బాబుకు కెసిఆర్ నో ఇన్విటేషన్: అసలు రహస్యం ఇదీ...
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఆహ్వానించపోవడంపై తెలుగుదేశం పార్టీ నాయకులు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావుపై విమర్శలు చేస్తున్నారు.
అసలేం జరిగిందనేది ఎవరికీ అంతు చిక్కడం లేదు. చంద్రబాబును కెసిఆర్ ఆహ్వానించారా లేదా అనేది తేలడం లేదు. ఇరు ప్రభుత్వాలు కూడా ఈ విషయంపై ఏమీ మాట్లాడడం లేదు. అయితే ఈ విషయంపై పలు ఊహాగానాలు చెలరేగుతున్నాయి.
కెసిఆర్ పిలిచారా, లేదా...
ప్రపంచ తెలుగు మహాసభలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును తెలంగాణ కె చంద్రశేఖరరావు పిలిచారా, లేదా? పిలవకపోతే ఎందుకు పిలవలేదు? పిలిస్తే చంద్రబాబు ఎందుకు రాలేదు? అనే ప్రశ్నలు ముందుకు వస్తున్నాయి. ఇదే విషయంపై ప్రజల్లో కూడా పలు సందేహాలున్నాయి.
ఇలా జరిగిందట...
కేసీఆర్ తరఫున ఒకరు చంద్రబాబుకు అత్యంత అనుంగు అనుచరుడితో మాట్లాడారని, మహాసభలు ప్రారంభానికి చాలా ముందే ఫోన్లో ఆ సంభాషణ జరిగిందని సమాచారం. అయితే సభలు జరిగే సమయంలోనే చంద్రబాబు మాల్దీవులకు వెళ్లేందుకు పర్యటన ఖరారైందని, పర్యటనకు ముందు మరికొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు ఉండటం వల్ల హైదరాబాద్ రావడం కుదరదని చెప్పారని తెలుస్తోంది.
అధికారికంగా ఆహ్వానించినా కూడా..
ఆ స్థితిలో చంద్రబాబును కేసీఆర్ అధికారికంగా ఆహ్వానించినా ఆయన రాకపోతే బాగుండదని తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానించలేదని తెలుస్తోంది.. కేసీఆర్ ఆహ్వానిస్తే సభలకు తాను వెళ్లడం వల్ల కొన్ని సాంకేతిక సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని, అందువల్ల వెళ్లడం బాగుండదని చంద్రబాబు భావించారని అంటున్నారు.
అపవాదు రాకుండా ఇరువురు కూడా..
రెండు రాష్ట్రాలకు చెందిన నాయకులు కూడా తమపై అపవాదు రాకుండా జాగ్రత్త పడ్డారని అంటున్నారు. అయితే, చంద్రబాబు వస్తే తలెత్తే సాంకేతిక సమస్యలు ఏమిటనేది వెల్లడి కావడం లేదు. మొత్తం మీద, చంద్రబాబును ఆహ్వానించలేదనే నిందను మాత్రం కెసీఆర్ మోస్తూనే ఉన్నారు.