ఇది పక్కా: లోక్సభ ఎన్నికల్లోగా ఏపీకి ప్రత్యేక హోదా ఖాయమే?
Recommended Video
హైదరాబాద్/ అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఖాయం అని దేశ రాజధాని 'హస్తిన'లోని రాజకీయ సర్కిళ్లలో వదంతులు షి'కారు' చేస్తున్నాయి. ప్రత్యేకించి కేంద్రంలో బీజేపీ సారథ్యం వహిస్తున్న నేషనల్ డెమొక్రటిక్ అలయెన్స్ (ఎన్డీయే) సర్కార్ 2019 ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదా ప్రకటించాకే.. 'ప్రజా తీర్పు' కోసం ముందుకు వెళ్లనున్నదని వినికిడి. కాకపోతే ఆంధ్రప్రదేశ్ వాసులు ఐదేళ్లపాటు (2014 - 19) మధ్య ప్రత్యేక హోదాకు దూరం కావాల్సి వస్తుందేమోనని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
ఏపీ సీఎం చంద్రబాబు సారథ్యంలోని తెలుగుదేశం పార్టీతో సంబంధ బాంధవ్యాలు తెగదెంపులు చేసుకోవడానికి ముహూర్తం కోసం.. సరైన సమయం కోసం కమలనాథులు వేచి చూస్తున్నారని వినికిడి. అలా సరైన టైంలో టీడీపీతో తెగదెంపులు చేసుకున్నాక.. ప్రత్యేక హోదాపై అధికారిక ప్రకటన చేస్తారని సమాచారం.
పొత్తు కోసం వైఎస్ జగన్ ఇలా బీజేపీ ముందు షరతు
ఏపీలో భారీగా లోక్ సభ స్థానాలు గెలుచుకుని తన పునాదిని బలోపేతం చేసుకోవాలని కమలనాథులు వ్యూహం రూపొందిస్తున్నారు. దక్షిణాదిలో బలం పెంచుకోవాలని కలలు కంటున్న బీజేపీ.. టీడీపీతో పొత్తు తెంచుకుని..ప్రతిపక్ష వైఎస్ జగన్ సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పొత్తు కుదుర్చుకుని కనీసం 12 మంది ఎంపీలను గెలుచుకోవాలన్న లక్ష్యం బీజేపీ మదిలో ఉన్నదని విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన రెడ్డి కూడా ఒక షరతు పెట్టారని సమాచారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వం ప్రత్యేక హోదా కల్పించకుండా ఆ బీజేపీతో చేతులు కలుపబోమని వైఎస్ జగన్ అన్నారని తెలుస్తున్నది.
15 ఎంపీ సీట్లు కేటాయించడానికి వైఎస్ జగన్ రెడీ
కాకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తామని 2019 ఎన్నికల ముందు బీజేపీ అధికారికంగా ఒక ప్రకటన చేయాల్సి ఉంటుంది. తమకు మళ్లీ అధికారం ఇస్తే ప్రత్యేక హోదా ఇస్తామని పేర్కొనాలి. దాంతోపాటు టీడీపీతో పొత్తు విడగొట్టుకుని ఆ వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపేందుకు సిద్ధ పడాల్సి ఉంటుంది. అద్గది సంగతన్నమాట. బీజేపీ వర్గాలు, ఇటు వైఎస్ జగన్ సన్నిహిత వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పొత్తుకు బీజేపీ సిద్ధమైతే.. 15 ఎంపీ స్థానాలను ఆ పార్టీకి కేటాయించేందుకు ఏపీ ప్రతిపక్ష నేత సిద్ధమన్న వార్తలు వినిపిస్తున్నాయి. అసెంబ్లీలో మాత్రం పరిమిత స్థానాలు కేటాయించడానికి వైఎస్ జగన్ సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. బీజేపీ కూడా వచ్చే లోక్ సభ ఎన్నికల్లో దక్షిణాది నుంచి అధికంగా లోక్సభ సీట్లు గెలుచుకోవాలని కమలనాథులు కలలు గంటున్న సంగతి తెలిసిందే. కొన్ని నెలలుగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ, తనతో సమావేశమైన ఏపీలో ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన రెడ్డితో ఇదే విషయం చెప్పారని కరాఖండిగా తెలిసింది.
