జగన్కు జనం షాక్: రెండు గంటలు ఎదురుచూసి?.. ఎందుకలా చేశారు?
జనం లేకపోవడంతో.. చేసేదేమి లేక జగన్ తన రోడ్ షోను రెండు గంటలు వాయిదా వేసుకున్నట్లు చెబుతున్నారు.
నంద్యాల: ఓటేశాక.. ఏ నాయకుడు ఎక్కడికి పోతాడో?, ఎవరు ఎవరిని పట్టించుకుంటారో తెలియదు గానీ ఓట్లకు ముందు మాత్రం ఓటర్లను ప్రసన్నం చేసుకోవడమే మహద్భాగ్యంగా నాయకులు వ్యవహరిస్తుంటారు. గంటల తరబడి ఎండలో తిరుగుతూ.. లోపల నుంచి చికాకు తన్నుకొస్తున్నా.. ఏమాత్రం చెరగని చిరునవ్వుతో ఓటర్లను ఆప్యాయంగా పలకరిస్తుంటారు.
ఒకరకంగా ఇది ఓటర్ల టైమ్. మిగతా ఐదేళ్లు ఎలా ఉన్నా కథ నడిచిపోతుంది కానీ.. ఈ మూన్నాళ్లు మాత్రం ఓటర్ల పట్ల ఓపికగా వ్యవహరించాల్సిందే. వాళ్లు నిలదీసినా.. తిరగబడ్డ.. ఏమాత్రం ఆవేశానికి పోకుండా వారిని సముదాయించేందుకే ప్రయత్నించాలి. సభలు, సమావేశాలకు జనం లేటుగా వచ్చినా.. వాళ్ల కోసం ఎదురుచూసి మరీ వారిని ప్రసన్నం చేసుకోవాలి.
ఒకవేళ జనం పలుచబడ్డారే అనుకో!.. ప్రత్యర్థి చేతికి చిక్కినట్లే. చూశారా!.. ఆ సభకు జనం ఎవరూ వెళ్లలేదన్న ప్రచారాలు పుట్టుకొస్తాయి. అందుకే జన సమీకరణ విషయంలో అధినేతలు ముందుగానే పక్కా ప్లాన్ తో వెళ్తుంటారు. అయినా సరే అప్పుడప్పుడు చేదు అనుభవాలు తప్పవు.
సరే ఇదంతా పక్కనపెడితే.. రోడ్ షోలతో నంద్యాల ప్రచార పర్వాన్ని పరుగులు పెట్టిస్తున్న జగన్కు కూడా జనం షాక్ ఇచ్చారట. ఐదో రోజులో ప్రచారంలో భాగంగా నంద్యాల శ్రీనివాస సెంటర్ లో ప్రచారానికి వెళ్లిన సమయంలో ఆయనకు ఈ అనుభవం ఎదురైందట. జగన్ వెళ్లారు సరే గానీ.. అప్పటికీ జనమెవరూ అక్కడికి రాలేదట.
జనం లేకపోవడంతో.. చేసేదేమి లేక జగన్ తన రోడ్ షోను రెండు గంటలు వాయిదా వేసుకున్నట్లు చెబుతున్నారు. ఆ సమయంలో సమీపంలోనే ఉన్న మాజీ ఎమ్మెల్యే రామనాథ్రెడ్డి కుమారుడు, వైసీపీ నేత ప్రతాప్ రెడ్డి ఇంట్లో రెండున్నర గంటలపాటు గడిపారట. ఆ తర్వాత 11:30 గంటల సమయంలో జనం తరలిరావడంతో ఆయన రోడ్ షో ప్రారంభమైంది.