కేసిఆర్ థర్డ్ ఫ్రంట్ జోష్ వెనక ఉన్నది ఆయనే
Recommended Video
హైదరాబాద్: బిజెపి, కాంగ్రెసులకు వ్యతిరేకంగా అనూహ్యంగా థర్డ్ ఫ్రంట్ ప్రతిపాదనను తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తీసుకుని వచ్చారు. అవసరమైతే తానే మూడో కూటమికి నాయకత్వం వహిస్తానని చెప్పారు.
కేసీఆర్ జాతీయ రాజకీయాలపై ఆసక్తి కనబరిచి ముందుకు దూకడం వెనక ఉన్నది రాజ్యసభ సభ్యుడు కె. కేశవరావు అనే మాట వినిపిస్తోంది. మూడో కూటమి గురించి కేసిఆర్ మాట్లాడే సమయంలో ఆయన పక్కనే కేకే ఉన్నారు.
కేకే సంబంధాలతో ఇలా..
టిఆర్ఎస్లో చేరడానికి ముందు కేశవరావు కాంగ్రెసులో ఉన్నారు. ఆయన జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ కాంగ్రెసు వ్యవహారాల ఇంచార్జీగా వ్యవహరించారు. ఆ సంబంధాలను థర్డ్ ఫ్రంట్కు కేసిఆర్ నాయకత్వంలో మద్దతును కూడగట్టేందుకు అప్పటి సంబంధాలను కేశవరావు వాడుతున్నట్లు తెలుస్తోంది.
వారి ఫోన్ల వెనక
థర్డ్ ఫ్రంట్ను ఏర్పాటు చేసి, దానికి నాయకత్వం వహిస్తానని కేసీఆర్ ప్రకటించిన వెంటనే తృణమూల్ కాంగ్రెసు అధినేత, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్డీ, జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ ఫోన్ చేసి మద్దతు ప్రకటించారు.
మమతా ఇలా చెప్పారు
మమతా బెనర్జీతోనూ హేమంత్ సొరేన్తోనూ కేశవ రావు మాట్లాడారని, ఆ తర్వాతే వారు మద్దతు తెలియజేశారని అంటున్నారు. కేసిఆర్తో కలిసి పనిచేస్తానని, భావసారూప్యం కలిగిన పార్టీలను కూడగట్టడానికి తాను కూడా ప్రయత్నిస్తానని మమతా బెనర్జీ చెప్పినట్లు తెలుస్తోంది.
కాంగ్రెసు నుంచి టిఆర్ఎస్లోకి..
కేశవరావు 2013లో టిఆర్ఎస్లో చేరారు. ఆయనను పార్టీ ప్రధాన కార్యదర్శిగా చేశారు. జాతీయ వ్యవహారాల కమిటీలో ఆయన నెంబర్ 2గా ఉంటూ వచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆయన పాత్ర చాలా వరకు తగ్గిపోయింది.
అప్పుడు చిక్కుల్లో కేకే
కేశవరావు కుటుంబం ఆ మధ్య మియాపూర్ భూ కుంభకోణంలో చిక్కుకుంది. అయితే, తన కుటుంబ సభ్యులెవరూ అక్రమాలకు పాల్పడలేదని ఆయన స్పష్టం చేశారు. చట్టబద్దంగానే భూమిని కొన్నామని, అయితే వివాదం చెలరేగడంతో ఆ డీల్ను రద్దు చేసుకుంటున్నామని కూడా కేశవరావు వివరణ ఇచ్చారు. దాంతో దాదాపుగా వివాదం ముగిసింది.
కొద్ది రోజులుగ కసరత్తు
గత కొద్ది రోజులుగా కేశవరావు కేసీఆర్ పక్కనే ఉంటూ వస్తున్నారు. జాతీయ రాజకీయాలపై కసరత్తు కారణంగా కేశవరావు ఆయనతో ఎక్కువగా ఉంటున్నట్లు తెలుస్తోంది. పార్టీ రాజ్యసభ సభ్యుడైన కేశవరావు అనుభవాన్ని కేసీఆర్ వాడుకుంటారని చెబుతున్నారు.