బాబు ప్లాన్: 40 మంది ఎమ్మెల్యేలకు నో టికెట్స్, బాలకృష్ణకూ?
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇప్పటి నుంచే వచ్చే ఎన్నికలకు కసరత్తు చేస్తున్నారు. పనితీరు బాగా లేని సిట్టింగ్ ఎమ్మెల్యేలను పక్కన పెట్టాలని ఆయన అనుకుంటున్నట్లు సమాచారం.
దాదాపు 40 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వడం లేదని ఆయన ఇప్పటికే బలమైన సంకేతాలను పంపినట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన పార్టీ సమన్వయ సమావేశంలో ఆయన ఆ సంకేతాలు ఇచ్చారు. ఆ తర్వాత ఆయన సర్వే చేయించి ఎమ్మెల్యే పనితీరును అంచనా వేసినట్లు చెబుతున్నారు.
రెడ్ జోన్లో 40 మంది ఎమ్మెల్యేలు
దాదాపు 40 మంది ఎమ్మెల్యేలు రెడ్ జోన్లో ఉన్నట్లు చంద్రబాబు రెండు నెలల క్రితం జరిగిన సమన్వయ కమిటీ సమావేశంలో చంద్రబాబు చెప్పినట్లు సమాచారం. శనివారం, ఆదివారాలు జరిగే సమావేశాల్లో విషయాన్ని ఆయన స్పష్టంగా చెప్పే అవకాశం ఉంది.
బిజీగా ఉన్నా కూడా...
పరిపాలనా వ్యవహారాలతో, విదేశీ పర్యటనలో తీరిక లేకుండా ఉన్నప్పటికీ చంద్రబాబు శానససభ్యుల తీరుపై కన్నేసి, సర్వే చేయించినట్లు చెబుతున్నారు. పనితీరు బాగా లేని ఎమ్మెల్యేలకు లంచ్ పెట్టి, నమస్తే పెడుతానని చంద్రబాబు సమన్వయ కమిటీ సమావేశంలో అన్నారు.
ఇదే తగిన సమయం...
ఆ 40 మంది ఎమ్మెల్యేలకు నమస్తే చెప్పేందుకు చంద్రబాబు సిద్ధమైనట్లు చెబుతున్నారు. ఇప్పుడే ఆ 40 మంది ఎమ్మెల్యేల స్థానాల్లో ఎవరిని పోటికి దింపాలనే విషయంపై కూడా ఆలోచన చేస్తారని అంటున్నారు. ఇప్పటి నుంచే వారు పనిచేసుకోవడానికి ఇది వీలు కల్పిస్తుందని అంటున్నారు.
హిందూపురం నుంచి నారా లోకేష్
హిందూపురం నుంచి తన తనయుడు నారా లోకేష్ను నిలబెట్టాలని చంద్రబాబు ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. బాలకృష్ణను పార్లమెంటుకు పోటీకి దించాలనే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. ఒకవేళ బాలకృష్ణ అందుకు అంగీరించకపోతే రాజ్యసభకు పంపించడానికి చంద్రబాబు సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు.