బట్టలు లేకుండానే ఊరేగిన రాజు లాగా.. 'బాబు' అప్పుడేం చేశావు?: నిప్పులు చెరిగిన జగన్
అమరావతి: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 117వ రోజు బుధవారం వైసీపీ అధినేత జగన్ గుంటూరు జిల్లా చిలకలూరిపేట బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ నాలుగేళ్లలో రాష్ట్రంలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరని, ఇచ్చిన హామిలను నెరవేర్చని చంద్రబాబు ఎవరికీ న్యాయం చేయలేకపోయారని విరుచుకుపడ్డారు. హోదాపై చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు.
Recommended Video
నేడే దిగ్బంధం: ఆ ముసుగులో వైసీపీ 'విధ్వంసం'?.. టీడీపీ సంచలనం
అప్పుడేం చేశావు?:
ఈ పెద్దమనిషి నాలుగేళ్ల క్రితం ఏమన్నాడు.. ప్రత్యేక హోదాయే సంజీవని. పదేళ్లు దేనికీ సరిపోదు.. పరిశ్రమలు కట్టడానికే నాలుగేళ్లు పడుతుంది కాబట్టి ఎంత లేదన్నా రాష్ట్రానికి 15ఏళ్ల పాటు ప్రత్యేక హోదా కావాలని అన్నాడు. తెస్తానని హామి కూడా ఇచ్చాడు.
కేంద్రంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 2014, మార్చి 2న రాష్ట్ర విభజన అనంతరం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కేబినెట్ లో తీర్మానం చేసింది. ఆ మేరకు ప్లానింగ్ కమిషన్కు ఆదేశాలు కూడా జారీ చేసింది.
అదే ఏడాది చంద్రబాబు సీఎం అయిన 7నెలల వరకు ఆ ఫైల్ ప్లానింగ్ కమిషన్ వద్దే ఉంది. ఆ సమయంలో చంద్రబాబు ఏం చేసినట్టు?.. అని జగన్ ప్రశ్నించారు. 2015లో ప్లానింగ్ కమిషన్ను రద్దు చేసి.. నీతి ఆయోగ్ ను తీసుకొచ్చినా.. చంద్రబాబు పట్టించుకోలేదన్నారు.
అనగనగా రాజు గారి కథ:
చంద్రబాబును ప్రశంసిస్తున్న ఆయన అనుకూల మీడియాను చూస్తే నాకో కథ గుర్తుకు వస్తుంది. అనగనగా ఒక అన్యాయమైన రాజు ఉండేవాడట. నోరు తెరిస్తే అబద్దాలు.. మోసాలు. ఓరోజు దేవతా వస్త్రాలపై ఆయన మనసు పడిందట. దీంతో రాజ్యంలోని చేనేతలకు కబురు పెట్టారట. అప్పటికే ఆ రాజు పాలనతో విసుగు చెందిన ప్రజలు ఆయనకు బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నారట.
మూర్ఖులకు కనిపించవన్నారు:
మూడు నెలల సమయం తీసుకుని దేవతా వస్త్రాలు తయారు చేసి రాజు వద్దకు వచ్చారట చేనేతలు. పెద్ద పెద్ద పెట్టెల్లో వస్త్రాలను తీసుకొచ్చి.. అయ్యా.. ఈ దేవతా వస్త్రాలు మూర్ఖులకు కనిపించవు. ఉత్తములకే కనిపిస్తాయని అన్నారట. వాటిని ధరించడానికి రాజును పక్క గదిలోకి తీసుకెళ్లి.. ఒంటి మీద బట్టలు విప్పి దేవతా వస్త్రాలు వేస్తున్నట్టు నటించారట. అక్కడ నిజంగా వస్త్రాలే లేకపోయినా.. ఈ కలర్ బాగుంది.. రాజు గారికి భలే నప్పింది అని పొగిడారట. దీంతో రాజు గారు కూడా బ్రహ్మాండం అన్నారట.
బట్టలు లేకుండానే ఏనుగు మీద ఊరేగింపు..:
నేతన్నలు చేసిన శాస్తి అర్థం గాక.. సదరు రాజు అలాగే బట్టలు లేకుండా సభలోకి వచ్చారట. అయినప్పటికీ.. అక్కడ ఉన్న వంధిమాగదులు.. అంటే, చంద్రబాబుకు సంబంధించిన టీవిలు, పేపర్లు లాగా.., వాళ్లంతా రాజు గారు వస్త్రాలు బ్రహ్మాండంగా ఉన్నాయని పొగిడారట. దీంతో ఈ బట్టలతో ఏనుగు మీద ఊరేగాలని బయలుదేరారట రాజు గారు. దారిలో ఓ చిన్న పిల్లవాడు.. 'రాజు గారికిబట్టలు లేవు.. షేమ్.. షేమ్..' అనడంతో అప్పుడు తెలిసొచ్చిందట.
ఎల్లో మీడియా.. :
'నేను చెప్పిన కథంతా మీకు తెలిసిందే. అలాంటి రాజే మన చంద్రబాబు కూడా. నాడు ఆ రాజుకు తాన తందానా అన్న వాళ్లు ఈ జన్మలో ఎల్లో పేపర్లు, ఎల్లో టీవీ చానళ్లు. చంద్రబాబు ఏమన్నా.. దానికి తందానా అనడమే వీటి పని. ప్యాకేజీ అన్నా పొగడుతాయి.. చంద్రబాబు యూటర్న్ తీసుకుని హోదా అన్నా అహా ఓహా అంటాయి.'అని జగన్ తీవ్ర స్థాయిలో విమర్శించారు.