చంద్రబాబు బ్రేకప్: నితీష్ కుమార్ సంచలన నిర్ణయం
Recommended Video
పాట్నా: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బిజెపి నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఎ) నుంచి తెగదెంపులు చేసుకున్న నేపథ్యంలో ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి మరిన్ని చిక్కులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది.
చంద్రబాబు ప్రత్యేక హోదాను ఎత్తుకోవడంతో బీహార్ ముఖ్యమంత్రి, జెడీయు అధినేత నితీష్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీహార్కు ప్రత్యేక హోదా ఇవ్వాలనే తన డిమాండ్ను మరోసారి తెరపైకి తేవాలని అనుకుంటున్నారు.
ఆ విషయం చెప్పారు...
బీహార్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని నితీష్ కుమార్ నిర్ణయం తీసుకున్న వియాన్ని జెడియూ నేత కెసి త్యాగి ధ్రువీకరించారు. బీహార్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని గతంలో నితీష్ కుమార్ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే ఆ డిమాండ్పై పోరాటాన్ని ఉధృతం చేస్తామని కూడా త్యాగి చెప్పారు.
ఎన్డీఎలో ఉండి కూడా...
ప్రస్తుతం జెడియు ఎన్డీఎలో కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న రాజకీయ పరిస్థితులు బీహార్లో తలెత్తకుండా నితీష్ కుమార్ ముందుగానే జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది. ఆరారియా లోకసభ ఉప ఎన్నిక ఫలితం కూడా నితీష్ కుమార్ను పునరాలోచనలో పడేసింది. అర్జెడీ ఆ స్థానాన్ని కైవసం చేసుకున్న నేపథ్యంలో జెడియూ భవిష్యత్తుపై ఆయన ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. చంద్రబాబు పరిస్థితి తనకు రాకూడదని నితీష్ కుమార్ భావిస్తున్నట్లు సమాచారం.
ఎపిలో జగన్, పవన్ ఇలా..
ఎన్డీఎలో కొనసాగుతూ ప్రత్యేక హోదాపై చంద్రబాబు ఇంత కాలం రాజీ పడినట్లు కనిపించారు. దీంతో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ప్రత్యేక హోదా నినాదాన్ని ఎత్తుకుని రాజకీయంగా బలపడాలని చూశారు. అది కొంత మేరకు ఫలితం కూడా ఇచ్చింది. ఆ తర్వాత జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబను నిలదీశారు. దీంతో చంద్రబాబు ఆత్మరక్షణలో పడి రాజకీయ భవిష్యత్తు కోసం అనివార్యమైన స్థితిలో చంద్రబాబు ఎన్డీఎతో తెగదెంపులు చేసుకున్నారు.
ఉప ఎన్నికల ఫలితాల ప్రభావం...
నితీష్ కుమార్ తాజా ఉప ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కూడా ఎన్డీఎలో కొనసాగే విషయంపై పునరాలోచన చేస్తున్నట్లు చెబుతున్నారు. ప్రత్యేక హోదా వస్తే బీహార్లో పరిశ్రమలకు ప్రత్యేక రాయితీలు లభిస్తాయనే నినాదాన్ని తీసుకుని నితీష్ కుమార్ ముందుకు సాగాలని అనుకుంటున్నారు.
తేజస్వీ యాదవ్ ఇలా
ఉప ఎన్నికల ఫలితాలు, చంద్రబాబు నిర్ణయం నేపథ్యంలో ప్రత్యేక హోదా డిమాండ్ను తెరమీదికి తేకపోతే రాష్ట్రంలో పరిస్థితి మారే ప్రమాదం ఉందని ఆయన అనుకుంటున్నట్లు చెబుతున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రెండు కీలకమైన లోకసభ స్థానాలను బిజెపి కోల్పోవడం రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఆర్జెడీ నేత తేజస్వి యాదవ్ తన దూకుడును పెంచుతున్నారు. బీహార్కు ప్రత్యేక హోదా అంశాన్ని తేజస్వీ యాదవ్ అసెంబ్లీలో గతవారం ప్రస్తావించారు. నితీష్ కుమార్పై తీవ్రమైన విమర్శలు చేశారు. బిజెపితో చేతులు కలపగానే నితీష్ కుమార్ ప్రత్యేక హోదాను మరిచిపోయారని ఆయన అన్నారు. సరిగ్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితులు బీహార్లో చోటు చేసుకుంటాయనే ఆందోళనతో నితీష్ కుమార్ ఉన్నట్లు చెబుతున్నారు.