వచ్చే ఎన్నికల్లో జనసేన ఎంపీగా టాలీవుడ్ హీరో!: గుంటూరు నుంచి పోటీ?..
వచ్చే ఎన్నికల్లో ఆయన్ను ఎంపీగా బరిలో దింపడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
హైదరాబాద్: జనసేన రాజకీయం మొదలైనప్పటి నుంచి పవన్ ఒక్కడే 'సీన్'లో ఉంటూ వస్తున్నాడు. ఏక వ్యక్తి కేంద్రంగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని నడిపించడం పట్ల చాలానే విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే తన వన్ మాన్ షో ను పక్కనపెట్టి.. పార్టీలోకి కొత్త రక్తాన్ని ఎక్కించాలని పవన్ ప్రయత్నిస్తున్నారు.
ఇదే క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోను ప్రత్యేక ఇంటర్వ్యూల ద్వారా జనసేన కార్యకర్తలను ఎంపిక చేసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ తథ్యం అని ప్రకటించిన నేపథ్యంలో.. అప్పటికల్లా పార్టీని అన్ని అంశాల్లోను బలోపేతం చేయాలన్న కసరత్తులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇందుకోసం పవన్ ఓ మీడియాధినేతను తన రాజకీయ సలహాదారుగా నియమించుకున్నారన్న వార్తలు కూడా ఇటీవలి కాలంలో వినిపించాయి.
తాజాగా జనసేనకు సంబంధించి మరో ఆసక్తికర వార్త తెర పైకి వచ్చింది. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి పవన్ పోటీ ఖరారు కాగా.. ఆయనతో పాటు మరో వ్యక్తి పోటీ కూడా దాదాపు ఖరారైనట్లేనన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఎవరా వ్యక్తి అంటే.. టాలీవుడ్ హీరో.. కొంతకాలంగా ఏపీ ప్రత్యేక హోదా కోసం గొంతెత్తున్న 'శివాజీ'.
రాజకీయంగా బీజేపీతో కెరీర్ మొదలుపెట్టిన శివాజీ.. ప్రత్యేక హోదా విషయంలో ఆ పార్టీతో తెగదెంపులు చేసుకుని బయటకొచ్చారు. హోదా విషయంలో ప్రత్యేక హోదా సాధనా సమితితో కలిసి పోరాడుతూ వస్తున్నారు. అయితే వ్యక్తిగా కాకుండా.. ఏదైనా రాజకీయ పార్టీతో కలిసి పోరాడితేనే ఈ విషయంలో ప్రయోజనం ఉంటుందని ఆయన భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన చూపు జనసేనపై పడిందని చెబుతున్నారు.
ఇదే విషయం పవన్ చెవిన వేయగా.. ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని, వచ్చే ఎన్నికల్లో ఆయన్ను ఎంపీగా బరిలో దింపడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఎంపీగా ఎక్కడినుంచి పోటీ చేస్తారు? అన్న విషయంపై ప్రస్తుతానికి స్పష్టత లేకపోయినా.. గుంటూరు జిల్లా నుంచే శివాజీ బరిలో దిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు. మొత్తం మీద జనసేనలో శివాజీ రాజకీయం కూడా మొదలవబోతుందన్న చర్చ ప్రాధానత్యను సంతరించుకుంది. చూడాలి మరి!.. ఇవన్ని ఊహాగానాలకే పరిమితమవుతాయో లేక నిజంగానే జనసేన తరుపున శివాజీ ఎంపీగా పోటీ చేస్తారో!