పదేళ్ల హోదా కోసం పట్టుబట్టిన టీడీపీ, బీజేపీ
ఆర్థిక వనరులేమీ లేకపోగా, 2014లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పార్లమెంట్ ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం' ఆమోదించడానికి ప్రత్యేకించి రాజ్యసభలో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఐదేళ్ల పాటు ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. పార్లమెంట్ ఉభయ సభల్లో ఒక సభలో ప్రధాని చేసిన ప్రకటన చట్టం కిందకే వస్తుంది. కానీ టీడీపీ, బీజేపీ మాత్రం నాడు పదేళ్లు కావాలని నానా గొడవ చేశాయి. ఎన్నికల్లో గెలుపొందాక.. 2015లో తెలంగాణలో ఓటుకు నోటుకు కేసు బయట పడ్డాక టీడీపీ ‘ప్రత్యేక హోదా' డిమాండ్ను అటకెక్కించింది. కానీ ఏపీలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఒకవేళ బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటిస్తే చేతులు కలిపేందుకు సిద్ధమని ఇటీవల ప్రధాని మోదీతో కలిసినప్పుడు వైఎస్ జగన్ చెప్పారని సమాచారం.
ముందు హోదాపై అధికారిక ప్రకటనతో ముందుకెళ్లాల్సిందే
ఒకవేళ ప్రత్యేక హోదా ప్రకటించకుండా ఎన్నికల్లో ముందుకు వెళితే ప్రజల ముందుకు వెళితే విశ్వాసం కోల్పోవాల్సి వస్తుందని రెండు పార్టీల నేతలు ఒక నిర్ణయానికి వచ్చినట్లు చెప్తున్నారు. ప్రత్యేక హోదాపై ప్రకటన చేయకుండా వెళితే ప్రజలు ఓటేయకపోవచ్చుననే సందేహాలు బీజేపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల్లో వ్యక్తం అవుతున్నాయి. ఇటీవల వైఎస్ జగన్ తన సొంత దిన పత్రిక సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ ఈ విషయం ప్రస్తావించడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రధాని నరేంద్రమోదీ ప్రత్యేక హోదా ప్రకటిస్తారని, దీనిపై ప్రధాని మోదీ సానుకూలంగా ఉన్నదని వైఎస్ జగన్ చెప్పారు. ఒకవేళ అదే జరిగితే తాము బీజేపీతో కలిసి పని చేసేందుకు సిద్ధమేనని తేల్చి చెప్పారు.
హోదాపై ఆత్మరక్షణలో పడ్డ ఏపీ సీఎం చంద్రబాబు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పొత్తు కోసం ప్రత్యేక హోదాపై ప్రకటించేందుకు బీజేపీ సిద్ధమైతే.. అప్పుడు టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు చివరి క్షణాల్లో.. ప్రత్యేక హోదాపై ప్రకటన చేయనున్న చివరి క్షణాల్లో ఏం చేస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. 2014 లోక్ సభ ఎన్నికల్లో 15 ఏళ్ల పాటు ఏపీకి ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేసిన చంద్రబాబు.. ఈ విషయమై బీజేపీతో ఘర్షణ పడలేరు. అలాగని వెనుకడుగు వేయలేరు. విపక్షాలు తీవ్రస్థాయిలో ప్రత్యేక హోదా కోసం పోరాడితే, ప్రత్యేక ప్యాకేజీతో సరిపెట్టుకున్న నేపథ్యం టీడీపీ అధినేత చంద్రబాబు. అసలు ప్రత్యేక హోదా ముగిసిపోయిన అధ్యాయమని కూడా చంద్రబాబు చెప్పేశారు మరి. ప్రస్తుతం ప్యాకేజీ, హోదా కోసం పట్టుబట్టలేని పరిస్థితుల్లో ఉన్న చంద్రబాబు పూర్తిగా ఆత్మరక్షణలో పడ్డారు. వైఎస్ జగన్మోహనరెడ్డి మాదిరిగా లోక్సభ స్థానాలు బీజేపీకి కేటాయించడానికి టీడీపీ అధినేత చంద్రబాబు సిద్ధంగా లేరు. దీంతో టీడీపీతో బీజేపీకి పొత్తు చెల్లిపోతుందా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.