ప్రపంచ కొత్త మతం! అది పుట్టపర్తి సాయి బాబాతోనే!!: మనదేశంపై సీఐఏ నిఘా
అమెరికా గూఢచార సంస్థ గత కొంత కాలం క్రితం దివంగతులైన ఆధ్యాత్మిక గురువు సత్యసాయి బాబాపై ఆసక్తికర విషయాలను వెల్లడించింది.
న్యూఢిల్లీ: అమెరికా గూఢచార సంస్థ గత కొంత కాలం క్రితం దివంగతులైన ఆధ్యాత్మిక గురువు సత్యసాయి బాబాపై ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. భారతదేశానికి సంబంధించిన కోటీ20 లక్షల పేజీలను సీఐఏ ఇటీవలే ఆన్లైన్లో ఉంచింది. వీటిలో ఆంధప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా పుట్టపర్తి సాయిబాబా కార్యక్రమాలపై 1990వ దశకం నాటి 16 పేజీల నివేదిక కూడా ఉంది.
భారతదేశంపై 1940 దశకం నుంచి దాదాపు ఐదు దశాబ్దాలు సీఐఏ ఎన్ని విధాలుగా నిఘా వేసి ఉంచిందో తెలుసుకునేందుకు ఇవి ఉపయోగపడుతాయి. అయితే, ఆసక్తికరమైన అంశాల్లో సత్యసాయిపై రూపొందించిన నివేదికకు ఇప్పుడు ప్రత్యేకతను సంతరించుకుంది.
అద్భుతాలు చేసే వ్యక్తి చుట్టూ ప్రపంచ స్థాయి ప్రజా భక్తి ఉద్యమం వేళ్లూనుకుంటున్నదని ఈ నివేదిక రచయిత తొలి వాక్యాల్లో పేర్కొన్నారు. ఆర్థిక, మానవ వనరులతో కూడిన ఈ ఉద్యమం మరొక ప్రపంచ మతంగా ఉద్భవించే అవకాశాల్లేకపోలేదని రాశారు.
కల్కీ అవతార్గా అభివర్ణించడమే కాకుండా మళ్లీ పుట్టే ఏసు క్రీస్తు లేదా ముస్లిం రక్షకుడిగా పేర్కొన్నారు. ఆయన శాంతి, న్యాయాలతో కూడిన కొత్త ప్రపంచాన్ని సృష్టించబోతున్నారని సీఐఏ నివేదికలో పేర్కొంది.
గాల్లో ఆభరణాలు, వీభూతి సృష్టించడం, ఆకృతులు మార్చడం, ఎదుటివారి మనసులో ఏముందో తెలుసుకోవడం వంటి అద్భుతాలు సాయిబాబా చేస్తారని నివేదిక వెల్లడించింది. అదే సమయంలో సాయిబాబా చేసేదంతా మోసమని తేలిన పక్షంలో ఈ భక్తి ఉద్యమం కుప్పకూలిపోయేందుకు అవకాశాలు లేకపోలేదని ఆ నివేదిక చివరలో పేర్కొనడం గమనార్హం.