కాంగ్రెసు సెంటిమెంట్ అస్త్రం: నల్లగొండ నుంచి లక్ష్మి?
నల్లగొండ: వచ్చే శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గంలో సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగించడానికి సిద్ధపడుతోంది. నల్లగొండ మున్సిపల్ చైర్ పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మిని నల్లగొండ నుంచి పోటీ దించాలనే ఆలోచన చేస్తోంది.
లక్ష్మి భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్ ఇటీవల హత్యకు గురైన వషయం తెలిసిందే. అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) బొడ్డుపల్లి శ్రీనివాస్ను హత్య చేయించిందని కాంగ్రెసు పార్టీ విమర్శిస్తోంది.
రాహుల్ గాంధీతో మాట్లాడి...
టీఆర్ఎస్కు తగిన గుణపాఠం చెప్పాలనే ఉద్దేశంతో కాంగ్రెసు పార్టీ ఉంది. అంతేకాకుండా సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగించాలని అనుకుంటోంది. ఇందులో భాగంగా హత్యకు గురైన బొడ్డుపల్లి శ్రీనివాస్ భార్య లక్ష్మిని నల్లగొండ అసెంబ్లీ సీటు నుంచి పోటీకి దించే యోచనలో ఉంది. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో ప్రకటన చేయించడానికి పూనుకుంటోంది.
మరి కోమటిరెడ్డి ఎలా...
ప్రస్తుతం నల్లగొండ శాసనసభ నియోజకవర్గానికి కాంగ్రెసు నేత కోమటిరెడ్డి వెంకట రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. హత్యకు గురైన శ్రీనివాస్ కోమటిరెడ్డికి అత్యంత సన్నిహితుడు. దీంతో లక్ష్మిని నల్లగొండ సీటునుంచి పోటీ చేయించేందుకు ఆయన అంగీకరించినట్లు చెబుతున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్లగొండ లోకసభ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం ఉంది.
ఎమ్మెల్యే వీరేశంపై ఆరోపణలు
బొడ్డుపల్లి శ్రీనివాస్ను నకిరేకల్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల వీరేశం హత్య చేయించారని కాంగ్రెసు పార్టీ ఆరోపిస్తోంది. హత్యకు ముందు నిందితులు ఎమ్మెల్యే వీరేశం బంధువులు ఫోన్లో మాట్లాడిన కాల్ డేటాను బయటపెట్టింది.
రాహుల్ను రప్పించి...
బొడ్డుపల్లి శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించడానికి రాహుల్ గాంధీని రప్పించాలని కాంగ్రెసు పార్టీ నాయకులు అనుకుంటున్నారు. ఆ సమయంలోనే రాహుల్ గాంధీతో బొడ్డుపల్లి లక్ష్మి పోటీపై ప్రకటన చేయించాలని భావిస్తున్నారు. కోమటిరెడ్డి లోకసభకు పోటీ చేయడానికి సిద్ధంగానే ఉన్నట్లు చెబుతున్నారు.