నిజమేనా?: పవన్ కల్యాణ్కు దిలీప్ సుంకర దూరం
హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కల్యాణ్కు కల్యాణ్ దిలీప్ సుంకర దూరమైనట్లు ప్రచారం సాగుతోంది. ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు గానీ ఆ విషయంపైనే సినీ క్రిటిక్ మహేష్ కత్తి ట్వీట్ చేశారని అంటున్నారు.
దిలీప్ సుంకర జనసేన క్రియాశీలక కార్యకర్త మాత్రమే కాకుండా పవన్ కల్యాణ్ అభిమాన సంఘం నాయకుడు కూడా. జనసేన తరఫున పవన్ కల్యాణ్ తర్వాత అంతగా ప్రసంగ ధాటిని ప్రదర్శించగలరని ఆయనకు పేరుంది. పార్టీ పరంగా పవన్ కల్యాణ్ తర్వాత పార్టీలో ఆయనదే స్థానమని కూడా చెబుకుంటారు.
చర్చల్లో చురుగ్గా...
జనసేన కార్యకర్తగా టీవీ చానెల్స్ చర్చల్లో చురుగ్గా పాల్గొంటూ వచ్చేవారు దిలీప్ సుంకర. సోషల్ మీడియాలో కూడా చాలా చురుగ్గా వ్యవహరిస్తూ వచ్చారు. పార్టీపైనా, పవన్ కల్యాణ్ మీదా వచ్చే విమర్శలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ ఉంటారు. మహేష్ కత్తితో వివాదం విషయంలో కూడా ఆయన చురుగ్గా కనిపించారు. మహేష్ కత్తిని ఎదుర్కోవడంలో మాటల తెగువ చూపించారు.
నిజమేనా...
కల్యాణ్ దిలీప్ సుంకర పార్టీకి వీడ్కోలు పలికారని, ఇక జనసేన అభిమానిగా కూడా కొనసాగదలుచుకోలేదని కల్యాణ్ దిలీప్ సుంకర పేరుతో ఉన్న ఫేస్బుక్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. దాన్ని మహేష్ కత్తి స్క్రీన్ షాట్ తీసి ట్విట్టర్లో తన వ్యాఖ్యను జొడించారు. అయితే, ఆ ఫేస్బుక్ ఖాతా కల్యాణ్ దిలీప్ సుంకరది కాదనే వాదన కూడా ఉంది. మహేష్ కత్తి అనవసరంగా ఇటువంటివి సృష్టిస్తున్నారని కూడా అంటున్నారు.
అయితే ఇలా ఉందని...
కల్యాణ్ దిలీప్ సుంకర అధికార ఫేస్బుక్ పేజీలో మాత్రం పార్టీకి సంబంధించిన పోస్టులు కనిపంచడం లేదు. ఇదంతా ఫొటో షాప్ మహిమ అంటూ వవన్ కల్యాణ్ అభిమానులు కొందరు కొట్టిపారేస్తున్నారు. కల్యాణ్ దిలీప్ ఖాతాలో చివరి పోస్టు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు ఉంది.
మహేష్ కత్తి చేసిన ట్వీట్ ఇదీ..
"This is the reality of Janasena (ఇది జనసేన నిజస్వరూపం). వ్యక్తి మీద అభిమానంతో, పార్టీ మీద ప్రేమతో అహర్నిశలూ ఆలోచించి, శ్రమపడి, పాటుపడిన ఒక సామాన్యుడికి దక్కేది అవమానం. అంతకన్నా ఏమీ లేదు. జనసేన పార్టీ ఫ్యాన్స్ క్లబ్ కి ఎక్కువ తోకపార్టీకి తక్కువ. ఇప్పటికైనా ఆలోచించుకొండి మిత్రులారా!" అంటూ మహేష్, కత్తి వ్యాఖ్యానించారు.
దిలీప్ నుంచి స్పందన లేదు..
తన గురించి ఇంతగా ప్రచారం సాగుతున్నా, వివాదం చెలరేగుతున్నా కల్యాణ్ దిలీప్ సుంకర నుంచి ఎటువంటి స్పందన కూడా రాలేదు. ఆ ప్రచారంపై ఆయన ట్వీట్ చేయడమో, ఫేసుబుక్లో పోస్టు పెట్టడమో చేసి ఉంటే వివాదానికి తెర పడేదని అంటున్నారు. అయితే, కల్యాణ్ దిలీప్ సుంకరపై జరుగుతున్న ప్రచారంలో ఎంత వరకు నిజం ఉందనేది మాత్రం చెప్పడం సాధ్యం కాదు.
జనసేనలో ఇలా జరిగింది...
జనసేన అధికార ప్రతినిధి బాధ్యతలను కల్యాణ్ దిలీప్ సుంకరకు ఇస్తారనే ప్రచారం జరిగింది. కానీ అద్దెపల్లి శ్రీధర్కు ఆ పదవి దక్కింది. అద్దెపల్లి శ్రీధర్ ఇటీవలే బిజెపికి రాజీనామా చేసి జనసేనలో చేరారు. అప్పుడు కూడా కల్యాణ్ దిలీప్ను ఉద్దేశించి మహేష్ కత్తి ట్వీట్ చేశారు.