ప్రాణం లేని ఫోన్.. వేల మంది ప్రాణాలు తీసింది.. ఇప్పుడు వేలానికొచ్చింది
ప్రాణం లేని ఓ పాత ల్యండ్ లైన్ టెలిఫోన్.. కొన్ని వేల ప్రాణాలను నిర్దాక్షిణ్యంగా తీసిందంటే.. వినడానికి ఆశ్చర్యంగా ఉంటుంది.. నమ్మబుద్ధి కాదుగానీ.. అది నిజం!
చెసాపెకే సిటీ: అదొక పాత కాలపు ల్యాండ్ లైన్ టెలిఫోన్. ఎర్రగా.. రక్తవర్ణంలో ఉంటుంది. కానీ దాని చరిత్ర వింటే ఎవరికైనా భయం కలగక మానదు. ప్రాణం లేని ఆ ఫోన్ కొన్ని వేల ప్రాణాలను నిర్దాక్షిణ్యంగా తీసిందంటే నమ్మబుద్ధి కాదుగానీ.. నిజమే మరి!
చరిత్ర ఎన్నటికీ మరచిపోని నియంత అడాల్ఫ్ హిట్లర్. బతికున్న రోజుల్లో ఆయన వినియోగించిన ఎర్ర రంగు పర్సనల్ ట్రావెలింగ్ ఫోన్ అది. ఇన్నాళ్లూ ప్రపంచం ఎరుగని ఈ ఫోన్ ఇప్పుడు ఉన్నట్లుండి వేలానికొచ్చింది.
రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీ ఓడిపోయాక.. హిట్లర్ రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న తరువాత.. బ్రిటన్ కన్జర్వేటివ్ పార్టీ నాయకుడు బ్రిగేడ్ సర్ రాల్ఫ్ రేనర్ బెర్లిన్ లోని హిట్లర్ బంకర్ ను చూసేందుకు వెళ్లారు.
ఆ సమయంలో రష్యా అధికారి ఒకరు ఈ రెడ్ ఫోన్ ను ఆయనకు అందజేశారట. ఇప్పడు రేనర్ కుమారుడే ఈ రెడ్ ఫోన్ ను వేలంలో అమ్మబోతున్నారు. చెసాపెకే సిటీలో జరగనున్న అలెగ్జాండర్ హిస్టారికల్ వేలంలో ఈ రెడ్ ఫోన్ ను వేలం వేయనున్నారు.
ఈ రెడ్ ఫోన్ పై నాజీ పార్టీ చిహ్నంతోపాటు హిట్లర్ పేరు కూడా చెక్కి ఉంది. ఈ ఫోన్ లో మాట్లాడటం ద్వారా హిట్లర్ వేలాది మంది ప్రాణాలు బలిగొన్నారని వేలం నిర్వాహకులు తెలిపారు.
ఈ వారాంతంలో జరగనున్న వేలంలో రెడ్ ఫోన్ కు కనీసం రెండు నుంచి మూడు లక్షల అమెరికన్ డాలర్లు ధర పలుకుతుందని భావిస్తున్నారు. ఈ ఫోన్ ను హిట్లర్ తన ఫీల్డ్ హెడ్ క్వార్టర్ తోపాటు రైలు, వాహన ప్రయాణంలోనూ వినియోగించేవారట. మరి దెయ్యంలాంటి ఈ ఫోన్ ను వేలంలో ఎవరు కొనుక్కుంటారో చూడాలి!