణికి చెక్ పెట్టేందుకేనా?
పార్టీ శ్రేణులు పక్కచూపులు లేకుండా, స్పష్టత ఇవ్వడం ఒకటి కాగా... మరోవైపు త్వరలో వైసీపీలోకి కేంద్ర మాజీమంత్రి డాక్టర్ కిల్లి కృపారాణి వస్తున్నారనే వార్తల నేపథ్యంలో ఆమెకు చెక్ చెప్పే ఉద్దేశంగా కన్పిస్తోంది. ధర్మానపై గుర్రుగా ఉన్న ఆపార్టీ రాష్ట్ర కార్యదర్శి దువ్వాడ శ్రీనివాస్కు ... టెక్కలి టిక్కెట్ ఆశిస్తున్న జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు చింతాడ మంజుకు ప్రాథమిక దశలోనే చెక్ చెప్పేందుకు ధర్మాన ఎత్తుగడని కొందరు కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు.
అచ్చెన్నాయుడును గెలిపించేందుకే
మరోవైపు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న ముఖ్య నాయకులు కొందరు దీనిపై లోతుగా చర్చించుకున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుకు పోటీగా బలమైన అభ్యర్థే బరిలో ఉండాలి తప్ప జిల్లా నాయకత్వం ఇప్పటినుంచే పేర్లు ప్రకటించడం సరికాదని ఇంకొందరు పేర్కొంటున్నారు. కేవలం అచ్చెన్నాయుడును గెలిపించేందుకు ఓ వర్గం నాయకుడి ఎత్తుగడలో భాగమేననే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.
పీకే బృందం సర్వేతో మార్పులు
క్షేత్రస్థాయిలో పార్టీ స్థితి గతులపై పీకే బృందం సర్వే నిర్వహిస్తోంది. దీంతో ఈ సర్వేలో వచ్చే ఫలితాల ఆధారంగా టిక్కెట్ల కేటాయింపులు ఉండే అవకాశం ఉంటుందని కూడ వైరి వర్గం నేతలు అభిప్రాయపడుతున్నారు. వైసీపీ అగ్రనేతలు ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారాంలు చేసిన ప్రకటనలు వైసీపీ టెక్కలి నియోజకవర్గంలో అసంతృప్తిని రాజేస్తున్నాయి.