చుక్కలు చూపిస్తున్న ‘టిమ్’లు: 12కి.మీకే రూ. 674ల టికెట్!
హైదరాబాద్ నగరంలోని ఆర్టీసీ బస్సులలో ఉపయోగిస్తున్న టిమ్ మెషీన్లు ఇటు ప్రయాణికులు, అటు కండకర్లకు షాకిస్తున్నాయి.
హైదరాబాద్: నగరంలోని ఆర్టీసీ బస్సులలో ఉపయోగిస్తున్న టిమ్ మెషీన్లు ఇటు ప్రయాణికులు, అటు కండకర్లకు షాకిస్తున్నాయి. 12 కిలోమీటర్లు కూడా లేని ఎల్వీ ప్రసాద్ టు కొండాపూర్కి రూ.674 ఇవ్వడంతో ఓ ప్రయాణికురాలు షాకయ్యారు. ఆ తర్వాత ఆ టికెట్ను ఫొటో తీసిన కొందరు ప్రయాణికులు సోషల్ మీడియాలో పెట్టేశాడు. దీంతో నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
వివరాల్లోకి వెళితే.. బుధవారం ఎల్వీప్రసాద్ ఇనిస్టిట్యూట్ దగ్గర ఆర్టీసీ బస్సు ఎక్కిన ప్రయాణికురాలికి కొండాపూర్ వెళ్లేందుకు కండక్టరు ఇచ్చిన టిక్కెట్లో రూ.674 వచ్చింది. దీంతో ఆమె ఆశ్చర్యపోయారు. ఈ విషయం కండక్టరుకు చెప్పడంతో వేరే టికెట్ ఇచ్చాడు.
అయితే, ఆలోపే ప్రయాణికులు తప్పుగా వచ్చిన టిక్కెట్ను ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశఆరు. దీంతో నెటిజన్లు ఆ టికెట్పై జోకులు, కామెంట్ల వర్షం కురిపించారు. ఈ క్రమంలో ప్రజారవాణాలో అగ్రస్థానంలో ఉన్న ఆర్టీసీలో సాంకేతిక పరిజ్ఞాన వినియోగంలో మాత్రం ఇంకా అభివృద్ధి సాధించాలని పలువురు పేర్కొంటున్నారు.
టిమ్ యంత్రాల్లో నెలకొంటున్న పలు సాంకేతిక సమస్యలు తప్పులకు దారితీస్తున్నట్లు తెలుస్తోంది. కొన్నిసార్లు సమయాలు, టిక్కెట్ల ధరలు సరిగా ముద్రితం కాక ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. టిమ్లలోని లోపాల కారణంగా ప్రయాణికుల రద్దీని అంచనా వేసుకొని.. బస్సుల సంఖ్యను పెంచడం, తగ్గించడం వంటి చర్యలు సాధ్యం కావడం లేదు. దీంతో ప్రయాణికులు ఉన్నా లేకున్నా.. బస్సులు రాకపోకలు సాగించాల్సి వస్తోంది.
కాగా, వివరాలు ప్రచురితం కాకుండా... బయటకు వచ్చిన తెల్ల రంగు టిక్కెట్పై పెన్నుతో రాసిన ఘటనలో ఓ కండక్టరు ఇటీవల సస్పెన్షన్కు గురయ్యారు. నాలుగు నెలలుగా జీతం లేక అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. రూ.14 టిక్కెట్ సరిగా ప్రచురితం కాని పాపానికి నాలుగు నెలలుగా లక్షన్నర రూపాయల జీతాన్ని కోల్పావాల్సి వచ్చింది. ఎప్పుడు మళ్లీ విధుల్లోకి తీసుకుంటారో ప్రశ్నార్థకంగా మారింది.
నగరవ్యాప్తంగా ఉన్న 28 డిపోల్లో టిమ్లు సరిగ్గా పనిచేయడం లేదని ఫిర్యాదులు వస్తున్నా ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం విచారకరం. వారి నిర్లక్ష్యానికి ప్రయాణికులతోపాటు కండకర్లు మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.